Tuesday, February 28, 2012

చైనాకు పుంజుకుంటున్న గ్రానైట్ ఎగుమతులు

 

కరీంనగర్, ఫిబ్రవరి 23: కలర్ గ్రానైట్ పరిశ్రమకు ప్రసిద్ధిగాంచిన కరీంనగర్ జిల్లా నుండి చైనాకు తిరిగి ఎగుమతులు పుంజుకున్నాయి. జిల్లాలో 370కి పైగా ఉన్న గ్రానైట్ క్వారీల నుండి ప్రతి ఏటా దాదాపు రెండు లక్షల క్యూబిక్ మీటర్ల పైచిలుకు గ్రానైట్ బ్లాకులు చైనాకు ఎగుమతి అవుతున్నాయి. తద్వారా ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం సీనరేజీ రూపంలోమొత్తం 110 కోట్ల ఆదాయం సమకూరుతోంది. అయితే గతంలో ఉన్న సెల్ఫ్ రిమూవల్ విధానం కారణంగా గ్రానైట్ కంపెనీల యజమానులు ప్రభుత్వానికి తప్పుడు కొలతలతో విలువైన బ్లాకులను తరలించేవి. ఈ క్రమంలో మైనింగ్ అక్రమాలపై పెద్దఎత్తున విమర్శలు రావడంతో విజిలెన్స్ యంత్రాంగం స్టాక్‌యార్డులు, పోర్టులపై దాడులు జరిపింది. దాంతో గ్రానైట్ బ్లాకుల కొలతల్లో చోటుచేసుకున్న అవకతవకలు వెలుగుచూశాయి.
ప్రధానంగా చైనాకు ఎగుమతి చేసేందుకు కరీంనగర్ నుండి కాకినాడ పోర్టుకు తరలించిన బ్లాకులకు సంబంధించి కొలతల్లో భారీ వ్యత్యాసం కనుగొనడంతో ప్రభుత్వం ఎగుమతులకు బ్రేక్ వేసింది. ఫలితంగా నిన్న.. మొన్నటి వరకు కాకినాడ పోర్టు స్టాక్‌యార్డులో కరీంనగర్ గ్రానైట్ బ్లాకు నిల్వలు పెద్దఎత్తున పేరుకుపోయాయి. ఎగుమతులు స్తంభించిపోవడంతో గ్రానైట్ పరిశ్రమ సంక్షోభంలో పడింది. ఫలితంగా జిల్లా వ్యాప్తంగా సుమారు రెండు వందలకు పైగా క్వారీలు మూతపడే దశకు చేరుకున్నాయి. ఎగుమతులు పూర్దిగా నిలిచిపోవడంతో కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టిన వ్యాపారులు ఆర్థికంగా దివాళతీసే పరిస్థితికి చేరుకున్నారు. ఎట్టకేలకు ప్రభుత్వం పేనాల్టీలతో వదిలేయడంతో నిర్ణీత మొత్తాన్ని చెల్లించిన వ్యాపారులు తిరిగి తమ కార్యకలాపాలను ప్రారంభించారు. జిల్లాలో మొత్తం 370 కలర్ గ్రానైట్ క్వారీలుండగా ఇందులో 168 క్వారీలు నగర శివారులోని ఓడ్యారం ప్రాంతంలోనే ఉన్నాయి. జిల్లా మొత్తంలో లభించే విలువైన కలర్ గ్రానైట్‌లో దాదాపు 80 శాతం డిపాజిట్స్ ఇక్కడే ఉన్నట్లు మైనింగ్ నిపుణుల మాటల్ని బట్టి అర్థమవుతోంది. ఇక్కడ గ్రానైట్ రాళ్లను బ్లాకులుగా కత్తిరించి 1మీటర్ నుండి 10 క్యూబిక్ మీటర్ల పరిమాణంలో చైనాకు ఎగుమతి చేస్తున్నారు. చైనాలో గ్రానైట్ పాలిషింగ్ కుటీర పరిశ్రమగా ఉండటంతో చైనాకు అవసరమైన ముడి బ్లాకుల్లో 70 శాతం ఆంధ్రప్రదేశ్ నుండి ఎగుమతి అవుతోంది. ఇందులో కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఏటా మూడు వేల కోట్ల విలువైన 2లక్షల యాబై వేల క్యూబిక్ మీటర్ల గ్రానైట్ బ్లాకులు ఎగుమతి అవుతున్నాయి. ఇక్కడ లభిస్తున్న గ్రానైట్‌కు చైనాలో మార్కెట్ మంచి డిమాండ్ లభించడంతో జిల్లాకు చెందిన చాలా మంది వ్యాపారులు గ్రానైట్ వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ వరసలో కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌కు చెందిన శే్వత గ్రానైట్స్ ముందు వరసలో ఉంది.

*గర్భసంచి తీసేయ్ డబ్బు సంచి నింపెయ్* డబ్బుల కోసం హిస్ట్రెక్టమీ

24/02/2012

కరీంనగర్, ఫిబ్రవరి 23: తెలంగాణ జిల్లాల్లోని మహిళలకు హిస్ట్రెక్టమీ ఫోబియా పట్టి పీడిస్తోంది. మరీ ముఖ్యంగా కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ వలసలు అధికంగా ఉన్న జిల్లాల్లో దీని తీవ్రత మరీ అధికంగా కనిపిస్తోంది. ధనార్జనే పరామవదిగా పనిచేస్తున్న కొన్ని ప్రైవేట్ నర్సింగ్‌హోంలు నిరక్ష్యరాస్యులైన గ్రామీణ మహిళలను లక్ష్యంగా చేసుకొని గర్బసంచి తొలగింపు (హిస్ట్రెక్టమి) అపరేషన్లకు పాల్పడుతున్నాయి. దాంతో సహజంగానే గర్భ సంచికి ఏర్పడే ప్రతీ సమస్య క్యాన్సర్‌కే దారి తీయవచ్చన్న అపోహలు మహిళల్లో పాతుకుపోవడంతో నర్సింగ్ హోంలు దీన్ని అవకాశంగా తీసుకొని గ్రామీణ ప్రాంతాల్లో వైద్యులుగా చెలామణి అవుతున్న ఆర్‌ఎంపి, పిఎంపిలను ఏజెంట్లుగా నియమించుకొని మహిళలను వెతికి మరీ ఆపరేషన్లు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలోనూ హిస్ట్రెక్టమీ ఆపరేషన్లు జరిగినప్పటికీ 2006లో ఈ సర్జరీలను ఆరోగ్యశ్రీలో చేర్చిన తరువాత మాత్రమే సర్జరీల సంఖ్య అధికమైనట్లు ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ గుర్తించింది. ఆరోగ్య శ్రీ ప్రారంభించిన తరువాత వరంగల్ నగరానికి చెందిన ఓ నర్సింగ్ హోం 18 నెలల కాలంలో ఏకంగా వేయికి పైగా హిస్ట్రెక్టమీ సర్జరీలు చేసి కోటి 80 లక్షల రూపాయలు క్లైమ్ చేయడం హిస్ట్రెక్టమీ ఆపరేషన్ల తీరుకు తార్కాణంగా చెప్పవచ్చు. దాంతో పెద్దఎత్తున ఆరోపణలు రావటం,ప్రభుత్వం విచారణ జరిపి సంబంధిత ఆసుపత్రిపై చర్యలు తీసుకొంది. ఆ తరువాత ఆరోగ్య శ్రీ పరిధిలో ఈ తరహా సర్జరీలు చేయడానికి మహిళలకు కనీసం 35 సంవత్సరాల వయోపరిమితి నిర్ణయించారు. అలా చేసినా కూడా అదుపులోకి రాకపోవడంతో ఏకంగా రాష్ట్ర వ్యాప్తంగా 15 జిల్లాల్లో హిస్ట్రెక్టమీ ఆపరేషన్లను ఆరోగ్య శ్రీ పరిధి నుంచి తొలగించారు. ప్రస్తుతం ఉన్న ఎనిమిది జిల్లాల్లోనూ కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, మెదక్ జిల్లాల్లో సర్జరీలు జరుగుతున్నప్పటికీ వయో పరిమితిని 40 ఏళ్లకు పెంచారు. అంతేకాకుండా ఆరు నెలల పాటు వైద్యం చేయించుకోవాల్సి ఉంటుంది. అప్పటికీ తగ్గకపోతేనే సర్జరీకి అనుమతిస్తారు. కరీంనగర్ జిల్లాకు సంబంధించి 2008 నుంచి ఇప్పటివరకు 11 వేల మందికి హిస్ట్రెక్టమీ ఆపరేషన్లు జరిగినట్లు ఆరోగ్య శ్రీ కో-ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్న డాక్టర్ అనంతరెడ్డి ‘ఆంధ్రభూమి’కి చెప్పారు. మరీ ముఖ్యంగా జగిత్యాల, సిరిసిల్ల వంటి ప్రాంతాల్లోనే ఈ తరహా సర్జరీలు అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రైవేటు నర్సింగ్ హోములు గతంలో హిస్ట్రెక్టమీ సర్జరీలకు ఐదు వేల నుంచి ఎనిమిది వేల రూపాయల చార్జి వసూలు చేయగా, ఆరోగ్యశ్రీలో చేర్చిన తరువాత 35 వేల నుంచి 40 వేల వరకు క్లైమ్ చేస్తున్నట్లు గుర్తించారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వం క్లైమ్‌లకు బ్రేక్ వేయడంతో ప్రైవేటు నర్సింగ్ హోముల్లో ఎనిమిది వేల నుంచి 12 వేల మధ్య చార్జీలతో సర్జరీలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో మొత్తం 1500 లకు పైగా నర్సింగ్ హోంలలో ఈ తరహా సర్జరీలు జరుగుతున్నట్లు చెబుతున్నారు. వాస్తవానికి 40 సంవత్సరాల పైబడిన మహిళలకు సర్జరీ చేస్తే ఎలాంటి సమస్యలు లేవు. కానీ 20 ఏళ్లు పైబడిన యువతులు కూడా ఈ ఆపరేషన్లు చేయించుకోవడం వల్ల ఆరోగ్యంపై ఇతర దుష్పరిణామాలు చోటు చేసుకుంటున్నట్లు చెబుతున్నారు.
అవగాహన కల్పిస్తాం: డింహెచ్‌ఓ
కరీంనగర్ జిల్లాలో హిస్ట్రెక్టమీ ఆపరేషన్లపై అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని, డిఎంహెచ్‌ఓ నాగేశ్వర్ చెప్పారు. ఇప్పటికే గ్రామాల్లో ఉండే ఎఎన్‌ఎంలు, హెల్త్ అసిస్టెంట్ల ద్వారా అవగాహన కల్పిస్తున్నామన్నారు. గర్భసంచి తొలగింపు వల్ల ఉత్పన్నమయ్యే దుష్ప్రరిణామాలు సర్వేకల్ ఇన్‌ఫెక్షన్, ఫ్రీక్వెన్ డెలీవరీలపై అవగాహన కల్పిస్తామన్నారు. అలాగే మహిళలను తప్పుదోవ పట్టిస్తున్న ఆర్‌ఎంపి, పిఎంపిలపై త్వరలోనే చట్టపరమైన చర్యలు చేపట్టబోతున్నట్లు ఆయన వెల్లడించారు.
================================
నయం చేయవచ్చు!
కరీంనగర్: గర్భసంచికి ఏర్పడే ప్రతీ ఫైబ్రాయిడ్ గడ్డ కేన్సర్ కాదని, ప్రాథమిక దశలో గుర్తించి చికిత్స చేస్తే వందకు వంద శాతం సమర్థవంతంగా నయం చేయవచ్చునని కరీంనగర్ జిల్లాలో ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ జి.శ్రీలత వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మహిళలకు అపరిశుభ్ర పరిస్థితులు, రుతు సంబంధమైన సమస్యలు, బహుళ సంబంధాల వంటి అంశాల కారణంగా ఏర్పడే ఆరోగ్య సమస్యలను కేన్సరేనన్న అపోహలతో బలవంతంగా సర్జరీ చేయించుకుంటున్నారని, దానివల్ల దీర్ఘకాలంలో అనేక శారీరక సమస్యలు ఉత్పన్నమై ప్రాణాంతకంగా పరిణమించవచ్చునని హెచ్చరించారు. సాధారణంగా ఫైబ్రాయిడ్ గడ్డల్లో మాత్రమే హెవీ బ్లీడింగ్ జరుగుతుందని, దానికి మంచి వైద్యం అందుబాటులో ఉందన్నారు. 50 ఏళ్లు పైబడిన మహిళలకు గర్భ సంచి తొలగించడం వల్ల ఎలాంటి నష్టం లేదని చెప్పారు. సాధారణంగా గర్భసంచి సంబంధిత సమస్యలు చిన్న వయస్సులో సంతానం కలుగడం, సంతానానికి సంతానానికి మధ్య కాలవ్యవధి తక్కువగా ఉండటం వంటి కారణాలవల్లే ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయని చెప్పారు.

Sunday, February 19, 2012

జలయజ్ఞం పూర్తయ్యేనా..


కరీంనగర్, ఫిబ్రవరి 17: ముక్కుతూ మూలుగుతూ నడుస్తున్న జలయజ్ఞం ప్రాజెక్టులకు ఈసారైనా పూర్తి స్థాయిలో నిధులు కేటాయించపోవడంతో కరీంనగర్ జిల్లాలో దీనికింద చేపట్టిన ప్రాజెక్టుల పరిస్థితి మరోసారి గందరగోళంలో పడినట్లు కనిపిస్తోంది. జిల్లాలో ఎల్లంపల్లి, మిడ్‌మానేరు, కాళేశ్వర-ముక్తీశ్వర మినీ ఎత్తిపోతల ప్రాజెక్టులను చేపట్టిన ప్రభుత్వం నిధుల కేటాయింపులో చేస్తున్న తాత్సారం వల్ల పనులు మందకొడిగా సాగుతున్నాయి. అంతేకాకుండా మిడ్ మానేరుకు సంబంధించి 70 కోట్ల మేర మట్టి పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్లు ఖర్చు పెరిగిందన్న సాకుతో అంచనాలు పెంచితేనే పనులు చేస్తామని మొండికేయడంతో ప్రభుత్వం టెండర్లను రద్దు చేసి తాజాగా మరోసారి టెండర్లు పిలిచింది. అటు ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సంబంధించి మట్టిగడ్డ నిర్మాణ పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రస్తుతం 80 శాతం పనులు పూర్తికాగా మరో 20 శాతం మేర మైనర్ పనులు పూర్తి కావాల్సి ఉంది. షటర్లను బిగించే దశలో దాని నిర్మాణ పనులను చేపట్టిన కంపెనీ చేతులెత్తేయడంతో ప్రాజెక్టు మట్టి పనులు నిర్వహిస్తున్న ‘ష్యూ’ కంపెనీకే పనులు అప్పగించారు. అయితే నిధులు విడుదల చేయకపోవడంతో కాంట్రాక్టర్ ఉద్ధేశపూర్వకంగానే పనులు జాప్యం చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ప్రస్తుత బడ్జెట్‌లో జలయజ్ఞం ప్రాజెక్టుల కోసం 15 వేల కోట్లు నీటిపారుదల శాఖకు కేటాయించారు. ఇందులో కరీంనగర్ జిల్లాకు సంబంధించి ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 360 కోట్లు, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు కోసం 1100 కోట్లు, శ్రీరాంసాగర్ వరద కాలువకు 330 కోట్ల చొప్పున కేటాయింపులు జరిపినట్లు తెలుస్తోంది. ఏ మేరకు కేటాయింపులు జరిపారన్న విషయం అసెంబ్లీలో జలయజ్ఞంపై చర్చ సందర్భంలోనే వెలుగు చూసే అవకాశముంది. రాష్ట్ర బడ్జెట్ తీరుతెన్నులను పరిశీలిస్తే మరోసారి సంక్షేమానికి రంగానికి మొండిచేయే చూపిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ అమలుకు సంబంధించి నిర్ధష్టమైన కార్యాచరణ రూపం ఇవ్వకుండా నిధులు దారి మళ్లించేందుకు ప్రయత్నిస్తోందన్న ఆరోపణల నేపథ్యంలో తాజా బడ్జెట్‌లో జరిపిన కేటాయింపులనైనా సక్రమంగా ఖర్చు చేస్తారా? లేదా? అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి శుక్రవారం శాసనసభలో ప్రవేశపెట్టిన లక్షా 45 వేల కోట్ల బడ్జెట్‌ను పరిశీలిస్తే ఇందులో వ్యవసాయం, కరువు, విద్య, వైద్యం వంటి కీలక రంగాలకు కంటితుడుపు కేటాయింపులు జరిపారన్న విషయం అర్థమవుతోంది. అంతేకాకుండా సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి కూడా కేటాయింపులు నామమాత్రంగానే జరిగాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం సాంఘీక సంక్షేమ శాఖకు 2677 కోట్లు కేటాయించగా, బిసి సంక్షేమానికి 2101 కోటి, మైనారిటీ సంక్షేమానికి 488 కోట్లు, వికలాంగుల సంక్షేమానికి 66 కోట్లు, గిరిజన మహిళా సంక్షేమ పథకాల కోసం 2285 కోట్ల చొప్పున కేటాయింపులు జరిపింది. అలాగే అటవీశాఖలో వివిధ అభివృద్ది కార్యక్రమాల అమలుకోసం 500 కోట్లు ఖర్చు చేసేందుకు కేటాయింపులు జరుపగా మత్స్యశాఖకు 234 కోట్లు, శుసంవర్థక శాఖకు 1106 కోట్లు కేటాయింపులు జరిపింది. రోడ్లు, భవనాలు, రవాణా శాఖలకు సుమారు ఐదు వేల కోట్లు కేటాయింపులు జరుపగా, విద్యార్థుల స్కలర్‌షిప్‌లు, ఫీజు రీయంబర్స్‌మెంటు కోసం 3820 కోట్లు, శాసనసభా నియోజకవర్గాల అభివృద్ధికోసం ఒక్కో నియోజకవర్గానికి కేటాయించింది. అలాగే ఇందిరా జలప్రభ పథకం కింద ఎస్సీ,ఎస్టీల భూముల్లో నీటి వసతి కల్పించేందుకు లక్ష బోర్లను తవ్వించాలని నిర్ణయించింది. యువజన, ఉపాధికల్పనకోసం రాజీవ్ యువశక్తి పథకానికి 150 కోట్లు కేటాయించింది. వ్యవసాయ శాఖకు సంబంధించి కరువు సహాయం క్రింద 3500 కోట్లు, వ్యవసాయ రంగానికి 3175 కోట్లు కేటాయింపులు జరిపింది. అలాగే పట్టణాభివృద్ధి కోసం 6,586 కోట్లు కేటాయించడం జరిగింది.
సంక్షేమ రంగానికి పెద్దపీట
*మంత్రి శ్రీ్ధఠ్ బాబు
ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి 2011-12 సంవత్సరానికి ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ చాలా బాగుందని పౌరసరఫరాలు, శాసన సభావ్యవహారాల శాఖ మంత్రి డి.శ్రీ్ధర్ బాబు అన్నారు. సంక్షేమ రంగానికి పెద్దపీట వేశారని శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బిసి, ఎస్సీ,ఎస్టీ, మైనారిటీ, మహిళా సంక్షేమానికి గత ఏడాది కంటే ఎక్కువమొత్తంలో నిధులు కేటాయించారని చెప్పారు. రాష్ట్ర చరిత్రలోనే ఇది అత్యుత్తమ సంక్షేమ బడ్జెట్ అని మంత్రి పేర్కొన్నారు. వెనుకబడిన తరగతుల సంక్షేమానికి గత సంవత్సరం కేటాయింపుల కంటే 43 శాతం, మహిళా సంక్షేమానికి 22 శాతం, వికలాంగుల సంక్షేమానికి 37 శాతం, మైనారిటీల సంక్షేమానికి 62 శాతం అధికంగా నిధులు కేటాయించారని అన్నారు. పౌరసరఫరాల శాఖకు గత ఏడాది రూ.2667 కోట్ల కేటాయించగా ఈ ఏడాది రూ.3175 కోట్లు కేటాయించారని చెప్పారు. సంక్షేమ రంగంతో పాటు వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రవాణా, రోడ్లు, భవనాలు, పట్టణాభివృద్ధి తదితర రంగాలకు ఎక్కువ మొత్తంలో నిధులు కేటాయించారని తెలిపారు. హైదరాబాద్-కరీంనగర్-రామగుండం రహదారి నాలుగు లైన్లు విస్తరణకు బడ్జెట్‌లో 1,358.19 కోట్లు కేటాయించారని తెలిపారు.
కొత్త సీసాలో పాత సారా
* ఎమ్మెల్యే సుద్దాల దేవయ్య
రాష్ట్ర ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో కొత్తదనం ఏమీ కనిపించడం లేదని, సం క్షేమ రంగానికి కేటాయించిన నిధులను ఇతర రంగాలకు కేటాయించారని చొప్పదండి ఎమ్మె ల్యే సుద్దాల దేవయ్య ఆరోపించారు. రాష్ట్ర బడ్జెట్‌పై ‘ఆంధ్రభూమి’తో ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నారు. బడ్జెట్ కేటాయింపులను చూస్తుంటే కొత్తసీసాలో పాత సారా అన్నట్లుగానే ఉందని, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ అమలుకు సంబంధించి నిర్ధిష్టమైన కార్యాచరణ రూపం ఇవ్వలేదని ఎత్తి చూపారు. ఈ సారి జరిపిన కేటాయింపులనైనా సక్రమంగా ఖర్చు చేయాలని సూచించారు. ప్రభుత్వం ప్రారంభించిన ఏ సంక్షేమ కార్యక్రమాన్నైనా మద్యలో వదిలేసి నిర్వీర్యం చేయడం సరైన పంథా కాదని, సమర్థవంతంగా దాన్ని అమలుచేసేందుకు ప్రయత్నించాలే తప్ప దాన్ని చెడగొట్టకూడదని అభిప్రాయపడ్డారు.
ఆర్థిక సంక్షోభాన్ని పెంచే బడ్జెట్ :
ఎకనామిక్స్ ఫోరం
రాష్ట్ర ప్రభుత్వం 1,45,854 కోట్లతో ప్రవేశపెట్టిన 2012-13 వార్షిక బడ్జెట్ సామాన్యునిపై ప న్నుల భారాన్ని పెంచి కొనుగోలు శక్తి, జీవన ప్రమాణాన్ని, తలసరి ఆదాయాన్ని తగ్గించి సామాజిక, ఆర్థిక సంక్షోభాలను పెంచేదిగా ఉందని జిల్లా ఎకనామిక్స్ ఫోరం అధ్యక్షులు నేదునూరి కనుకయ్య అన్నారు. శుక్రవారం స్థానిక ఎకనామిక్స్ ఫోరం కార్యాలయంలో ‘రాష్ట్ర బడ్జెట్ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం’ అనే అంశంపై జరిగిన సమావేశానికి అధ్యక్షత వహించి మాట్లాడుతూ బడ్జెట్‌లో అమ్మకపు పన్ను, ఎక్సైజ్ పన్ను, స్టాంపు డ్యూటి 25 శాతానికి పెంచటం వల్ల ప్రజలపై అదనపు పన్నుల భారం పడుతోందని, బడ్జెట్‌లో గ్రామీణ రుణభారం, రైతు ఆత్మహత్యలు, గిట్టుబాటు ధర, పంట విరామం, కరువు నివారణ, రైతాంగానికి ఉత్పాదకాల సరఫరాలో కొరత, మారుమూల మెట్ట ప్రాంతాల అభివృద్ధి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టికి దోహదపడే గ్రామ పారిశ్రామికీకరణ, గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాల కల్పన, సహజ వనరుల రక్షణ, చిన్ననీటి వనరుల పరిరక్షణ, గ్రామీణ వలసను అరికట్టే చర్యలు, వైద్య ఆరోగ్య సంరక్షణకు అరకొర కేటాయింపులు కేంద్ర నిధుల దుర్వినియోగం, మళ్లింపు అమలులో అవకతవకలను అరికట్టే చర్యలు బడ్జెట్‌లో ప్రస్తావించకపోవటం వల్ల సాంఘీక, ఆర్థిక, పంపిణీ న్యాయానికి తీవ్ర విఘాతం ఏర్పడుతుందని అన్నారు. జిల్లా ఎకనామిక్స్ ఫోరం కార్యదర్శి డాక్టర్ సిహెచ్.శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రకృతి సంరక్షణ, వరదల నివారణ, పర్యావరణ పరిరక్షణ, మురుగునీటి కాలువల నిర్వహణకు సంబంధించి ప్రస్తావన లేకపోవటం శోచనీయం. రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సంవత్సర ఆర్థిక, సాంఘీక, సామాజిక సమస్యల నుండి విముక్తి పొందటానికి, సమగ్రాభివృద్ధికి సరైన కేటాయింపులు, కార్యచరణ లోపించిందన్నారు. బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి కేవలం 3175 కోట్లు 2 శాతం నిధులు, విద్యుత్‌కు 5935 కోట్లు, ఉన్నత విద్యకు 1841 కోట్లు కేటాయించి సంక్షోభంలోగల వ్యవసాయ, విద్యుత్, విద్యారంగాలను విస్మరించటం వల్ల మానవ వనరుల అభివృద్ధికి విఘాతం కలుగుతుందని అన్నారు. ఈ సమావేశంలో డాక్టర్ దశరథం, కె.రాంచంద్రం, రవీందర్ రెడ్డి, శకుంతల, కల్పన తదితరులు పాల్గొన్నారు.

జలయజ్ఞం పూర్తయ్యేనా.. | Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi

జలయజ్ఞం పూర్తయ్యేనా.. Andhrabhoomi - Telugu News Paper Portal Daily Newspaper in Telegu Telugu News Headlines Andhra Bhoomi