Saturday, January 9, 2016

కీలెరిగి వాత.. అదే మోడి మంత్ర..


కీలెరిగి వాత...
అదే మోడి మంత్ర...

By Sadanand Bembre

ఒకరి అవసరాలను మన దేశప్రయోజనాలకు అనుకూలంగా మలచుకోవడమే అసలు సిసలు దౌత్యనీతి. ఈ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ గతంలో ఏ ప్రధానికి సాధ్యం కాని అసాధ్యాలను నరేంద్ర మోడి సుసాధ్యం చేసి చూపుతున్నారు. దశాబ్దాల పాటు భ్రష్టు పట్టి పోయిన విదేశీ సంబందాలను తనదైన పంథాలో గాడిలో పెడుతూ అగ్రరాజ్యాలను అశ్చర్యానికి గురి చేస్తున్నారు.

మోడీ వ్యవహర శైలి స్వదేశంలో ప్రధాన ప్రతిపక్షాలను, స్వపక్షంలో ఉన్న విపక్షాన్ని మెప్పించలేకపోయినా.. వ్యూహాత్మక అంశాలపై భారత్ దౌత్య నీతి పదును తేలిందనే సంకేతాలను ప్రపంచ దేశాలకు పంపడంలో  ఆయన ఇప్పటికే ఘన విజయం సాధించాడు. ఈ నేపథ్యంలోనే నిన్న మొన్నటి వరకు భారత్ ను చిన్న చూపు చూసిన దేశాలన్నీ కూడా ఇండియాతో సంబంధాలను సరిచేసుకోక తప్పని అనివార్య స్థితిని సృష్టించడమే మోడి సాధించిన మొదటి దౌత్య విజయమని చెప్పవచ్చు.

వెనకటి వెన్నెముక లేని ప్రభుత్వాల నిర్వాకం ఫలితంగా భారత వ్యూహాత్మక రక్షణ విధానం కూడా దారుణంగా దెబ్బతింది. ఈ కారణంగానే శ్రీలంక, నేపాల్, మాల్దీవులు వంటి దేశాలు కూడా చైనాకు దగ్గరయ్యే పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. ఈ కారణంగానే మోడీ వ్యూహాత్మకంగా ప్రదాని ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భారత ఉపఖండంలోని దేశాల అధినేతలను అహ్వానించినప్పుడే ఆయన ఏ ఉద్దేశ్యంతో ఉన్నారో ప్రపంచ దేశాలకు అర్థమయ్యింది. ఈ క్రమంలోనే నిన్నటి దాక పట్టించుకోనట్లు నటించిన దేశాలు అన్ని తమ వైఖరులను విడనాడే పరిస్థితులు సృష్టించారు.

మోడిని ప్రసన్నం చేసుకోవడం ఇప్పుడు పాశ్చాత్య దేశాలకు అవసరం గనుక పొగుడుతున్నారు. ఇదే నరేంద్ర మోడి గుజరాత్ ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు అమెరికా సహా పాశ్చాత్య దేశాలు అన్ని కూడ బలుక్కున్నట్లు మత తత్వ వాదిగా ముద్ర వేసి తమ దేశాలకు రాకుండా నిషేధం విదించడం అప్పుడే ఎలా మర్చిపోగలం? హఠాత్తుగా వారు తమ వ్యూహం మార్చుకోవడానికి వారి స్వార్థ ప్రయోజనాలు కాపాడుకోవడానికే కాని మోడిపై అభిమానంతో ఎంత మాత్రం కాదు. చైనాను కట్టడి చేయడం కోసం అమెరికా, ఐరోపా పెద్దన్న రష్యా ప్రాబల్యాన్ని తగ్గించడం కోసం యూరోపియన్ యూనియన్ దేశాలకు భారత్ లాంటి పెద్ద రాజ్యంతో చెలిమి అవసరం.
అదీ కాకుండా ప్రపంచం మొత్తంలో అతిపెద్ద మార్కెట్ కలిగిన.. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం కూడా భారత్ మాత్రమే. డొమెస్టిక్ క్రైసిస్ తో కూనారిల్లిపోయిన అమెరికన్ అర్థిక వ్యవస్థకు అర్థికంగా దన్నును ఇవ్వగలిగిన శక్తి సామర్థ్యాలు మార్కెట్ అవసరాల పరంగా భారత్ మాత్రమే దానికి కనిపిస్తున్న ఏకైక ఆశాకిరణం. ప్రపంచంలో రెండవ అతిపెద్ద అర్థిక వ్యవస్థ కలిగిన చైనా కూడా మార్కెటింగ్ పరంగా భారత్ కంటే పెద్దదే అయినా అది దిగుమతి చేసుకునే పరిస్థితులు అసలే లేవు. అంతేకాకుండా చౌక వస్తువులు ఉత్పత్తి చేసి ప్రపంచం మొత్తం మీద అతిపెద్ద ఎగుమతి దారుగా ఆవిర్భవించింది. అలాగే ప్రపంచం మొత్తం మీద అత్యధిక డాలర్ల విదేశీ ద్రవ్య నిల్వలు కలిగి ఉండటం.. సోషలిస్టు దేశం కావడం వంటి అంశాలు అమెరికన్ పాలకులకు కలవరపెడుతున్న కారణంగా బౌగోళికంగా చైనాకు పొరుగునే ఉన్న భారత్ కు కూడా దానితో సత్సంబంధాలు సరిగ్గా లేకపోవడం వంటి కారణాల వల్ల అమెరికా వ్యూహాత్మక విధానాలలో భాగంగానే ఇండియాతో చెలిమికి అరాటపడుతోంది.

అదీ కాకుండా సోవియట్ పతనం తర్వాత కుప్పకూలిపోయిన అవశేష రష్యా వ్లాదిమిర్ పుతిన్ నేతృత్వంలో పూర్వ వైభవం సంతరించుకునే దిశగా ప్రస్థానిస్తుండటం కూడా అమెరికన్ పాలకులకు కంటగింపు కలిగించే విషయం.  దురాక్రమణ నెపంతో రష్యాపై అంక్షలు విదించి అర్థికంగా చక్రబంధంలో ఇరికించడం ద్వారా తన చెప్పు చేతల్లో ఉంచుకునేందుకు వ్యూహం రచించింది. ఈ క్రమంలో రష్యా ఉత్పత్తి చేస్తున్న చమురును కొనుగోలు చేయకుండా అడ్డుకుంటోంది.

అయితే అమెరికాతో కంటే రష్యాతోనే భారత్ బలమైన సంబంధం కలిగి ఉన్నందున దాన్నుండి దూరం చేసేందుకు వ్యూహాత్మకంగా భారత్ కు తాను అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు నటిస్తోందంతే.

No comments:

Post a Comment