Wednesday, January 27, 2016

షాజీ మహరాజ్ కాలంలోనే మన పూర్వీకుల వలస


By Sadanand Bembre

మనం ఏ కాలంలో ఇక్కడకు వచ్చాం.. ఏ పని మీద వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యాం అనే విషయంలో మాకు సంపూర్ణంగా అవగాహన ఉంది. మేం మన మిత్రులకు మొదటి నుండి చెబుతూనే వస్తున్నాం.

పూర్వీకులు శివాజీ తండ్రి గారైన షాజీ మహరాజ్ ప్రొద్బలంతోనే ఇక్కడి కి వచ్చి స్థిరపడ్డాం అంతేకాని కొంత మంది పెద్దలు చెబుతున్నట్లు అడుక్కు తినడానికో..భయపడో .. సేవకులుగానో ఇక్కడకు రాలేదు.

వితండవాదం చేసే వారికి చరిత్ర పరిజ్ఞానం శూన్యం. మనం ముమ్మాటికి క్షత్రీయ వర్గం వారమే.. మనం మరాఠా లమన్నది ఎంత నిజమో క్షత్రీయులు అన్నది కూడా అంతే నిజం. కాదని వాదించే వారెవరైనా ఉంటే అది వారి అవగాహన రాహిత్యమే అవుతుంది. అలాంటి వారు మనం క్షత్రీయులు ఎందుకు కాదన్న విషయం నిరూపించగలగాలి. అలాగే భారా మాసే, అక్రుమాసే వైరుధ్యాలు వివరించాలి.

ఈ సమస్యంతా కూడా  మన పూర్వీకుల వలసపై చరిత్రలో నమోదు కాకపోవడం మనకు శాపంగా పరిణమించింది. మనకు లాగే దేశవ్యాప్తంగా అక్కడక్కడా కూడా మన మరాఠా సామాజిక వర్గం ఉంది. వారు కూడా ఇలాంటి స్థితినే ఎదుర్కొంటున్నారు.

మనం చేయాల్సిందల్లా సహేతుకమైన ఆదారాలను సంపాదించి చరిత్రను పునః లిఖించుకోవడమే. అందుకు మరాఠా చరిత్ర పరిశోధకులు, మన మూలాల చరిత్ర పై అవగాహన ఉన్న పెద్దల సహాకారం తీసుకుందాం.

ఈ దిశగా మేం చేస్తున్న కృషి సరైన దిశలోనే కొనసాగుతోందని మాకు లభిస్తున్న ఆధారాలను బట్టి  స్పష్టంగా అవగతమవుతోంది.


Tuesday, January 26, 2016

చత్రపతి శివాజీ


                        ఛత్రపతి శివాజీ

చఁతపతి శివాజీగా ఖ్యాతి పొందిన శివాజీ రాజే భోంస్లే (ఫిబ్రవరి 19, 1630[1] - మార్చి 4, 1680) పశ్చిమ భారతదేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించాడు.

ఉపోద్ఘాతం

శివాజీ తండ్రి అయిన షాహాజీ నిజాంషాహీల ప్రతినిధిగా ఉంటూ మొఘల్ రాజులను వ్యతిరేకిస్తూ యుద్ధాల్లో పాల్గొనేవాడు. నిజాంషాహీలపైన షాజహాన్ దండయాత్ర చేసినపుడు షాహాజి సైనికులను బలోపేతం చేయడంలో కీలక పాత్ర వహించాడు. తన ఆదేశాలను ధిక్కరించినందుకు లఖూజీ జాదవ్‌రావ్ అనే మరాఠా యోధున్ని నిజాంషాహీ ప్రభువు హత్య చేయించాడు. ఇది నచ్చని షాహాజీ నిజాంషాహీ ప్రభువు పైన తిరుగుబాటు బావుటా ఎగురవేసి స్వతంత్ర మరాఠా సామ్రాజ్యానికి నాంది పలికాడు.

బాల్యం

శివాజీ క్రీ.శ. ఫిబ్రవరి 19, 1627వ సంవత్సరం వైశాఖమాసపు శుక్లపక్ష తదియనాడు పూణే జిల్లాలోని జున్నార్ పట్టణం దగ్గర గల శివనేరి కోటలో శహాజీ, జిజాబాయి పుణ్యదంపతులకు జన్మించాడు.[2][3][4]. జిజాబాయికి శంభాజీ తర్వాత పుట్టిన కొడుకులు అందరూ మృతి చెందగా ఆమె పూజించే దేవత అయిన శివై (పార్వతి) పేరు శివాజీకు పెట్టింది.

షాహాజీ నిజాంలను ఓడించి గెలుచుకున్న ప్రాంతాల్లో సామ్రాజ్యాన్ని నెలకొల్పడానికి ప్రయత్నిస్తుండగా, మొఘలులు ఆదిల్షాతో కలసి షాహాజీని ఓడించారు. ఆదిల్షాతో సంధి ప్రకారం షాహాజి ప్రస్తుత బెంగుళూరు ప్రాంతాన్ని జాగీరుగా పొంది, పూణే వదిలి వెల్లవలసి వచ్చింది. షాహాజీ పూణేలో తనకున్న జాగీరును వదులుకోవలసిన అవసరం లేకుండా ఒప్పందం కుదుర్చుకొన్నాడు.

సామ్రాజ్య అంకురార్పణ

షాహాజీ పూణేలో తన జాగీరు వ్యవహారాలను తన భార్యకు అప్పగించి యువకుడయిన శివాజీకి రాజనీతి వ్యవహారాలు నేర్పడానికి కొందరు ముఖ్య అనుచరులతో కలసి ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి తాను బెంగుళూరు జాగీరుకు వెళ్ళాడు. శివాజీ తల్లి అతనికి పుట్టిన భూమి పైన, ప్రజల పైన ప్రేమ కలుగునట్లు విద్యాబుద్దులు నేర్పింది. చిన్నప్పటినుండి భారత రామాయణ గాథలు చెప్పి వీర లక్షణాలు మొలకింప చేసింది. పరమత సహనం, స్త్రీల పట్ల గౌరవం తన తల్లివద్దనే నేర్చుకున్నాడు. తన తండ్రి పొందిన పరాజయాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి అనతి కాలంలో శివాజీ యుద్ధ తంత్రాలలో నిష్ణాతుడయ్యాడు. సకల విద్యలు తెలుసుకొన్న శివాజీ మరాఠా సామ్రాజ్య స్థాపనే లక్ష్యంగా తన వ్యూహాలు మొదలు పెట్టాడు.

సుల్తానులతో యుద్ధాలు

17 ఏళ్ళ వయసులో శివాజీ మొట్టమొదటి యుద్ధం చేసి బిజాపూర్ సామ్రాజ్యానికి చెందిన తోర్నా కోటను సొంతం చేసుకున్నాడు. మరో మూడేళ్ళలో కొండన, రాజ్‌ఘడ్ కోటలను సొంతం చేసుకొని పూణే ప్రాంతాన్నంతా తన స్వాధీనంలోకి తెచ్చుకున్నాడు.

శివాజీ తమ కోటలను సొంత చేసుకోవడం చూసి ఆదిల్షా మోసపూరితంగా శివాజీ తండ్రి అయిన షాహాజీని బందీ చేసాడు. తర్వాత శివాజీని, బెంగుళూరులో ఉన్న శివాజి అన్న అయిన శంభాజీని పట్టుకోవడానికి రెండు సైన్యాలను పంపగా అన్నదమ్ములిరువురు ఆ సైన్యాలను ఓడించి తమ తండ్రిని బంధ విముక్తుడిని చేయించుకున్నారు. అప్పుడు ఆదిల్షా యుద్ధ భయంకరుడుగా పేరు పొందిన అఫ్జల్ ఖాన్‌ను శివాజీ పైకి యుద్ధానికి పంపించాడు.

ప్రతాప్‌ఘడ్ యుద్ధం

ఆఫ్జల్ ఖాన్‌ను కత్తితో పొడుచుచున్న శివాజీ
శివాజీ మెరుపుదాడులు, గెరిల్లా యుద్ధ పద్దతులు తెలుసుకొన్న అఫ్జల్ ఖాన్ అతడిని ఓడించడానికి యుద్ధభూమి మాత్రమే ఏకైక మార్గమని తలచి శివాజీని రెచ్చకొట్టడానికి శివాజీ ఇష్ట దైవమయిన భవానీ దేవి దేవాలయాలను కూల్చాడు. ఇది తెలిసిన శివాజీ తాను యుద్ధానికి సిద్దముగా లేనని చర్చలకు ఆహ్వానించాడు. ప్రతాప్‌ఘడ్ కోట దగ్గర సమావేశమవడానికి ఇద్దరూ అంగీకరించారు.

అఫ్జల్ ఖాన్ సంగతి తెలిసిన శివాజీ ఉక్కు కవచాన్ని ధరించి పిడిబాకు లోపల దాచుకున్నాడు. ఇద్దరూ కేవలం తమ అంగరక్షకులతో గుడారంలోకి వెళ్ళి చర్చలు జరుపుతుండగా అఫ్జల్ ఖాన్ దాచుకున్న కత్తితో శివాజీ పైన దాడి చేసినపుడు ఉక్కు కవచం వల్ల శివాజీ తప్పించుకున్నాడు. అంతలో అడ్డు వచ్చిన వారిని శివాజీ అంగరక్షకుడు ఎదుర్కొని పోరాడుతుండగా, శివాజీ కత్తి దెబ్బ తిని గుడారం బయట వెళ్ళిన అఫ్జల్ ఖాన్‌ను శివాజీ సైనికాధికారి కత్తివేటుతో నేల కూల్చాడు.

అఫ్జల్ ఖాన్ సేనను శివాజీ సేన దట్టమయిన అడవుల్లో అటకాయించి మెరుపుదాడులతో మట్టికరపించింది. ఈ విజయంతో శివాజీ మరాఠా యోధుడిగా మహారాష్ట్ర అంతా పేరు తెచ్చుకున్నాడు. ఎలాగయినా శివాజీని అణచాలని బీజాపూర్ సుల్తాన్ యుద్ధవీరులుగా పేరు తెచ్చుకున్న ఆఫ్ఘన్ పస్థూన్ సైనికులను పంపించగా, శివాజీ సేన వేల సంఖ్యలో పస్థూన్లను చంపి విజయం సాధించింది. ఈ సంఘటనతో శివాజీ కీర్తి ప్రతిష్టలు భారతదేశమంతా వ్యాపించాయి. ఎందరో హిందూ రాజులకు శివాజీ ఆదర్శంగా నిలిచాడు.

కొల్హాపూర్ యుద్ధం

ఇది సహించలేని బిజాపూర్ సుల్తాన్ అరబ్, పర్షియా, ఆఫ్ఘన్ నుండి మెరికల్లాంటి 10,000 మంది కిరాయి సైనికులను శివాజీని అంతమొందించడానికి పంపగా శివాజీ తన వద్దనున్న 5,000 మరాఠా యోధులతో కలసి కొల్హాపూర్ వద్ద ఎదుర్కొన్నాడు. 'హర హర మహాదేవ ' అంటూ శివాజీ యుద్ధరంగంలో విజృభించి శతృవులను ఊచకోత కోశాడు. ఈ విజయంతో కేవలం సుల్తానులే కాక మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబుకు సైతం శివాజీ అంటే భయం పుట్టింది. శివాజీ నుండి ఎప్పటికయినా తనకు ముప్పు తప్పదని ఔరంగజేబు భావించి సన్నాహాలు మొదలు పెట్టాడు.తన మేన మామ షాయైస్త ఖాన్ ను శివాజీ పై యుద్ధానికి పంపాడు.

పవన్‌ఖిండ్ యుద్ధం

రెండుసార్లు పరాజయాన్ని ఎదుర్కొన్న అదిల్షా మూడవసారి సిద్ది జోహార్ అనే పేరు పొందిన సైన్యాధ్యక్షుడికి అపారమయిన సైనిక, ఆయుధ బలగాలు అందించి కొల్హాపూర్ పంపించాడు. ఆ సమయంలో కొల్హాపూర్ దగ్గరలో ఉన్న పన్‌హాలా కోటలో శివాజీ కొన్ని వందలమంది అనుచరులతో ఉన్నాడు. సిద్ది జోహార్ విషయం తెలుసుకొన్న శివాజీ ఎలాగయినా పన్‌హాలా కోట నుండి తప్పించుకొని తన సైన్యం మొత్తం ఉన్న విశాల్‌ఘడ్ కోటకు చేరుకొంటే యుద్ధం చేయవచ్చు అనుకున్నాడు. కానీ అప్పటికే పన్‌హాలా కోట చుట్టూ శత్రుసైన్యం ఉండడంతో తాను యుద్ధానికి సిద్దంగా లేనని దయతలచవలసినదిగా సిద్ది జోహార్‌కు వర్తమానం పంపాడు. అది తెలుసుకొన్ని సిద్ది జోహార్ సైనికులు నిఘా సరళం చేసి విశ్రాంతి తీసుకొంటుంటే, శివాజీ తన అనుచరులతో కోట నుండి తప్పించుకొని తన సైన్యం ఉన్న కోటవైపు పయనించసాగాడు.చివరిక్షణంలో ఇది తెలుసుకొన్న సిద్ది జోహార్ తన బలగాలతో శివాజీని వెంబడించసాగాడు.

కోటకు చేరుకొనేలోపు శత్రువులు తమను సమీపించగలరు అన్ని విషయం గ్రహించి బాజీ ప్రభు దేశ్‌పాండే అనే సర్దార్ 300 మంది అనుచరులతో కలసి తాము శత్రుసైన్యాన్ని ఎదుర్కొంటామని, శివాజీని తన అంగరక్షకులతో ఎలాగయినా కోట చేరుకోమని చెప్పి ఒప్పించాడు. శివాజీ కోట వైపు వెళ్ళిన వెంటనే బాజీ ప్రభు దేశ్‌పాండే రెండు చేతులా ఖడ్గాలు పట్టుకొని శత్రువులతో యుద్ధం చేశాడు.

300 మంది సైనికులు తమ ప్రాణాలకు తెగించి అతి బలమయిన శత్రువులతో పొరాడి నేలకొరిగారు. అప్పటికి శివాజీ తన కోట చేరుకున్నాడు. కోటలో తన అనుచరులతో చర్చించిన అనంతరం తాము సిద్ది జోహార్ సైన్యాన్ని ఎదుర్కొనలేమని గ్రహించిన శివాజీ సంధికి అంగీకరించాడు. సంధిలో భాగంగా శివాజీ సామ్రాజ్యం స్వతంత్ర్య రాజ్యంగా గుర్తింపు పొందింది. సిద్ది జోహార్ విజయానికి బహుమతిగా పన్‌హాలా కోట లభించింది.

ఈ యుద్ధమే సుల్తానులతో శివాజీ చేసిన ఆఖరి యుద్ధం. ఆ తరువాతి కాలంలో మొఘల్ సైన్యంతో యుద్ధాలు చేయవలసి వచ్చింది.

మొఘలులతో యుద్ధాలు

షైస్తా ఖాన్ తో యుద్ధం

1660లో ఔరంగజేబు తన మేనమామ అయిన షాయిస్తా ఖాన్‌కు లక్షకు పైగా సుశిక్షుతులయిన సైన్యాన్ని, ఆయుధాలను అందించి శివాజీని ఓడించి దక్కన్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకొని రమ్మని పంపించాడు. బలమయిన షాయిస్తా ఖాన్ సేన ముందు శివాజీ సేన తల వంచక తప్పలేదు. శివాజీ ఓటమి అంగీకరించి పూణే వదిలి వెళ్ళవలసి వచ్చింది. పూణేలో శివాజీ నిర్మించిన లాల్ మహల్‌లో షాయిస్తా ఖాన్ నివాసం ఏర్పరుచుకొన్నాడు.

ఎప్పటికయినా శివాజీ మెరుపుదాడి చేస్తాడని షాయిస్తా ఖాన్ పూణే నగరమంతా చాలా కట్టుదిట్టమయిన భద్రతను ఏర్పాటు చేసాడు. 1663 ఏప్రిల్లో నగరంలో ఒక పెళ్ళి ఊరేగింపు జరుగుతుండగా శివాజీ మారువేషంలో తన అనుచరులతో కలసి పెళ్ళికూతురు తరపున బంధువుల్లో కలసిపోయి లాల్ మహల్ చేరుకొన్నాడు. ఆ భవనం స్వయానా తన పర్యవేక్షణలో నిర్మించబడినది కాబట్టి, సులువుగా లోపలికి చేరుకొని షాయిస్తా ఖాన్ గదిలోకి చేరుకొన్నాడు. శివాజీ కత్తివేటుకు షాయిస్తా ఖాన్ మూడువేళ్ళు తెగి కింద పడగా, షాయిస్తా ఖాన్ కిటికీలో నుండి దుమికి ప్రాణాలు రక్షించుకున్నాడు. అంతలో ఇది పసిగట్టిన షైస్తా ఖాన్ అంగరక్షకులు షాయిస్తా ఖాన్‌ను సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్ళారు. మొఘలులకు మచ్చ తెచ్చిన షాయిస్తా ఖాన్‌ను ఔరంగజేబు సుదూర బెంగాలీ ప్రాంతానికి పంపించివేసాడు.

సూరత్ యుద్ధం

1664 నాటికి సూరత్ నగరం ప్రధాన వ్యాపారకేంద్రంగా ఉండేది. శివాజీ సూరత్ పైన దాడి చేసి ధనాన్ని, ఆయుధాలను దోచుకున్నాడు. అపారమయిన ఆ మొఘల్ సంపదతో కొన్ని వేలమందిని తన సైన్యంలో చేర్చుకొన్నాడు. కొద్దిరోజుల్లో మొఘలుల, బీజాపూర్ సుల్తానుల కోటలను ఒక్కొక్కటిగా తన సొంతం చేసుకోవడం మొదలు పెట్టాడు.

ఇది చూసిన ఔరంగజేబు ఆగ్రహోద్రుడై తన దగ్గర పని చేస్తున్న రాజపుత్రుడయిన రాజా జై సింగ్‌ను శివాజీ పైకి పంపించాడు. రాజా జై సింగ్ సంగతి తెలిసిన శివాజి తాను యుద్ధంలో ఓడిపోవడం ఖాయమని తెలుసుకొని సంధికి ఒప్పుకున్నాడు. సంధిలో భాగంగా 23 కోటలను, 4,00,000 రూపాయలను మొఘలులకు చెల్లించాడు.

శివాజీ తాను కూడా ఒక మొఘల్ సర్దార్‌గా ఉండడానికి అంగీకరించాడు. మొఘల్ సైన్యాన్ని ఉపయోగించుకొని తన శతృవులయిన బిజాపూర్, గోల్కొండ సుల్తానులను ఓడించడానికే శివాజీ మొఘల్ సర్దార్‌గా ఉండడానికి ఒప్పుకున్నాడు.

ఆగ్రా కుట్ర

1666లో ఔరంగజేబు తన యాభయ్యవ పుట్టినరోజు సందర్భంగా శివాజీని, అతని ఆరేళ్ళ కొడుకు శంభాజీని ఆగ్రాకు అహ్వానించాడు. సభలో శివాజీని సైనికాధికారుల వెనుక నిలబెట్టి అవమానపరిచాడు. ఇది సహించలేని శివాజి బయట వెళ్తుండగా భటులు చుట్టుముట్టి శివాజీ ఉంటున్న అతిధి గృహానికి తీసుకెళ్ళి అక్కడే బందీ చేశారు.

ఔరంగజేబు మొదట శివాజీని చంపాలనుకున్నా, దానివల్ల మరాఠాలు ఒక్కసారిగా చెలరేగుతారని తెలుసుకొని శివాజీని బందీగా ఉంచాలని నిశ్చయించాడు. తన కొడుకుతో బందీగా ఉన్న శివాజీ ఎలాగయినా తప్పించుకోవాలని ప్రయత్నించసాగాడు. ప్రతిరోజు తాను ఏరికోరి సమకూర్చిన పళ్ళను ఆగ్రాలోని సాధువులకు, గుడులకు, ఫకీర్లకు పంపించేలా అనుమతి తీసుకున్నాడు. కొన్ని నెలలపాటు పళ్ళ బుట్టలు పంపించిన తర్వాత తాను పనిమనిషిగా మారువేషం వేసుకొని కొడుకును బుట్టలో పెట్టుకొని తప్పించుకున్నాడు. శివాజీ, శంభాజీ ఇద్దరూ పళ్ళబుట్టల్లో దాక్కుని తప్పించుకొన్నారని ఒక వాదన.

అప్పటికే శివాజీ ప్రాబల్యం తగ్గడం వల్ల, మొఘలులు మరిన్ని యుద్ధాలలో పాల్గొంటూ ఉండడంవల్ల ఔరంగజేబు శివాజీనుండి ముప్పు ఉండదని భావించి పెద్దగా పట్టించుకోలేదు. శివాజీ ఎక్కువ ప్రాచుర్యంపోందేలా కాకుండా రహస్యంగా తన కార్యకలాపాలు నిర్వహించడం మొదలుపెట్టాడు. 1674 నాటికి లక్ష మంది సుశిక్షితులయిన సైన్యాన్ని, ఆయుధాలు, అశ్వాలు, నౌకా వ్యవస్థను సమకూర్చుకున్నాడు. 1670 జనవరి నుండి మొఘల్ కోటల పైన దాడులు చేసి సొంతం చేసుకోవడం మొదలు పెట్టాడు. అలుపెరగని యుద్ధాలతో అలసిపోవడం, సరి అయిన సైన్యం లేకపోవడం, ఖజానా ఖాళీ కావడంతో మొఘల్ సైన్యం శివాజీని ఎదుర్కొనలేకపోయింది.

సింహగఢ్ యుద్ధం

శివాజీ ఎన్నో కోటలను సులువుగా స్వాధీనం చేసుకున్నా, పూణే దగ్గర ఉన్న కొండన కోట స్వాధీనం కాలేదు. ఆకోటను ఉదయ్‌భాన్ రాథోడ్ అనే రాజపుతృడు పరిరక్షిస్తుండడమే కారణం. దుర్భేధ్యమయిన ఆ కోట చుట్టూ ఎప్పుడూ సైనికులు పహారా కాస్తుండడంతో శివాజీ తనదగ్గర అత్యంత గొప్ప సైనికాధికారిగా పేరు తెచ్చుకొన్ని తానాజీ మలుసారేకి ఆ కోట స్వాధీనం చెసుకొని బాధ్యత అప్పగించాడు.

తానాజీ తన అనుచరులతో రహస్యంగా ఆ కోటను కొద్దిరోజులపాటు క్షుణ్ణంగా అధ్యయనం చేసాడు. అన్ని ప్రధాన ద్వారాల్లో కట్టుదిట్టమయిన సైన్యం ఉంది. చివరగా కోటకు ఒకవైపు ఉన్న ఒక కొండ తానాజీని ఆకర్షించింది. ఆ కొండ చాలా ఏటవాలుగా ఉండడంతో సైన్యం ఆ కొండ ఎక్కడం అసాధ్యం. అప్పుడు తానాజీ 'యశ్వంతి ' అనే పేరుకల ఉడుముకు తాడు కట్టి కొండ పైకి విసిరాడు. తాడు సహాయంతో పైకి వెళ్ళినవారు అందించిన తాళ్ళను పట్టుకొని సైన్యం కోటలోకి చేరుకొంది. చరిత్రలో యుద్ధంలో ఉడుమును ఉపయోగించడం ఇదే ప్రథమం కావచ్చు.

అంతలో తానాజీ సోదరుడు సూర్యాజీ కోట ముఖద్వారంపైన దాడి చేసాడు. మారాఠాలకు రాజపుత్రులకు జరిగిన భీకరపోరులో మరాఠాలు గెలిచినా తానాజీ మరణించాడు. ఈ వార్త విన్న శివాజీ 'కోటను గెలిచాము కానీ సింహాన్ని పోగొట్టుకొన్నాము ' అన్నాడు. సింహంవలె పోరాడిన తానాజీ గౌరవార్థం కొండన కోట పేరును సింహఘడ్‌గా మార్చాడు.

చివరిదశ

శివాజీ పట్టాభిషేకము
జూన్ 6, 1674న రాయఘడ్ కోటలో వేద పఠనాల మధ్య శివాజీని క్షత్రియరాజులందరికీ అధిపతిగా కీర్తిస్తూ 'ఛత్రపతి ' అని బిరుదును ప్రదానం చేసారు. కొన్నాళ్ళకు 50,000 బలగంతో దక్షిణ రాష్ట్రాల దండయాత్రచేసి వెల్లూరు, గింగీలను సొంతం చేసుకున్నాడు.27 ఏళ్ళపాటు యుద్ధాలలో గడిపి హిందూ రాజులకు ఆదర్శంగా నిలిచి సువిశాల మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పిన ఛత్రపతి శివాజి మూడు వారాలు తీవ్ర జ్వరంతో బాధపడి ఏప్రిల్ 3, 1680 న మధ్యాహ్నం 12 గడియలకు రాయఘడ్ కోటలో మరణించాడు.

శివాజీ పెద్దకొడుకయిన శంభాజీ తర్వాత రాజ్యాన్ని చేపట్టి మొఘలులను సమర్థవంతంగా ఎదుర్కొని పరిపాలించాడు.

పరిపాలనా విధానం

యుద్ధతంత్రాలలో మాత్రమే కాకుండా పరిపాలనా విధానంలో కూడా శివాజీ భారతదేశ రాజులలో అగ్రగణ్యుడు. మంత్రిమండలి, విదేశాంగ విధానం,పటిష్టమయిన గూఢచారి వ్యవస్థ ఏర్పాటు చేసాడు. ప్రజలకోసమే ప్రభువు అన్న సూత్రం పాటించి, వ్యక్తిగత విలాసాలకు ఎటువంటి వ్యయం చేయక ప్రజల సంక్షేమం కోసమే పాటు పడ్డాడు.

వ్యక్తిత్వం

సుధీర్ఘ యుద్ధ కాలంలో లెక్కలేనన్ని యుద్ధాలు చేసినా ఎన్నడూ పవిత్రస్థలాలను ధ్వంసం చేయలేదు. యుద్ధంలో ఓడిపోయిన శత్రువుల రాజ్యంలో ఉన్న యుద్ధం చేయలేనివారికి, స్త్రీలకు, పసివారికి సహాయం చేసాడు.

ఒకసారి శివాజీ సైనికాధికారి ఒక చిన్న ముస్లిం రాజును ఓడించి అతడి అందమయిన కోడలును తీసుకొచ్చి శివాజీ ముందు ప్రవేశపెట్టాడు. శివాజీ ఆమెతో "నా తల్లి కూడా మీ అంత అందమయినది అయిఉంటే నేను కూడా అందంగా ఉండేవాడిని" అంటూ ఆమెను తల్లిలా గౌరవించి కానుకలతో ఆమె రాజ్యానికి పంపించాడు.

నిస్వార్థంగా ప్రజలకు సేవచేయడం, తాను చేస్తున్న పనిపట్ల అంకితభావం, మచ్చలేని వ్యక్తిత్వం ఆయన అనుచరులకు, ప్రజలకు ఆదర్శంగా నిలిచాయి. భారతదేశాన్ని ఎందరో రాజులో ఏలినప్పటికీ ఈ లక్షణాలే శివాజీని గొప్పరాజుగా చేసాయి.

సైన్యం

మరాఠా సామ్రాజ్యం ముగిసేవరకు శివాజీ ఏర్పాటు చేసిన సైనిక వ్యవస్థ నిలిచి ఉండేది. గెరిల్లా యుద్ధ విధానం శివాజీతోనే మొదలయింది. కొత్త ఆయుధాలను కనుగొని వాటితో యుద్ధాలు చేయించడం శివాజీకి ప్రత్యేక అభిరుచి. పటిష్టమయిన నౌకా దళాన్ని, ఆశ్వికదళాన్ని ఏర్పాటు చేసాడు. ఎనిమిది నెలలు పంటలు పండించే రైతులు కూడా నాలుగు నెలలు యుద్ధ నైపుణ్యాలను నేర్చుకోవడం శివాజీ విధానాలను అద్దం పడుతుంది. కేవలం సైనికులే కాక సంఘంలోని అన్ని వర్గాలవారు కోటను పరిరక్షించేవారు.మరణించే నాటికి శత్రువులందరూ వెనుకాడే విధంగా లక్ష సైన్యాన్ని తయారు చేసిన సమర్థుడు శివాజీ.

కోటలు

ప్రతాప్‌ఘఢ్ కోట

మరణించేనాటికి 300 కోటలు శివాజీ ఆధీనంలో ఉండేవి. కొండలపైన ఉన్నత సాంకేతిక విలువలతో దుర్భేధ్యమయిన కోటలను నిర్మింపచేయడంలో శివాజీ ప్రపంచ ఖ్యాతి పొందాడు. నాసిక్ నుండి మద్రాసు దగ్గర ఉన్న జింగీ వరకు 1200 కిలోమీటర్ల మధ్య ఈ 300 కోటలు నిర్మించబడ్డాయి.

మతసామరస్యం

శివాజీ భవానిదేవి భక్తుడు. శివాజీ తన సామ్రాజ్యంలోని అన్ని మతాలను సమానంగా చూసేవాడు. కేవలం గుళ్ళు మాత్రమే కాకుండా ఎన్నో మసీదులు కట్టించాడు. శివాజీ సైన్యంలో మూడొంతులు ముస్లిములు. ఎందరో ముస్లిములు ఉన్నత పదవులు నిర్వహించారు. హైదర్ ఆలీ ఆయుధాల విభాగానికి , ఇబ్రహీం ఖాన్ నావికాదళానికి, సిద్ది ఇబ్రహీం మందుగుండు విభాగానికి అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహించారు.శివాజీకి సర్వ సైన్యాధ్యక్షులు దౌలత్‌ ఖాన్‌, సిద్ధిక్ అనే ఇద్దరు ముస్లింలు!శివాజీ అంగ రక్షకులలో అతిముఖ్యుడూ, అగ్రా నుంచి శివాజీ తప్పించుకోటానికి సహాయపడిన వ్యక్తి మదానీ మెహ్తర్‌ కూడా ముస్లిమే

Tuesday, January 19, 2016

అసలు సిసలు హిందూ సామ్రాట్ చత్రపతి శివాజీ




శివాజి...
(అసలైన హిందువు అసలైన సెక్యులర్)

జననం – 19.02.1627 (వైశాఖ, శుక్ల పక్ష తదియ).
మరణం – 04.041680 (చైత్ర పౌర్ణమి).

17వ శతాబ్ధిలో శివాజీ మనోఫలకం పై ఆవష్కరించిన హైందవ స్వరాజ్యం అధిరోహించిన, “హిందూ సామ్రాజ్య దినోత్సవం” – 06.06.1674 (జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి, గురువారం).

హి.సా.ది. సంఘ ఉత్సవాలలో 2వది. (ఉగాది, హి.సా.ది., గురుపూర్ణిమ, రక్షాబందన్, విజయదశమి, మకర సంక్రాంతి)

ఆంగ్ల కాలమానం ప్రకారం ఈ ఏడాది ఈ ఉత్సవం 31.05.2015న వచ్చింది. ముందుగా అందరికి హిందూ సామ్రాజ్య దినోత్సవ శుభాకాంక్షలు...

తల్లి – జిజియా బాయి,
తండ్రి – షాహాజీ (షాహాజీ జననం – 1599. తండ్రి పేరు – మాలోజీ). భార్య- సయీ బాయీ.
జన్మ స్థలం – పూణే జిల్లాలోని జున్నార్ పట్టణంలో శివనేరి కోటలో.
పెద్ద కొడుకు – శంభాజీ,
గుఱ్ఱం పేరు-  కృష్ణా
పుట్టినది  1627
రాజ్యాధికారం చేపట్టిన సంవత్సరం (16 సం. చిరు వయస్సులో) 1643
హైందవ రాజ్యస్థాపన 1674
మరణం 1680
మొత్తం రాజ్యపాలనా కాలం (1643 నుండి 1680) 37
హైందవ రాజ్యస్థాపన చేసి పాలించిన కాలం (1674-1680) 6

శివాజి వ్యక్తిత్వం ప్రముఖంగా నలుగురు గురువుల సాంగత్యంలో సాగింది. వీరందరి శిక్షణలో అత్యంత పరాక్రమవంతుడు, ధైర్యవంతుడు, మేథావి అయ్యాడు.

మొదటి గురువు జిజియా బాయి. బాల్యంలో ఆమె చెప్పిన కథలు శివాజీని పరాక్రమ వంతుడిగా తీర్చిదిద్దాయి.

రెండవ గురువు దాదాజీ కొండదేవ్. దగ్గర రాజకీయం, యుద్ద తంత్రం నేర్చుకున్నాడు.

మూడవ గురువు తుకారామ్. వీరి దగ్గర సామాజిక సమరసత నేర్చుకున్నాడు శివాజీ.

నాల్గవ గురువు సమర్థ రామదాసు. వీరి దగ్గర ఆధ్యాత్మికత, హైందవ పరిరక్షణనే జీవిత పరమార్థమనే విషయాన్ని నేర్చుకున్నాడు. ఈ విధంగా శివాజీ వ్యక్తిత్వం అన్ని రకాలుగా అత్యంత శ్రేష్ఠమైనదిగా తీర్చి దిద్ద బడింది.

నవాబు కి దండం పెట్టని శివాజి.

షాజీ, తన పని చేస్తున్న బీజాపూర్ సుల్తాన్ దర్బారుకి తీసుకి వెళ్ళాడు. 12 సం.ల శివాజిని కూడా తీసుకు వెళ్ళాడు తండ్రి. సుల్తాన్‌కి సలాము చేసిన తండ్రి కొడుకుని కూడా సలాము చేయమన్నాడు తండ్రి. “పరాయ రాజుకు ముందు వంగి సలాము చేయను” అన్నాడు శివాజి. తండ్రి శివాజీ ధైర్యాన్ని మనసులోనే అభినందించాడు. బాల్యం నుండి అంతడి దేశ భక్తి, జాతీయాభిమానం కలిగిన వాడిగా తీర్చిదిద్దింది ఆయన తల్లి జిజియా బాయి.

ఆవు – శివాజి

ఒక నాడు ఒక ముస్లిము ఒక ఆవుని వధించడానికి లాక్కుపోతుండగా చూసాడు శివాజి. 10 సం. కూడా నిండని శివాజి ఆ ముస్లిముతో ఆవుని విడిచేదాకా వాదులాడాడు. కబేళాకి తరలిపోతున్న ఆవుని విడిపించాడు.

శివాజి – తోరణ దుర్గ కోట విజయం

16 సం. ప్రాయంలోనే శివాడీ తోరణ్ కోట (దుర్గా)న్ని జయించాడు. ఈ విజయంతో శివాజీ రాజకీయ జీవితం ప్రారంభమైంది. కొండదేవ్ శిక్షణని అంత అద్భుతంగా ఒడిసి పట్టాడు శివాజి.

శివాజి – తల్లి కొరిక శింహ ఘడ్

చదరంగంలో ఓడిపోయిన శివాజీని ముస్లిముల ఆధిపత్యంలో ఉన్న సింహ ఘడ్‌ని బహుమతిగా ఇమ్మంది తల్లి. పుత్రుడి పెళ్ళి పనిలో నిమగ్నమైన తానాజీని పిలిపించాడు. తల్లి కొరికని చెప్పాడు. వెంటనే సైన్యాన్ని తీసుకుని బయలుదేరాడు తానాజీ. భయంకర యుద్దం చేసి కోటని స్వాధీనం చేసుకున్నారు సైనికులు. తానాజీ వీరమరణం పొందాడు. “సింహ గడ్ లభించించి కాని సింహం పోయింది” అన్నాడు శివాజి. కొడుకు పెళ్ళిని కూడా లెక్క చేయాక శివాజీ ఆజ్ఞని సిరసావహించి, వీరమరణం పొందిన ఈ ఉదంతం శివాజీ మాటకి అతడి సైనికులో ఎంతటి విలువ ఉందో తెలియ జేస్తుంది.

శివాజి – ఆంధ్ర పర్యటన

1677 లో భాగ్యనగర్ వచ్చిన శివాజి, అక్కడ నుండి శ్రీశైలం వెళ్ళి అష్టాదశ పీఠాలలో ఒకటైన బ్రమరాంబ దేవిని దర్శించాడు. ఆమెకి తన శిరస్సుని బలిగా ఇద్దామని ప్రయస్తున్న శివాజికీ అమ్మ ప్రత్యక్షమై- నీ శిరస్సుని నా కెందుకు. నీ అవసరం దేశానికి చాలు ఉంది. నీ మెధస్సుని, క్షాత్రాన్ని, ధర్మ రక్షణకై వినియోగించు అని పలికిన అంబ శివాజీకి ఒక ఖడ్గాన్ని కానుకగా ఇచ్చింది. శివాజి శేష జీవితాన్ని ధర్మ రక్షణకై వినియోగించారు. ఈ ఉదంతంతో, హైందవ పరిరక్షణ బాధ్యతని దైవమే స్వయంగా శివాజీకి ఇచ్చిందని తెలుస్తుంది.

శివాజీ రాజ్యం – ఇతర ఎన్నో రాజ్యాలు

విజయనగర సామ్రాజ్యాధిపతి శ్రీకృష్ణ దేవరాయలు, హరి-హర, బుక్కరాయలులాంటి వారు సామ్రాజ్యాన్ని స్థాపించి వ్యాపించిన తరువాతనే ప్రసిద్ధి పొందారు. శివాజీ స్థితి ఇందుకు పూర్తిగా భిన్నంగా, శివాజి రాజ్య విస్తరణకు పూర్వమే శివాజీ పేరు విన్నంతనే ముస్లిము రాజులకు వణుకు పుట్టేది. శివాజి స్వయంగా ప్రతిసైనికుణ్ణి భర్తీ చేసి తన రాజ్యాన్ని బరహన్ పూర్ (నేడు భుసావల్, జలగావ్) నుండి బెంగుళూరు వరకూ, బీజాపూర్ నుండి పశ్చిమ సముద్రం వరకూ వ్యాపింపచేసాడు. రాజ్యపాలన సౌలభ్యం కొరకు నలుగురు గవర్నర్లను నియమించాడు. సతారాలో పీష్వా (పధాన మంత్రి) పూణేలో ఉండేవారు.

క్రమంగా 28 సంవత్సరాలు వచ్చే సరికి కోండాణా, పురందర్, ప్రతాప్ ఘర్, రాజ ఘర్, చాకణ్ తో పాటు మరోక 40 కొటలపై విజయం సాధించి విజయపతాన్ని ఎగురవేసాడి శివాజి.
మరోక పక్క ఆంగ్లేయులు, పోర్చుగీసువారు, అప్పటికే దేశంలో ఉన్న ముస్లిములు, మొగలులు దేశాన్ని మరింత ఆక్రమించుకునే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి.

శివాజీ - రాజ్యపాలన

ఈ నాడు మనం సామ్యవాదం, సోషలిజం, లిబరలిజం, ప్రజాతంత్రం అనే మాటలను పదే పదే వింటుంటాము. శివాజీ పాలనలో ఇవి అన్ని సర్వసమావేశమై ఉండేవి. అన్ని మత, పూజా పద్ధతులను పాటించేవారికి సమాన హోదా ఉండేది.

శివాజీ – పళ్ళ బుట్ట

అవసరమైనప్పడు శివాజీ మొఘలురాజులకు లొంగినట్లు నటించి వారి శతృ సైన్యం సాయంతోనే బిజాపూర్, గోల్కొండ సుల్తానులను ఓడించాడు శివాజి. ఈ క్రమంలో 1666లో ఔరంగజేబు తన 50వ పుట్టినరోజు సందర్భంగా శివాజీని, శంభాజీని ఆగ్రాకు అహ్వానించాడు. శివాజిస తన ఆరేళ్ళ కొడుకుతో ఔరంగజేబు కలవడానికి వచ్చాడు. వంచించడమే తెలిసిన  ఔరంగజేబు శివజీనీ, శంబాజీని చంపేస్తే మరాఠాల విద్రోహన్ని తట్టుకోవడం కష్టమని తలంచి వారిద్దిరిని చెఱసాలలో వేసాడు. శివాజీ ఆగ్రాలోని ఆపన్నులకు పళ్ళను పంపండానికి అనుమతి పొందాడు. కొన్ని నెలల తరువాత, ఎమరుపాటుగా ఉన్న ఔరంగజేబు బటుల కళ్ళుగప్పి,  మారువేషంలో శివాజీ, తన కొడుకుతో సహా పళ్ళ బుట్టలు దాగుని తప్పించుకున్నాడు. ఇలాంటి సమయస్ఫుర్తితో ఎప్పటికప్పుడు నూతన పథకాలతో తని పనిని పూర్తి చేసాడు శివాజి.

శివాజీ - రొడ్ల విస్తరణ, భవన నిర్మాణం

శివాజి పెద్ద పెద్ద రొడ్ల నిర్మాణం చేయించి, వ్యవసాయ, వర్తక వ్యాపారానికి పెద్ద పీట వేసి సర్వాంగీణ వికాశానికి తొడ్పడ్డాడు. సమాజంలోని అన్ని వర్గాలు సుఖంగా, సమృద్దిని సాధించాయి.

శివాజీ - స్వదేశీ విజ్ఞానం

ఐరోపా నుండి ముద్రణ యంత్రాలను తెప్పించి, ఆ యంత్రాల అధ్యయనం చేసి స్వదేశీ అవసరాల కనుగుణంగా నూత యంత్రాల అవిష్కరణని ప్రోత్సహించాడు.

యుద్ధం నెగ్గడంలో అస్త్ర-శస్త్రాల ప్రాముఖ్యతని గుర్తించిన శివాజి, విభిన్న దేశాల నుండి అత్యాధునిక అస్త్ర-శస్త్రాల తెప్పించి, స్వదేశీ విజ్ఞానాన్ని జొడించి వాటిని మరింత మెరగు పరిచి యుద్ధాలలో వాడుకలోకి తీసుకవచ్చాడు.

అదే విధంగా అప్పటికే ప్రవంచంలో ఉన్న పెద్ద ఓడలను కొనుగోలు చేసి, స్వదేశంలో ఉన్న నౌకా శాస్త్ర గ్రంథాల అధ్యయనంతో వాటిని మరింత మెరుగపరిచి ప్రపంచంలో అత్యంత పెద్ద ఔడల నిర్మాణం చేయించాడు. వ్యాపారానికి, యుద్ధానికి ప్రత్యేకమైన నౌకల నిర్మాణం చేపట్టాడు. ఆనాడు శివాజి దగ్గర ఉన్న ఓడలు విదేశీయులను ఆశ్చర్యంలో ముంచెత్తేవి.

ఈ విధంగా శివాజీ శాస్త్ర-సాంకేతికతకి పెద్ద పీట వేసీ ఉత్తమ ఫలితాలను సాధించాడు.

శివాజి – భాష

ప్రతి దేశానికి తన సాంస్కృతిక వైభవాన్ని ముందుకు తీసుకు పోవడానికి భాష చాలా అవసరం. ఆయా ప్రదేశాలలో జన్మించిన భాష మాత్రమే ఈ పని చేయగలదు. కాని విదేశీ ఆక్రమణ దారులు, దౌర్జన్యపూరితంగా ఫారసీని స్థానీయ రాజ్య భాషగా, స్థానీయ భాషగా పాదుకొల్పారు. శివాజి ఈ విదేశీ భాషని తీసి వేసి స్థానీయ భాషని పాలనా భాషగా, ప్రజా భాషగా అభివృధ్ధి చేసాడు.

శివాజి – హిరకణి (గోబాల)

హిరకణి అనే గో బాలిక, శివాజీ కోటలో పాలు అమ్ముకునేది. ఒక సారి అమ్మకం ముగించుకుని ఇంటికి పోదామనుకునేసరికి రాత్రి కావడంతో కోట ముఖద్వారం మూసివేయబడింది. తన పసి బిడ్డడికి పాలు పట్టించవలసి ఉండటంవలన ఒక బండరాయపైకి ఎక్కి కొట దాటి, ఇల్లు చేరుకుని బిడ్డడికి స్తన్యాన్నిచ్చింది ఆ తల్లి.

ప్రముఖద్వారం మూసిఉన్నప్పటికి కొట దాటే మార్గాంతరాన్ని బయట పెట్టినందుకు ఆమెని సన్మానించాడు శివాజి. ఏ బండరాయిని ఎక్కి ఆమె బయట పడిందో దానిని కొట్టించి కొటని మరింత కట్టుదిట్టం చేసాడు శివాజి. ఈ నాటికి ఈ స్థలాన్ని హిరకణి దుర్గం అని పిలిస్తారు.

ఈ ఉదంతం తన కోట యొక్క పటిష్టత, సంరక్షణకి శివాజీ ఎంతటి ప్రాధాన్యతని ఇచ్చాడో తెలియజేస్తుంది. అదే విధంగా ఈ రోజు సైబర్  పటిష్టతకోసం హేకర్లను నియమించుకుని అంతర్జాల పటిష్టతని మరింత మెరుగుపరుచుకుంటున్నామా, శివాజీ ఆ గోబాలకి సన్మానం చేసి పారితోషకాన్ని ఇచ్చి అలాంటి పనినే సాధించాడు.

శివాజి – న్యాయమూ, చట్టమూ

రాంఝా గ్రామం పటేలు ఒక స్త్రీని బలత్కరించినట్లుగా తెలిసింది. విచారణలో అది నిజమని కూడా నిర్థారించబడింది. శివాజీ ఆ పటేలుకి కాళ్ళూ చేతులు నరికివేసే శిక్ష విధించి అమలు పరిచాడు.

శిక్షలను అమలు పరచడంలో ఎంత మాత్రం చాప్యం చెయ్యని కారణంగా శివాజి పరిపాలనలో నేరాల సంఖ్య బహుకొద్దిగా ఉండేవి.

శివాజీ – స్త్రీ గౌరవం

శివాజీ సైనికులు ఒక అత్యంత సుందరమైన ముస్లిము యువతిని బలవంతంగా తీసుకు వచ్చి శివాజీ ముందు హాజరు పరిచి శివాజీ వారి చర్యని అభినందించి బహుమానం ఇస్తాడనుకున్నారు. సైనికులను హెచ్చరించిన శివాజీ ఆమె కాళ్ళపై బడి – తల్లి నా సైనికులు చేసిన పనికి క్షమించు. నా తల్లి కూడా ఇంత అందంగా ఉండి ఉంటే నేను ఇంకేంత అందంగా పుట్టి ఉండేవాడినో అని,. ఆ ముస్లిము యువతిని సకల రాజలాంచనాలతో ఆమె ఇంటికి పంపించాడు శివాజి.

ముస్లుములు, అన్య మతస్తులు, ప్రముఖంగా మహిళలకి ఎన లేని గౌరవాన్ని ఇచ్చాడు శివాజి. ఎవరికి భయం పడకుండా సంచరించే ఉత్తమ పరిపాలనని అందించాడు శివాజి. ఈ రోజు మైనారిటీ వాదమని, మహిళా అధికారాలని, సెక్యూలరిజం అని అంటున్న ఎన్నింటినో శివాజి వాస్తవంగా సాధించి చూపించాడు.

శివాజీ – మతసరసత

శివాజీ తన పాలన లో ఎక్కడ ఎవరికి ప్రత్యేకతలను ఇవ్వకుండా అందరికి సమాన హోదా కల్పించి అన్ని మతాలకు సమాన గౌరవాన్ని కల్పించి, అందరికి బద్రత కల్పించాడు. గుళ్ళు గోపురాలతో పాటు ఎన్నో మసీదులు కట్టించాడు. శివాజీ సైన్యంలో మూడొంతులు ముస్లిములు ఉండడమే కాక,  ప్రముఖ విభాగాలైన ఆయుధాల విభాగానికి - హైదర్ ఆలీ, నావికాదళానికి - ఇబ్రహీం ఖాన్, మందుగుండు విభాగానికి - సిద్ది ఇబ్రహీం అధ్యక్షత పదవీ బాధ్యతలును నిర్వహించారు. దౌలత్‌ ఖాన్‌, సిద్ధిక్ లు సర్వ సైన్యాధ్యక్షులుగా ఉండేవారు. విశేషమేమిటంటే, శివాజీ అంగ రక్షకులలో చాలా ప్రముఖ వ్యక్తి మదానీ మెహ్తర్‌. ఇతను శివాజీనీ అగ్రా కోట నుండి తప్పించడంలో ప్రముఖ పాత్ర నిర్వహించాడు.

మత ప్రాతిపధిక కాక, యోగ్యతకి పెద్ద పీట వేసి, మైనారిటీ, మెజారిటీ అనే నేటి కుహాన విభజనకి అతీతంగా అందరూ సమానమే అనే భావనని నెలకొల్పిన హిందూ రాజు శివాజి. అందుకే శివాజి గొప్ప హిందువు. మరియు నేటి భాషలో గొప్ప సెక్యూలరిస్టు.

శివాజి - అఫ్జల్ ఖాన్

శివాజీ పరాక్రమం, మెరుపుదాడులు, గెరిల్లా యుద్ద పద్దతులను ఎదుర్కోలేనని అఫ్జల్ ఖాన్ శివాజీనీ ప్రత్యక్షంగా యుద్దభూమికి రప్పించి ఓడింద్దామని అనుకున్నాడు. శివాజీ ఇష్ట దైవమయిన భవానీదేవి దేవాలయాలను కూల్చేసి, శివాజీని రెచ్చకొట్టాడు అఫ్జల్ ఖాన్. మొగలుల వ్యవహారశైని బలాబలాలను, పరిస్థితులను అంచనా వేయడంలో దిట్ట అయిన శివాజీ, యుద్దానికి దిగకుండా సంధికి దిగాడు. ప్రతాప్‌ఘడ్ కోటలో సమావేశానికి ముందు ఇనుప కవచాన్ని ధరించి, పులిగోర్లు పెట్టుకుని బయలుదేరాడు. శివాజి. అఫ్జల్ ఖాన్ శివాజీనీ రా భాయీరా అని కౌగలించుకుని కత్తితో పొడిచి హత్య చేద్దామని ప్రయత్నించాడు. ఇనుప కవచం శివాజీని రక్షించింది. శివాజి మోరుపు వేగంతో తన ముందే తెచ్చుకున్న పులి గోర్లతో అఫ్జల్ ఖాన్ పై దాడి చేసి వధించాడు శివాజి.

పదే పదే దేశం మీద తెగపడుతున్న నేటి పొరుగుతో శిఖరాగ్ర చర్చలు జరుపుతున్న మన ప్రభుత్వాల వ్యవహార శైలికి భిన్నంగా, ఈ ఉదంతం, శివాజీ అంటే నిరంతర అప్పమత్తత, సరియైన సమయంలో సరియైన ఆక్రమణ. స్నేహితిడికి స్నేహితుడు. శత్రువుకి శత్రువు. మంచికి మంచి. చెడుకి చెడు అనే శివాజీ వ్యవహార శైలిని తెలియ జేస్తుంది.

శివాజి - ఔరంగ జేబు

శివాజీ ఔరంగ జేబుకి ఒక లేఖ రాసారు. అందులో ఎన్నో విషయాలు చర్చిస్తూ అంతిమంగా ఇలా రాసారు –

“చక్రవరీ! ఖురాన్ దేవుడిని రబ్బుల్ అలమీన్ గా వర్ణించింది. అంటే విశ్వానికి అంతటికి దేముడు. కేవలం ముసల్మానులకు దేముడని కాదు. ఇస్లాము. హైందవము రెండూ అతీత శక్తులకు సుందరమైన భాష్యం చెప్పాయి. మసీదులో ప్రార్థనకి పిలుపునిస్తే, గుడిలో గంట కొడతారు. మతోన్మాదం, మత విద్వేషం కలవారెవరైనా దేవుడి ఆదేశాలకు వ్యతిరేకంగా నడుస్తున్నట్లే అర్థం. ఇలాంటి పనులు చేసేవారు దేవుడనే కళాకారుడి సృష్టిని ఎదిరిస్తున్నట్లే అర్థం. ఏ రకమైన సృష్టిలో లోపాలు వెదికినట్లైతే దానికర్థం మీరు ఆ కళాకారుడుని వ్యతిరేకిస్తున్నట్లే కదా. అలా చేయకండి.”

ఇలా స్పష్టంగా చెప్పడమే శివాజీ సెక్యూలరిజం. అంతే కాని బుజ్జగింపు ధోరణితో అన్నీ సమానమంటు ఊక దంపడు ఉట్టికింపులివ్వడం శివాజీ నైజం కాదు.

బ్రిటీషు సైన్యం – శివాజి సైన్యం

1795లో వింధ్య పర్వతాలలో ఆంగ్లేయులకి శివాజీకీ పోరు జరిగింది. శివాజీ నాయకుడు మహోదాజీ సింథియా. అప్పటి పీష్వా ఫడ్నవీస్. ఈయన శివాజీ సైన్యంలో గుఱ్ఱపు స్వారీరాని ఏకైక వ్యక్తి. శివాజీ సైన్యం చాలా చిన్నది. బ్రిటీషు సైన్యం చాలా పెద్దది. ఒక పక్క గుఱ్ఱపు స్వారీ రాని నాయకుడు, మరోక పక్క చిన్న సైన్యం అయినా ఆంగ్లేయులు శివాజీ సైన్యంలో అత్యంత దారుణంగా ఓడిపోయారు. ఈ ఉదంతాన్ని, బ్రిటీషువారు, ప్రపంచ చరిత్రలో ఇంతటి పరాజయాన్ని ఎన్నడు చూడలేదని చరిత్రకారుల అభివర్ణించారు.
నిజానికి ప్రపంచ చరిత్రలో ఏర్పడిన రాజులను చూస్తే వారి ముందు శివాజీ బుడతడే.... కాని పరాక్రమంలో, నిష్ఠలో, నిజాయితీలో, వ్యవహారికతలో, నేర్పులో, నిర్భయత్వంలో, మానవత్వ, సమానత్వంలో ప్రపంచంలో ఉద్భవించిన రాజులలో అందిరిలోకి ఉన్నతమైన వాడు శివాజి.

శివాజి-వియత్నాం

వియత్నామ్ అప్పటి రక్షణ శాఖ మంత్రి అయిన మేడమ్ బిన్ 1977 లో భారత పర్యటించినపుడు, శివాజి మా ఆదర్శం అని చెపుతూ, శివాజి విగ్రహాన్ని పూలమాలతో అలంకరించారు. వియత్నమ్-అమెరికా లాంటి పెద్ద దేశంతో తలపడినపుడు, వియత్నామ్ కి శివాజీ గోరిల్లా వార్ ఫేర్ వ్యూహం చాలా సహకరించింది.

అటువంటి శివాజీ గురించి మన ఎన్.సి.ఆర్.టి.సీ. చరిత్ర పుస్తకాలు ఒక పేజీలో నాలుగు వాక్యాలు రాసి చాలు అని పించాయి.

శివాజి – హిందూ రాజుల తప్పలు

శత్రువుని క్షమించని శివాజి – ఫృథ్విరాజ్ జౌహాన్ గజనీ ని 16 సార్లు క్షమించి వదిలాడు. చేసిన తప్పునే పదే పదే చేసాడు. గజనీ ఒక్కసారి ఫృథ్విరాజ్ ని ఓడించగానే అతడి కళ్ళు పీకించి చెఱసాల పాలు చేసి, తరువాత హత్య చేసాడు. శివాజీ శత్రువుకి క్షమాబిక్ష పెట్టడం, వదిలివేయడంలాంటి తప్పిదాలను చేయకుండా శత్రువుని శత్రువుగానే చూసి తగిన శిక్ష వేసిని కారణంగా శత్రువు ఆక్రమణ చేయడానికి కూడా భయపడేలా చేయగలిగాడు శివాజి.

శివాజీ తన యుద్ధ పంథాని కాలానుగుణంగా మార్చుకున్నాడు. ధర్మ బద్ధమైన యుద్ధం చేయని శత్రువు దగ్గర ధర్మం గురించి మాట్లాడి ప్రయోజనం లేదు. అందుకే శివాజి ఎప్పటి, కప్పుడు విజయానికి ఏది ఉత్తమమో అదే చేసాడు.

అర్హలైన అందరిని సైన్యం చేర్చుకున్న శివాజి –  జన్మతః క్షత్రియుడు మాత్రమే పోరాటానికి అర్హుడనే అనుచానంగా వస్తున్న ఆచారాన్ని పక్కన పెట్టి, సమాజంలోని అన్ని వర్గాలలోని బలమైన వారి ఎన్నుకుని ఒక ధృడమైన సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని, అన్ని యుద్దాలలోనే విజయాన్ని సాధించాడు శివాజి.

కాల బాహ్యమైన ఆచారాలను, పద్దతులను తుంగలోకి తొక్కి నేటి అవసరాలకు అనుగుణంగా ప్రవర్తించడం కారణంగా శివాజీ హైందవానికి పూర్వ వైభవాన్ని తీసుకురాగలిగాడు. పూర్వం జరిగిన తప్పిదాలను కూడా సవరించగలిగాడు.

అనర్థ హైతువైన ఢాంభికానికి పోని శివాజి – పొగరుబోతుగా వ్యవహరించి, అనవసరమైన ఢాంభికానికి పోయి, శత్రువు యొక్క బలా-బలాల అంచనా వేయకుండా శత్రువు ఎంత బలాడ్యుడైనా ఎదురేగి పోరాడే అనర్థ హేతువైన వీరత్వాన్ని ప్రదర్శించని శివాజి. దానికి బదులుగా, అదును చూసి, శత్రువుని తమ చిన్న సైన్యంతో జయించగలమని అనుకున్నప్పడు మాత్రమే ఎదురించి, విజయాన్ని సాధించిన శివాజి.

నేనే హీరోని. రండి చంపండి అని ఊరికే తన ప్రాణాన్ని తీసుకు పోయి శత్రువు చేతిలో పెట్టలేదు శివాజి. శత్రువు బలమైన వాడైతే, తెలివితో యుద్దం చేసాడు. శత్రువుని ప్రత్యక్షంగా ఎదుర్కోగలనని అనిపించినప్పుడు మాత్రమే ప్రత్యక్ష యుద్ధం చేసాడు. యుద్ధ తంత్రాన్ని బహు గొప్పగా ఉపయోగించిన వాజు శివాజి.

పొరుగు రాజ్యాలతో స్నేహ సంబంధాలు ఆశించిన శివాజి –హిందూ రాజులలో సఖ్యత లేని కారణంగా ఎక్కడ నుంచో వచ్చిన, ఇక్కడి సంస్కృతి, పరిస్థితులు తెలియని విదేశీ రాజు హిందూ రాజులపై పైచేయి సాధించి తమ రాజ్య విస్తరణ చేసుకున్నారు. ఇలాంటి ఎన్నో కారణాలు గల దేశ చరిత్రని క్షుణంగా అధ్యయనం చేసిన శివాజి పొరుగు రాజ్యాలతో సఖ్యత సాధించి దండయాత్రలు చేసిన ముస్లిము, మొగలు రాజులకు సింహస్వపంగా మారాడు.

ఈ నాడు ప్రభుత్వ తలపెట్టిన “సబ్ కా సాథ్ సబ్ కా వికాస్” అనేదే ఆ నాడు శివాజీ ప్రారంభించి విధానమే.

ఇది శివాజీ సంక్షిప్త చరిత్ర. ప్రతి భారతీయ పౌరుడు తెలుసుకోవలసిన హైందవ సామ్రాజ్యాధిపతి కథ. మనందరికి నిత్య స్మరణీయుడు. మన జాతి రత్నం శివాజి.

శివాజీ మహారాజ్ కీ జై.

అంతిమంగా

ఇది మన సత్తా

సా.శ. 7వ శతాబ్ధంలో ప్రారంభంమయిన వేరు వేరు ముస్లిము తెగల దండయాత్రలు మహమ్మద్ గజనీ (11వ శతాబ్ధం), మహ్మమ్మద్ ఘోరీ (12వ శతాబ్ధం)లతో తారాస్థాయికి చేరుకున్నాయి. తురుఘ్కలూ, అరబ్బులూ, ఇరానీలు, మొగలులూ, అప్గనులూ భారత్ పై మీదికి మిడతల దండుల్లా వచ్చి పడ్డారు. దేశమంతటా విస్తరించి దారుణమైన మారణకాండ చేసి, వినాశనం సృష్టించారు. పవిత్ర స్థలాలను అపవిత్రం చేశారు. హిందూస్థాన్ దీనికి వ్యతిరేకంగా 800 ఏళ్ళపాటు విరామమెరుగని స్వాతంత్ర్య సమరం సాగించింది. బహుశా ప్రపంచ చరిత్రలోనే జాతి స్వేచ్ఛ కోసం ఇంతగా కదిలించిన సమరగాథ మరొకటి కానరాకపోవచ్చు. రాజస్థాన్ లో మహారాణా, కుంభ్ నుంచి మహారాణా ప్రతాప సింహ్, రాజసింహ్లు వరకూ, దక్షిణాన బుక్క సోదరుల నుంచి శ్రీ కృష్ణ దేవరాయల వరకూ, మహారాష్ట్రలో శివాజి నుంచి పీష్వాల వరకూ, పంజాబులో గురుగోవింద్ సింహ్ వంటి అమరవీరులూ, గురువుల నుండి బందా బైరాగీ, రంజీత్ సింహ్ ల వరకూ, బుందేల్ ఖండ్ లోని ఛత్రసాల్ మొదలుకొని అస్సాములోని లాచిత్ బాస్కర్ బడ్ ఫుకన్ వరకూ లెక్కకు మించి యోధాగ్రేసరులు స్వాతంత్ర్య నౌకని అనేక తుఫానుల్లోంచి భధ్రంగా ముందుకు నడిపారు. వారి విడుపులేని పోరాటం కారణంగా, తిరుగులేని దెబ్బల మూలాన ఇస్లాము విజయ ఖడ్గం ముక్కలై మట్టి కరిచింది. మౌలానా హాలీ విలపించినట్లు- “సప్త సముద్రాల మీద ఎదురులేకుండా, ఓటమి ఎరుగ కుండా వీరవిహారం చేసిన ఇస్లాము అనే నౌకాదళం హిందూస్తాన్ చేరుకునే సరికి గంగలో మునిగిపోయింది”.

- హెచ్. వి. శేషాద్రి, కాళ రాత్రి (దేశ విభజన విషా గాథ) పుస్తకం నుండి.....
(Srinivas Rao vumaji)

Sunday, January 10, 2016

బెంగాల్ లో మమతాదే హవా...


న్యూఢిల్లీ, మే 10: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు అలా ముగిసాయో లేదో వివిధ చానెళ్లు తమ ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలను మంగళవారం వెల్లడించాయి. దాదాపు మూడున్నర దశాబ్దాలుగా పశ్చిమ బెంగాల్‌ను ఏకచ్ఛత్రాధిపత్యంగా పాలిస్తున్న వామపక్ష కూటమి ఈ ఎన్నికల్లో తుడిచిపెట్టుకు పోతుందని అన్ని ఎగ్జిట్ పోల్ సర్వేలు వెల్లడించాయి. తృణమూల్ కాంగ్రెస్ కూటమి విజయదుందుభి మోగిస్తుందని పేర్కొన్నాయి. అయితే మిగతా రాష్ట్రాల్లో మాత్రం వివిధ చానెళ్ల ఎగ్జిట్ పోల్ సర్వేల ఫలితాలు వేర్వేరుగా ఉన్నాయి. తమిళనాడులో ఎఐఎడిఎంకె కూటమి ఆధిక్యంలో ఉందని సిఎన్‌ఎన్-ఐబిఎన్-సిఎస్‌డిఎస్ సర్వే పేర్కొనగా, ఎఐఎడిఎంకె, డిఎంకె కూటములకు మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లు ఉందని హెడ్‌లైన్స్ టుడే-ఓఆర్‌జి సర్వే తెలిపింది. అలాగే కేరళలో వామపక్ష ప్రజాతంత్ర కూటమి (ఎల్‌డిఎఫ్) స్వల్ప ఆధిక్యంలో ఉందని సిఎన్‌ఎన్-ఐబిఎన్ సర్వే పేర్కొనగా, కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (యుడిఎఫ్) స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి వస్తుందని హెడ్‌లైన్స్ టుడే తెలిపింది. అసోంలో కాంగ్రెస్ మూడోసారి అధికారంలోకి వస్తుందని సిఎన్‌ఎన్-ఐబిఎన్ పేర్కొనగా, హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని హెడ్‌లైన్స్ టుడే వెల్లడించింది. పరిశోధనా సంస్థ సి-వోటర్ ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం.. బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ కూటమి ఘన విజయం సాధిస్తుంది. తమిళనాడులో ఎఐఎడిఎంకె మంచి మెజారిటీ సాధిస్తుంది. అసోంలో హంగ్ ఏర్పడుతుంది. కేరళలో కాంగ్రెస్ కూటమి స్పష్టమైన మెజారిటీ సాధిస్తుంది. కేరళలో వామపక్ష కూటమి ఓడిపోతుందని, యుడిఎఫ్ అధికారంలోకి వస్తుందని స్టార్ న్యూస్ టెలివిజన్ చానెల్ సర్వే కూడా తెలిపింది.
హెడ్‌లైన్స్ టుడే-ఓఆర్‌జి సర్వే ప్రకారం.. బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్- కాంగ్రెస్ కూటమి మూడింట రెండు వంతుల ఆధిక్యంతో అధికారంలోకి వస్తుంది. 294 స్థానాలున్న పశ్చిమబెంగాల్ అసెంబ్లీలో తృణమూల్ కూటమికి 210 నుంచి 220 స్థానాలు వస్తాయి. ఈ ఎన్నికల్లో భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) నేతృత్వంలోని వామపక్ష కూటమి కేవలం 65 నుంచి 70 స్థానాల్లో మాత్రమే గెలుపొందుతుందని ఈ సర్వే సూచిస్తోంది. అలాగే 10 నుంచి 15 స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు, ఇతర పార్టీల అభ్యర్థులు గెలుపొందుతారని సర్వే వెల్లడించింది. స్టార్ న్యూస్ టెలివిజన్ చానెల్ ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం తృణమూల్ కాంగ్రెస్ 181, కాంగ్రెస్ 40 స్థానాల్లో విజయపతాకం ఎగురవేస్తాయి. లెఫ్ట్ ఫ్రంట్ బలం ప్రస్తుతం ఉన్న 227 స్థానాల నుంచి 62 స్థానాలకు పడిపోతుంది.
కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్ 88 స్థానాల్లో గెలుపొంది అధికారంలోకి వస్తుందని స్టార్ న్యూస్ టెలివిజన్ చానెల్ ఎగ్జిట్ పోల్ సర్వే తెలిపింది. సిపిఎం నేతృత్వంలోని వామపక్ష కూటమి కేవలం 49 స్థానాల్లో మాత్రమే గెలుపొందుతుందని పేర్కొంది.
అదో చెత్త సర్వే: సిపిఎం
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్ష కూటమి ఓడిపోతుందనే హెడ్‌లైన్స్ టుడే-ఓఆర్‌జి సర్వేను చెత్త సర్వేగా సిపిఎం కొట్టిపారేసింది. ఈ సర్వేకు శాస్ర్తియ ఆధారం లేదని సిపిఎం పశ్చిమబెంగాల్ రాష్ట్ర కార్యదర్శి, లెఫ్ట్ ఫ్రంట్ చైర్మన్ బిమన్ బసు పేర్కొన్నారు. మంగళవారం ఆయన కోల్‌కతాలో విలేఖరులతో మాట్లాడుతూ.. వామపక్ష కూటమి ఓడిపోతుందనే జోస్యాన్ని టివి చానెళ్లు పోటీ పడి ప్రసారం చేస్తున్నాయని, అయితే వాస్తవం మరోలా ఉంటుందని రుజువవుతుందని అన్నారు. 2001 నుంచి బెంగాల్‌లో ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు తప్పని రుజువవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. లెఫ్ట్ ఫ్రంట్ వరుసగా అధికారంలోకి వస్తుండడాన్ని అడ్డుకోవడానికి, ప్రజల మనసులను ప్రభావితం చేయడానికి ఇలాంటి సర్వేలు విఫలయత్నం చేస్తున్నాయని ఆయన విమర్శించారు. వరుసగా ఆరోసారి లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన అన్నారు. పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాలోని గోపిబల్లవ్‌పూర్, బిన్‌పూర్‌లలో కొన్ని బూత్‌లలో సిపిఎం ఏజెంట్లను తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు, మావోయిస్టులు బెదిరించారని బిమన్ బసు ఆరోపించారు. ఈ విషయమై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశామన్నారు.

నిజంగా రిజర్వేషన్లు ఉద్దరిస్తున్నదెవరిని?


* ఓ.సి సామాజిక వర్గాల్లో పెరుగుతున్న అసహనం
*  పదేళ్ల వెసులుబాటు శాశ్వత హక్కెలా అయ్యింది
* నిజానికి అంబేద్కర్ కాంక్షించిందేమిటీ?
* ఉన్నత వర్గాల్లో సామాజిక అంతరాల           మాటేమిటి?
* రాష్ట్రానికో విధానమా..!?

వాస్తవాల ప్రాతిపదికన రిజర్వేషన్‌ల వర్గీకరణ చేయక తప్పని పరిస్థితులు కనిపిస్తున్నాయి. స్వాతంత్ర్యం సిద్దించి దాదాపు ఏడు దశాబ్దాలు కావస్తున్నా..ఇంకా కాలం చెల్లిన కులాల వారీ రిజర్వేషన్లు సరిచేయకపోవడంతో రిజర్వేషన్ల వల్ల నష్టపోతున్నామన్న భావనతో ఉన్న OC సామాజిక వర్గాలలో అసహనం తీవ్రతరమవుతోంది.

 ఇప్పటికే గుజరాత్‌లో పటేల్ వర్గం నుండి తమకూ రిజర్వేషన్లలో భాగం కల్పించాలంటూ హర్థిక్ పటేల్ సారథ్యంలో ఉధ్యమం ఊపందుకుంది. మహరాష్ట్ర లో మరాఠాలు అదే దారిలో ఉన్నారు. అక్కడ ప్రభుత్వం ప్రత్యేకంగా మరాఠా సామాజిక వర్గానికి18% రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నా కోర్టు జోక్యంతో నిలిపేశారు. ఇక్కడ తెలంగాణాలో రెడ్డి సామాజిక వర్గం రిజర్వేషన్లు రద్దు కోరుతూ ఉద్యమం నిర్మాణం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో కాపు సామాజిక వర్గాన్ని బిసి జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ ముద్రగడ పద్మనాభం అద్వర్యాన ఎప్పటి నుంచో ఉద్యమం జరుగుతున్నా ఈ మద్య దూకుడు పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎస్సీలను వర్గీకరణ చేయాలని మందకృష్ణ గళమెత్తుతున్నారు. దానాదీనా మొత్తంగా రిజర్వేషన్లు సమీక్షించి ఆర్థిక వెనుకబాటు ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయాలన్న డిమాండ్ ఓసి కులాల నుండి బలంగా వినిపిస్తోంది. వారి డిమాండ్ లోనూ న్యాయముంది.
 ఉదా: రెడ్డి, వెలమ, బ్రహ్మణ , క్షత్రీయ, కమ్మ , వైశ్య వర్గాలు సామాజికంగా ఉన్నతవర్గంగా కొనసాగుతున్నప్పటికీ అందరూ కోటీశ్వరులు కాదు.. కూటికి కూడా గతిలేక కటిక దారిద్ర్యాన్ని అనుభవిస్తున్న వారు కోకొల్లలు.. సామాజిక హోదా ఒక్కటే కూడు పెట్టదు కదా..!? అలాగే ఎస్సీ, ఎస్టీ, బిసి వర్గాలలో అపర కుబేరులూ..ఉన్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో నిజంగా  అర్హులైన వారిలో ఎంత మందికి రిజర్వేషన్ల ఫలాలు అందుతున్నాయి? ఇక్కడా ధనవంతుల ప్రయోజనాలే కదా వాస్తవంగా నెరవేరుతున్నది..!? నిజానికి ఉన్నత వర్గాలని చెప్పబడుతున్న సామాజిక వర్గాలలోనూ అంతర్గతంగా ఎన్నో వైరుధ్యాలు.. మరెంతో వివక్ష ఉంది. రెడ్డిలలో గుడాటి కాపు, ముఠాఠి ( వీరినే మరాఠీ) కాపు, గోనే కాపు, చౌదరి రెడ్డి, క్యాథలిక్ రెడ్డిలని, అలాగే బ్రహ్మణుల్లో వైదికులు, వైష్ణవులు, శ్రీ వైష్ణవులు, నియోగులనీ.. వైశ్యుల్లో కోమట్లు, అరవ కోమట్లు అని భిన్నమైన తెగలున్నాయి.

ఇందులో ఆర్థికంగా కనీసం ఒక పూట కూడా తిండికి నోచుకోని వారి జనాభా లక్షల్లో ఉంది.

 ఇకపోతే సామాజికంగా వెనకబడిన వర్గాలలోనూ సామాజిక అంతరాలు ఉన్నాయి. ఆర్థికంగా బలవంతులైన వారికి రిజర్వేషన్‌లు అవసరమా? అందుకే క్రిమిలేయర్ నిబంధనను అమలు చేయాలన్న వాదన ఉంది. రిజర్వేషన్లు దర్జాగా అనుభవిస్తున్న వారు వ్యతిరేకిస్తున్నారంటే అర్థముంది..! ఎందుకంటే ఆ నిబందన అమలు చేస్తే ఆర్థిక ప్రయోజనాల కంటే రాజకీయంగా తమ పట్టు సడలిపోతుంది కాబట్టి..! కానీ...దానిని కుల సంఘాల నాయకులే వ్యతిరేకిస్తున్నారంటే ఏమనుకోవాలి? వారు ఏవరి ప్రయోజనాల కోసం పోరాడుతున్నారని భావించాలి?

ప్రభుత్వాల ఓటు బ్యాంక్ మార్క్ రాజకీయాల పాపాల ఫలితంగా సామాజిక అసమానతల స్థానం లో ఆర్థిక అసమానతలు.. పొడసూపుతున్నాయి. రిజర్వేషన్ సిస్టం అంతిమంగా సామాజిక సంఘర్షణలకు దారితీస్తుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా అక్కడక్కడా ఇలాంటి పరిణామాలకు సంబందించిన సంకేతాలు కనిపిస్తున్నాయి.

భారత్ రిపబ్లిక్ గా అవతరించే క్రమంలో రాజ్యాంగ రచనా సంఘం ఆర్థికంగా, సామాజికంగా వెనకబడిన షెడ్యూల్డ్ కులాలు, తెగలు, బలహీనమైన వర్గాలను ప్రధాన స్రవంతిలోకి తేవాలని లక్ష్యించి కేవలం పదేళ్ల పాటు మాత్రమే రిజర్వేషన్లు అమలు చేయాలని స్పష్టంగా పేర్కొన్నా తదనంతర కాలంలోనూ అది ఇంకా కొనసాగుతుండటానికి కారణాలు బహిరంగ రహస్యమే...!.

పాలకుల నిర్వాకం ఫలితంగా రాను రాను రిజర్వేషన్ల ఫలాలను అనుభవిస్తున్న వర్గాలు అవి తమ శాశ్వత హక్కులు గా పరిగణించే స్థాయికి చేరింది పరిస్థితి. ఫలితంగా సామాజికంగా ఉన్నతమైన వర్గంలో ఉన్నా అర్థికంగా వెనకబడ్డ వర్గాలలో అసహనం మొదలైంది. రాజ్యాంగం ఏ లక్ష్యంతోనైతే రిజర్వేషన్లు అమలు చేయాలని తలచిందో అది నెరవేరకపోగా అందుకు విరుద్ధంగా పరిస్థితులు మరింత  దిగజారేందుకు కారణంగా మారిపోయింది.

రిజర్వేషన్ల రుచి మరిగిన పొలిటికల్ పార్టీలు ఫక్తు రాజకీయ ప్రయోజనాల కోసం అమలు చేస్తున్న ఇలాంటి రిజర్వేషన్ల రాష్టానికోరకంగా ఉండటాన్ని పరిశీలిస్తే వాటి అంతిమ లక్ష్యం ఏమిటో మనకు స్పష్టం గా అవగతమవుతుంది. ఇలాంటి తప్పుడు విధానాల వల్ల  ఆర్థిక అంతరాలు పెరిగి సామాజిక అసమానతలు పెచ్చరిల్లుతున్నాయి. మద్యలో ఒకటి..రెండు సార్లు రిజర్వేషన్ సిస్టంను సంస్కరించేందుకు ప్రయత్నాలు జరిగినా పెద్ద ఎత్తున చెలరేగిన ఆందోళనలు ప్రభుత్వాల చేతులు కట్టిపడేశాయి.

నిజంగా అంబేద్కర్ గనుక ఇప్పుడు బ్రతికి ఉండి ఉంటే ప్రస్తుత దయనీయ పరిస్థితికి ఎంతగానో పశ్చత్తాప పడి ఉండే వారు.

                        Sadanand Bembre
                           Sr. Journalist
                  Vanchanagiri, Warangal
                         9985871111

The Real hero,.

.
భారత్ నిజమైన స్నేహితుడు..


By Sadanand Bembre

ఇతడి పేరు వాల్డిమిర్_క్రుగ్లయాకొవ్, #మాజీ_USSR 10 Battle గ్రూఫ్ కమాండర్, 1971 భారత్-పాకిస్తాన్ యుధంలొ పాకిస్తాన్ ఓటమి తప్పని పరిస్తులలొ భారత
వ్యతిరేకతను నర నరాన జీర్ణించుకున్న జాత్యహంకార అమెరికన్ డిప్లోమాట్,అరబ్బు లాబీ వారికి దగ్గర సంబందాలున్న అమెరికా రక్షణమంత్రి కిసింజర్ కాళ్ళు పట్టుకున్నాయి. కిసింజర్ రంగంలొకి దిగి అప్పటి అమెరికా అద్యక్షుడు నిక్సన్ పాకిస్తానుకు మద్దత్తుగా భారతదేశం పై దాడి చేయడానికి  అమోదం తెలిపేలా ఓప్పించారు.

ఈ క్రమంలో హెన్రీ కిసింజర్ మాట్లాడుతూ భారత్ ను తీవ్రస్థాయిలొ దూషించాడు కూడా అంతేకాకుండా ఈ యుద్ద సమయంలో బ్రిటన్ కూడా భారత్ పై దాడి చేసేలా బ్రిటన్ ప్రభుత్వాన్ని వొప్పించాడు. ఈ మూర్ఖుడు అంతటితో ఆగకుండా సిద్ధాంత పరమైన విభేదాలున్నప్పటికీ చైనా   మద్దత్తు కూడ తీసుకొవడం కోసం హుటాహుటీన చైనా పర్యటన చేసి చైనా ను కూడా భారత్ కు వ్యతిరేకంగా రణరంగంలోకి దిగేలా ఒప్పించాడు.
వెంటనే అమెరికా, బ్రిటన్ నేవీ లు భారత్ పై దాడి చేయడానికి రంగంలొకి దిగాయి. అమెరికా నుంది అప్పట్లొ అతిపెద్ద విమాన వాహక నౌక #USS_Enterprise (Nuclear) ను, బ్రిటన్ తన విమాన వాహక నౌక #Eagle ను భారత నౌకాశ్రయాలైన, యుధ నౌకలపైన దాడి చేయడానికి రంగంలొకి దింపాయి. చైనా కూడా తన నౌకా దళ్ళాన్ని భారత్ పై దాడి చేయడానికి రంగం సిద్దం చేసింది.
ఈ విషయం తెలుసుకున్న రష్యా వెంటనే ఈ సమాచారాన్ని దౌత్య మార్గాల ద్వారా  భారత్ కు అందించింది. ఈ పరిస్థితుల నుండి  ఏలాగైనా గట్టెక్కించాలని భారత్ రష్యాని కొరడంతో  వెంటనే రష్యా మన Super Star వాల్డిమిర్ క్రుగ్లయాకొవ్ ను రంగంలొకి దింపింది.
వెంటనే వాల్డిమిర్ క్రుగ్లయాకొవ్ ముందుగా చైనా తీవ్ర హెచ్చరికలు జారీచేశారు "మీరు ఏటువంతి పరిస్తితులలొనైనా భారత్ పై దాడిచేస్తే వెంటనే మానుండి తీవ్ర స్థాయిలో ప్రతిఘటన ఏదురౌతుంది, అందులో ఏటువంటి సందేహం లేదు, ఈ విషయంలొ ఏమాత్రం రాజీ పడే ప్రశ్నేలేదు" అని హెచ్చరించడంతొ చైనా భారత్ పై దాడి చేయాలనే తన అలొచనను విరమించుకుంది. ఇక ఈ కమాండర్ వెంటనే వ్లాడివొస్టొక్ నుండి రెండు యుద్ధ నౌకలను, రెండు జలాంతర్గాము(Nuclear) లనుతీసుకుని స్వయంగా రంగంలొకి దిగారు.
ఇతను తెలివిగా Enterprise వెంట ఒక యుధనౌక, జలాంతర్గామి, బ్రిటీష్ ఈగల్ వెనుక ఒక యుధ నౌక, జలాంతర్గామితొ కేవలం 500 మీటర్ల దూరం నుండే వెంబడించడం మొదలు పెట్టాడు, అంతెకాకుండా అమెరికా, బ్రిటన్ నేవీలను మీరు భారత్ పై ఒక్క మిస్సైల్ ఫైర్ చేసిన వెంతనే మేము మీమీద డాడి చేస్తామని హెచ్చరిస్తూ వెంబడించాడు. ఐత ఇతనిని తప్పించుకుని పొవాలని అమెరికన్,బ్రిటన్ నౌకలూ ఏంత ప్రయత్నం చేసినా పట్టు వదలని విక్రమార్కుడి వలే వాటిని అలా దాదాపు 26 రోజుల పాటూ వీటిని వెంబడిస్తూ భారతదేశంపై ఈగ కూడా వాలకుండా కాపాడారు.
ఈ లోపు భారతీయ సేనలు విజయ వంతంగా  పాకిస్తాన్ పీచమణచివేయడంతో పాకిస్తాన్ పూర్తిగా ఒడిపోయి తన ఓటమిని అంగీకరించడంతొ చేసేదేమీ లేక అమెరికా, బ్రిటన్ దేశాలు గర్వభంగంతో అత్యంత అవమాన కరమైన రీతిలో తమ నౌకలను వెనక్కు పిలిచాయి. అవి వెళ్లి పొయిన తరువాత కూడా మరలా తిరిగి వస్తాయేమోనని మరో 20 రొజుల పాటు బంగళా ఖాతం లొనే తిష్టవేసి మన దేశాన్ని కంటికి రెప్పలా కాపాడారు.
ఇతనికి మన దేశం ఏప్పటికీ కృతజ్ఞత గా ఉండాలి, ఉంటుంది కూడా...

(మూలం: చిరంజీవి నిమ్మరాజు)

Saturday, January 9, 2016

కీలెరిగి వాత.. అదే మోడి మంత్ర..


కీలెరిగి వాత...
అదే మోడి మంత్ర...

By Sadanand Bembre

ఒకరి అవసరాలను మన దేశప్రయోజనాలకు అనుకూలంగా మలచుకోవడమే అసలు సిసలు దౌత్యనీతి. ఈ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ గతంలో ఏ ప్రధానికి సాధ్యం కాని అసాధ్యాలను నరేంద్ర మోడి సుసాధ్యం చేసి చూపుతున్నారు. దశాబ్దాల పాటు భ్రష్టు పట్టి పోయిన విదేశీ సంబందాలను తనదైన పంథాలో గాడిలో పెడుతూ అగ్రరాజ్యాలను అశ్చర్యానికి గురి చేస్తున్నారు.

మోడీ వ్యవహర శైలి స్వదేశంలో ప్రధాన ప్రతిపక్షాలను, స్వపక్షంలో ఉన్న విపక్షాన్ని మెప్పించలేకపోయినా.. వ్యూహాత్మక అంశాలపై భారత్ దౌత్య నీతి పదును తేలిందనే సంకేతాలను ప్రపంచ దేశాలకు పంపడంలో  ఆయన ఇప్పటికే ఘన విజయం సాధించాడు. ఈ నేపథ్యంలోనే నిన్న మొన్నటి వరకు భారత్ ను చిన్న చూపు చూసిన దేశాలన్నీ కూడా ఇండియాతో సంబంధాలను సరిచేసుకోక తప్పని అనివార్య స్థితిని సృష్టించడమే మోడి సాధించిన మొదటి దౌత్య విజయమని చెప్పవచ్చు.

వెనకటి వెన్నెముక లేని ప్రభుత్వాల నిర్వాకం ఫలితంగా భారత వ్యూహాత్మక రక్షణ విధానం కూడా దారుణంగా దెబ్బతింది. ఈ కారణంగానే శ్రీలంక, నేపాల్, మాల్దీవులు వంటి దేశాలు కూడా చైనాకు దగ్గరయ్యే పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. ఈ కారణంగానే మోడీ వ్యూహాత్మకంగా ప్రదాని ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భారత ఉపఖండంలోని దేశాల అధినేతలను అహ్వానించినప్పుడే ఆయన ఏ ఉద్దేశ్యంతో ఉన్నారో ప్రపంచ దేశాలకు అర్థమయ్యింది. ఈ క్రమంలోనే నిన్నటి దాక పట్టించుకోనట్లు నటించిన దేశాలు అన్ని తమ వైఖరులను విడనాడే పరిస్థితులు సృష్టించారు.

మోడిని ప్రసన్నం చేసుకోవడం ఇప్పుడు పాశ్చాత్య దేశాలకు అవసరం గనుక పొగుడుతున్నారు. ఇదే నరేంద్ర మోడి గుజరాత్ ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు అమెరికా సహా పాశ్చాత్య దేశాలు అన్ని కూడ బలుక్కున్నట్లు మత తత్వ వాదిగా ముద్ర వేసి తమ దేశాలకు రాకుండా నిషేధం విదించడం అప్పుడే ఎలా మర్చిపోగలం? హఠాత్తుగా వారు తమ వ్యూహం మార్చుకోవడానికి వారి స్వార్థ ప్రయోజనాలు కాపాడుకోవడానికే కాని మోడిపై అభిమానంతో ఎంత మాత్రం కాదు. చైనాను కట్టడి చేయడం కోసం అమెరికా, ఐరోపా పెద్దన్న రష్యా ప్రాబల్యాన్ని తగ్గించడం కోసం యూరోపియన్ యూనియన్ దేశాలకు భారత్ లాంటి పెద్ద రాజ్యంతో చెలిమి అవసరం.
అదీ కాకుండా ప్రపంచం మొత్తంలో అతిపెద్ద మార్కెట్ కలిగిన.. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం కూడా భారత్ మాత్రమే. డొమెస్టిక్ క్రైసిస్ తో కూనారిల్లిపోయిన అమెరికన్ అర్థిక వ్యవస్థకు అర్థికంగా దన్నును ఇవ్వగలిగిన శక్తి సామర్థ్యాలు మార్కెట్ అవసరాల పరంగా భారత్ మాత్రమే దానికి కనిపిస్తున్న ఏకైక ఆశాకిరణం. ప్రపంచంలో రెండవ అతిపెద్ద అర్థిక వ్యవస్థ కలిగిన చైనా కూడా మార్కెటింగ్ పరంగా భారత్ కంటే పెద్దదే అయినా అది దిగుమతి చేసుకునే పరిస్థితులు అసలే లేవు. అంతేకాకుండా చౌక వస్తువులు ఉత్పత్తి చేసి ప్రపంచం మొత్తం మీద అతిపెద్ద ఎగుమతి దారుగా ఆవిర్భవించింది. అలాగే ప్రపంచం మొత్తం మీద అత్యధిక డాలర్ల విదేశీ ద్రవ్య నిల్వలు కలిగి ఉండటం.. సోషలిస్టు దేశం కావడం వంటి అంశాలు అమెరికన్ పాలకులకు కలవరపెడుతున్న కారణంగా బౌగోళికంగా చైనాకు పొరుగునే ఉన్న భారత్ కు కూడా దానితో సత్సంబంధాలు సరిగ్గా లేకపోవడం వంటి కారణాల వల్ల అమెరికా వ్యూహాత్మక విధానాలలో భాగంగానే ఇండియాతో చెలిమికి అరాటపడుతోంది.

అదీ కాకుండా సోవియట్ పతనం తర్వాత కుప్పకూలిపోయిన అవశేష రష్యా వ్లాదిమిర్ పుతిన్ నేతృత్వంలో పూర్వ వైభవం సంతరించుకునే దిశగా ప్రస్థానిస్తుండటం కూడా అమెరికన్ పాలకులకు కంటగింపు కలిగించే విషయం.  దురాక్రమణ నెపంతో రష్యాపై అంక్షలు విదించి అర్థికంగా చక్రబంధంలో ఇరికించడం ద్వారా తన చెప్పు చేతల్లో ఉంచుకునేందుకు వ్యూహం రచించింది. ఈ క్రమంలో రష్యా ఉత్పత్తి చేస్తున్న చమురును కొనుగోలు చేయకుండా అడ్డుకుంటోంది.

అయితే అమెరికాతో కంటే రష్యాతోనే భారత్ బలమైన సంబంధం కలిగి ఉన్నందున దాన్నుండి దూరం చేసేందుకు వ్యూహాత్మకంగా భారత్ కు తాను అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు నటిస్తోందంతే.

ఏవరీ మరాఠా (ఆరె) క్షత్రీయ..!?


ఆరె మరాఠా సామాజిక వర్గం- చారిత్రక నేపథ్యం..


By Sadanand Bembre

మహోజ్వల భారత చరిత్రలో మరాఠాల చరిత్ర ఎంతో ప్రాశస్త్యం మరియు విశిష్టమైనది. జన్మతః రాజపుత్ర ( బ్రహ్మణ), ధర్మతః క్షత్రీయ, వృత్తి రీత్యా వ్యవసాయ నిపుణులు.. ఈ లక్షణాలే  హైందవ సమాజంలో మరాఠాలను ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి.  అంతే కాదు మెజారిటీ ప్రజలై ఉండి కూడా తమకంటూ ఒక రాజ్యం లేక మొగలాయి చక్రవర్తుల పాలన కింద దిక్కూ.. మొక్కూ లేకుండా బ్రతుకులీడుస్తున్న హైందవ సమాజానికి ఒక ఉనికినిచ్చి మాకూ ఓ రాజ్యముందీ అని గర్వంగా చెప్పుకునేలా హిందూ సామ్రాజ్య స్థాపన ఒక్క మరాఠాల వల్ల మాత్రమే సాకారమైంది. అందుకే దేశవ్యాప్తంగా ఎక్కడైనా మరాఠాలను ప్రస్తావించే సందర్భాల్లో వీర్ మరాఠా అన్న విశేషణాన్ని జతచేసి సంభోదిస్తారు. 
ఇక మరాఠా అనగానే మనకు ఠక్కున గుర్తుకొచ్చేది చత్రపతి శివాజీ మహారాజ్ మాత్రమే. నిజమే కాని అంతకు ముందు కూడా మనకు ఘనమైన చారిత్రిక వారసత్వం ఉంది. ప్రపంచానికి చెరుకు పంటను పరిచయం చేసింది మరాఠాలే. అదేంటి ఓ వైపు క్షత్రీయులు అంటూనే మరోవైపు వ్యవసాయ నిపుణులు అంటున్నారేమిటన్న సందేహాలు కలగొచ్చు. మరాఠీ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు యుద్ధ సమయాల్లో సైనికులుగా.. యుద్ధ విరామ సమయాల్లో రైతులుగా వ్యవసాయం చేసుకునే తమ కుటుంభాలను పోషించుకునే వారు. (ఇప్పటికీ మరాఠా సామాజిక వర్గం అటు మహారాష్ట్ర, కర్ణాటక, ఇటు తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ లలో వ్యవసాయం చేసుకునే జీవనం సాగించడం గమనించాల్సిన విషయం.) శివాజీ మహారాజ్ మరాఠా సామ్రాజ్య స్థాపన యజ్ఞంలో భాగస్వామి కావడం ప్రతీ మరాఠా తన పవిత్రమైన కర్తవ్యంగా భావించారు కాబట్టే శివాజీ ఆనాడు విజయవంతంగా హైందవ సామ్రాజ్య స్థాపన చేయగలిగారు. 
అంతకు ముందు ఎంత మంది హిందూ రాజులు లేరు..వారికి సాధ్యం కాని హిందూ రాజ్య స్థాపన శివాజీ మాత్రమే ఏలా చేయగలిగారు? శివాజీ కంటే ముందు గొప్ప హిందూమత అభిమానం కలిగిన రాజపుత్ర వీరుడు రాణా ప్రతాప్ సింగ్ కు కూడా ఎందుకు సాధ్యం కాలేదు?. ఎందుకంటే వారెవరూ కూడా శివాజీ లాగ  తమ లక్ష్య సాధనలో ప్రజలను మమేకపర్చలేకపోయారు. ఆ పనిని శివాజీ చేయగలిగారు కాబట్టే ఆయన యుగ పురుషుడయ్యారు.. 

ఆరె/ మరాఠా/ ఆర్య క్షత్రీయ..

ఇంతకు మనం ఏవరం? ఆరె వాళ్లమా..!? మరాఠీలమా..!? లేక ఆర్యక్షత్రీయులమా..!? ఏది వాస్తవం..? అసలు ఆరె అంటే ఏమిటి? అది కులమా లేక జాతి పేరా? ఇలాంటి సందేహాలెన్నో మన మరాఠా సోదరులకున్నాయి. పోయిన తరానికి మనమెవరమో తెలుసు.. కాని ఎక్కడి నుండి వచ్చామో .. ఎందుకొచ్చామో తెలియనివారు చాలా మంది ఉన్నారు. వాస్తవానికి "ఆరె" అనేది ఒక కులం పేరు కాదు. " ఆరె" అంటే ఉర్ధూ భాషలో "వచ్చిన వారు" అని అర్థం.  అవిభాజ్య హైదరాబాద్ రాజ్యంలో ప్రస్తుతం మహారాష్ట్రలోని మరట్వాడ ప్రాంతంతో పాటు కర్ణాటక రాష్ట్రంలోని ఈశాన్య జిల్లాలైన బీదర్ , రాయచూర్ , బీజాపూర్, యాద్గీర్ వంటి ప్రాంతాలు అంతర్భాగంగా ఉండేవి. అప్పట్లో నిజాం తన పాలనా పరమైన అవసరాలకు మరాఠీ సామాజిక వర్గానికి చెందిన వారిని పాటిల్స్ గా, పట్వారీలుగా, వతన్ దారులుగా, పోలీస్ పాటిల్స్ గా నియమించుకునేవారు. ఇప్పటికీ మరాఠా వారిని "ఆరె పటేల్" అనే  సంభోధిస్తుండటాన్ని గమనించవచ్చు. కాబట్టి ఉద్యోగాల రీత్యా ఈ ప్రాంతానికి వలసలు విస్తృతంగా జరిగాయి. 
హైదరాబాదు రాష్ట్రంలో ఉర్ధూ అధికార భాషగా కొనసాగింది కాబట్టి.. అధికారిక వ్యవహారాల సందర్భంగా ఇతర ప్రాంతాలకు చెందిన వారు కూడా ఉన్నారు కాబట్టి మరాఠీ అధికారులను గుర్తించడం కోసం ఆరె పటేల్ అని సంభోదించేవారు. అలా ఆరె అనే పదం స్థిరపడి మరాఠా కు పర్యాయ పదంగా పరిణామం చెందింది. అదే సమయంలో ఆంధ్ర ప్రాంతంలో మాత్రం మొదటి నుండి వారిని మరాఠీలుగానే వ్యవహరిస్తున్నారు..వారి ఉనికికి గుర్తింపు కూడా మరాఠాలు గానే కొనసాగింది.
 ఎటొచ్చి తెలంగాణా ప్రాంతంలో మాత్రమే గందరగోళం. కర్ణుడి చావుకు నూటొక్క కారణాలన్న ట్లు..  ఇక్కడ ఆరె, ఆరోళ్లు, ఆరె వాండ్లు, ఆరె పటేండ్లు, ఆర్య క్షత్రీయ, ఆరె మరాఠా అనే పేర్లతో పిలవడం ఒక కారణమైతే.. ఆ విద్య.. ఐక్యత కొరవడటం ఈ ప్రాంతంలో ప్రజల పాలిట శాపంగా పరిణమించింది. 
అంతేకాకుండా గ్రామీణ ప్రాంతంలో మన ప్రజలను వ్యవహారికంగా ఆరె పటేల్ అని సంభోధించటం వల్ల 1990 వ దశకంలో ఈ వర్గం సామాజిక నిర్మాణం పై సరైన అవగాహన లేని ఓ తహసిల్దార్ అప్పట్లో తప్పుడు నివేదిక ఇవ్వడం వల్ల ప్రస్తుత దయనీయ పరిస్థితికి కారణం.



ఆర్య క్షత్రీయ

ఆర్య+క్షత్రియ= ఆర్య క్షత్రియ

సంస్కృతంలో ఆర్య అంటే గొప్ప అని అర్థం. ఆర్య క్షత్రియ అంటే గొప్ప క్షత్రీయుడు అని అర్థం. 

మరాఠా అంటే ఏమిటి..?

అసలు మరాఠా అంటే అర్థం ఏమిటి? ఇది చాలామంది మదిని తొలుస్తున్న ప్రశ్న. వాస్తవానికి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 99% మంది ప్రజలకు దీని అర్థం తెలియదు. 
మర్+హఠ= మరాఠా
అంటే మరణాన్ని జయించినవాడు/ అధిగమించినవాడు/ మరణానికి ఎదురునిలిచి పోరాడే వాడు... వీరుడు అని అర్థం.