Saturday, July 14, 2012

తెలంగాణా ఏర్పాటుపై స్పష్టమైన సంకేతాలు

 
 తెలంగాణా రాష్ట్రంలో 24 జిల్లాలు ఏర్పాటు చేస్తామని తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు శుక్రవారం కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం సింగాపూర్ గ్రామంలో ప్రకటించారు. తెలంగాణా ఏర్పాటుపై తనకు కాంగ్రెస్ హై కమాండ్ నుండి స్పష్టమైన సంకేతాలు ఉన్నట్లు అయన వెల్లడించారు.

Friday, April 6, 2012

కరీంనగర్ జిల్లాలోనూ యురేనియం నిక్షేపాలు

కరీంనగర్, ఏప్రిల్ 5: అణు విద్యుత్ కర్మాగారాలకు అత్యంత కీలకమైన ఇంధన వనరైన యురేనియం నిలువలు జిల్లాలో వెలుగులోకి వచ్చా యి. 2023 నాటికి దేశంలో రెండు గిగావాట్ల అణు విద్యుత్‌ను ఉత్పత్తి చేయడం లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం ఈ దిశగా అణు విద్యుత్ కర్మాగారాలను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించిన విష యం తెలిసిందే. ఇప్పటికే రాజస్థాన్, గుజరాత్‌లోని కోక్రాఫర్‌లలో 1400 మెగావాట్ల అణు విద్యుత్ కర్మాగారాలను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు ప్రారంభించింది.
అంతకుముందు తమిళనాడులోని కుడంకులం అణు విద్యుత్ కర్మాగారాల నిర్మాణం చేపట్టిన విషయం తెలిసిందే. అయితే అణు విద్యుత్ ఉత్పత్తిలో కీలక పాత్ర పోషించే అణు (రేడియో) ధార్మిక మూలకాల్లో ప్రధానమైన ఇంధనాలుగా గుర్తింపు పొందిన యురేనియం, థోరియం ఇంధనాల కోసం విదేశాలపై ఆధారపడవలసి వస్తుండడంతో భారత అణు ఇంధన సంస్థ నేతృత్వంలోని ఆటమిక్ మైనింగ్ డైరెక్టరేట్ పర్యవేక్షణలో 2006 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున రేడియో ధార్మిక మూలకాల కోసం అనే్వషణ కొనసాగిస్తోంది. సగటున 220 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి 45 టన్నుల యురేనియం అవసరమవుతోంది. అంతేకాకుండా విద్యుత్ ఉత్పాదక వ్యయం కూడా భారీగా తగ్గే పరిస్థితులుండడంతో అణు విద్యుత్ ఉత్పాదనలో కీలకమైన ఇందన వనరుగా ఉపయోగపడుతున్న యురేనియం వెలికితీతకు కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగానే చొప్పదండి మండలం భూపాలపట్నం, కొత్తూర్, పెద్దూర్ గ్రామాల పరిధిలో పెద్దఎత్తున యురేనియం నిలువలను కనుగొన్నట్లు గనుల శాఖకు చెందిన విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
కడప జిల్లా తుమ్మలపల్లి, నల్లగొండ జిల్లా పెద్ద అడిచెర్లపల్లి, లంబాపూర్ తదితర ప్రాంతాల్లో ప్రపంచంలోనే అత్యధిక యురేనియం డిపాజిట్లను కనుగొన్నారు. తుమ్మలపల్లి ప్రాజెక్టు పరిధిలో సుమారు 160 కిలోమీటర్ల నిడివిలో 400 మీటర్ల లోతు వరకు యురేనియం లభ్యమయ్యే అవకాశమున్నట్లు ఆటమిక్ మినరల్ డైరెక్టరేట్ నిర్ధారించింది. ఇక్కడ సుమారు 49 వేల టన్నుల యురేనియం లభ్యం కావచ్చని భావిస్తుండగా నల్లగొండ జిల్లా పెద్దఅడిచెర్లపల్లి పరిధిలో కూడా సుమారు 1800 టన్నులకు పైగా యురేనియం లభ్యం కావచ్చని అంచనా వేశారు. ఇక కరీంనగర్ జిల్లా విషయానికొస్తే యురేనియం నిల్వలు ఏ స్థాయిలో ఉన్నాయన్న విషయం పూర్తిగా నిర్ధారణ కాకపోయినప్పటికీ ఇక్కడ వెలుగు చూసిన యురేనియం ప్రధానంగా 1.96 ట్రై యురేనియం ఆక్టోసైడ్ యు-308 రకానికి చెందిందిగా నిర్ధారించారు. తవ్వకాల కోసం యుసిఐఎల్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

డాలర్ కల..దళారుల వల..!


సదానంద్ బెంబిరే
--------------------
ఆంధ్రభూమి బ్యూరో, కరీంనగర్,

ఏప్రిల్ 6:    డాలర్ కలల్లో మునిగి తేలుతున్న రాష్ట్ర యువకులు ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి దొడ్డిదారిన పరాయి దేశానికి పయనమవుతున్నారు. ప్రధానంగా అంతర్యుద్ధంతో కొట్టుమిట్టాడిన ఇరాక్‌లో పెద్దఎత్తున ప్రారంభమైన పునర్‌నిర్మాణ కార్యక్రమాలు ఇక్కడి కార్మికులకు కొత్త అవకాశాలను సృష్టిస్తున్నాయి. అన్ని వసతులు కల్పించి ప్రతీ నెల 325 నుంచి 500 డాలర్ల వరకు వేతనాలు చెల్లిస్తుండడంతో ఇరాక్‌కు వెళ్లేందుకు ఎగబడుతున్నారు. దీన్ని పసిగట్టిన విదేశీ నకిలీ మ్యాన్‌పవర్ కన్సల్టెన్సీలు బోగస్ వీసాలను సృష్టించి దొడ్డిదారిన తరలించినట్లు అనధికారిక గణాంకాల ద్వారా తెలుస్తోంది. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల నుంచే ఈ తరహా వలసలు అధికంగా కనిపిస్తుండగా కర్నూలు, కడప, తూర్పు గోదావరి జిల్లాల నుంచి కూడా భారీగానే ఉన్నట్లు చెబుతున్నారు. మానవ వనరులు చౌకగా లభించే దక్షిణాసియా ప్రాంతంలోని ఇండియా, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్థాన్ వంటి దేశాలకు చెందిన కార్మికులను మాత్రమే లక్ష్యంగా చేసుకొని ఏజెన్సీలు పెద్దఎత్తున అక్రమ నియామకాలకు పాల్పడుతున్నట్లు భావిస్తున్నారు. దౌత్యపరమైన అడ్డంకులు ఎదురవుతున్న దృష్ట్యా సౌదీ అరేబియా, ఓమన్ దేశాలకు చెందిన ఏజెంట్లు నకిలీ మ్యాన్ పవర్ కన్సల్టెన్సీలను సృష్టించి ఇక్కడి కార్మికులకు ఓమన్‌లో ఉపాధి కల్పిస్తున్నట్లు నకిలీ వీసాలు సృష్టించి కార్మికులను ఢిల్లీ నుంచి ఓమన్‌కు తరలిస్తున్నారు. రెండు నెలలు మొదలుకొని ఆరు నెలల కాల పరిమితితో కూడిన విజిట్ వీసాలను ఇచ్చి ఇరాక్‌లోని కుర్దిస్థాన్‌కు తరలిస్తున్నారు. కాలపరిమితి ముగిసిన తరువాత కూడా అక్కడే మకాం వేయడంతో కుర్దిష్ పోలీసులు ఇలాంటి సుమారు 400 మంది కార్మికులను అరెస్టు చేసి జైళ్లలోకి తోయడంతో ఈ వ్యవహారం బట్టబయలైంది. దురదృష్టవశాత్తు కార్మికులు మరణిస్తే వారి మృతదేహాలను తీసుకొచ్చేందుకు దౌత్యపరంగా కూడా అనేక చిక్కులు తలెత్తుతున్నట్లు చెబుతున్నారు. గతంలో మనుషుల అక్రమ రవాణాపై పెద్దఎత్తున ఆరోపణలు రావడంతో స్పెషల్ టాస్క్ఫోర్స్ బృందాలు తెలంగాణ జిల్లాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించి వందల సంఖ్యలో ఏజెంట్లను అరెస్టు చేశారు. దాంతో రూటు మార్చిన మ్యాన్‌పవర్ కన్సల్టెన్సీలు ఇరాక్‌లో ఉపాధి పొందుతున్న స్థానికుల సహాయంతో ఫోన్ టు ఫోన్ నెట్‌వర్క్‌తో పనులు చక్కబెట్టుకుంటూ ఓమన్ ఏజెన్సీల ద్వారా ఇండియాకు వీసాలు జారీ చేస్తున్నట్లు తెలుస్తోంది.
కరీంనగర్ జిల్లా ధర్మపురి మండలం దొంతాపూర్ గ్రామం విదేశీ రాకపోకలతో ఎపుడు సందడిగా ఉంటుంది. ఊరి జనాభా మూడు వేలు ఉంటే ప్రస్తుతం 1200 ల మందికి పైగా సౌదీ అరేబియా, ఓమన్, ఖతర్‌తో సహా ఇరాక్ వంటి దేశాల్లో ఉపాధి పొందుతున్నారు. ఈ ఊళ్లో 50 ఏళ్లు పైబడిన వృద్ధులు, 17 ఏళ్లలోపు పిల్లలు,మహిళలు మాత్రమే కనిపిస్తారు.

Monday, March 5, 2012

కోల్ బెల్ట్ లో జార్ఖండ్ తరహా బొగ్గు మాఫియా

బొగ్గు మాఫియా..!

  • 05/03/2012
కరీంనగర్, మార్చి 4: రామగుండం పారిశ్రామిక ప్రాంతం క్రమంగా కోల్ మాఫియాకు అడ్డాగా మారుతోంది. బహిరంగ మార్కెట్‌లో టన్నుల బొగ్గుకు 1500 రూపాయల పై చిలుకు ధర పలుకుతుండటం బొగ్గు దొంగల పంట పండిస్తోంది. దాంతో రామగుండం, సెంటినరి కాలనీ, ఎన్‌టిపిసి ప్రాంతాల్లో బొగ్గు చౌర్యం ఒక వృత్తిగా మారింది. ఇదంతా ఒకెత్తయితే ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లికి చెందిన ఓ వ్యాపారి ఏకంగా కూలీలను పెట్టి మరీ బొగ్గు చౌర్యం చేయిస్తూ తాను రెండు చేతులా ఆర్జించటమే కాకుండా స్థానిక ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలు, పోలీసులకు ముడుపులు ముట్టజెపుతూ ధర్జాగా అక్రమ వ్యాపారం నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సింగరేణి, ఎన్‌టిపిసి సిబ్బంది కూడా శక్తి వంచన లేకుండా యధాశక్తి సహకరిస్తున్నారన్న విమర్శలున్నాయి. ఫలితంగా సింగరేణి విస్తరించి ఉన్న నాలుగు జిల్లాల్లో ఏటా బొక్కసానికి దాదాపు 12 కోట్ల రూపాయల పైచిలుకు చిల్లు పడుతున్నట్లు అంచనా. బెల్లంపల్లి, మందమర్రి, భూపాలపల్లి, కొత్తగూడెం, ఇల్లందు ప్రాంతాల్లోనూ దాదాపు ఇదే తరహాలో బొగ్గు తస్కరించబడుతున్నట్లు తెలుస్తోంది.
నల్ల బంగారంగా పిలువబడుతున్న బొగ్గు అక్రమార్కులకు కాసుల పంట పండిస్తోంది. సింగరేణి గనులు విస్తరించి ఉన్న రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కొంతమంది బడా రాజకీయ నాయకులు, పోలీస్ అధికారుల దన్నుతో జార్ఖండ్ కోల్ మాఫియాను తలదనే్న రీతిలో ఏటా సుమారు 12 కోట్ల రూపాయల విలువైన బొగ్గు లూటీ యదేశ్చగా సాగిపోతోంది. ఈ తతంగంలో రాజకీయ నేతలతో పాటు సింగరేణి, నేషనల్ థర్మల్ పవర్ స్టేషన్ సిబ్బంది, సింగరేణి సెక్యూరిటీఫోర్స్, సిఐఎస్‌ఎఫ్ సిబ్బంది పాత్ర కూడా ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల మాటలను బట్టి అర్థమవుతోంది. కరీంనగర్ జిల్లాలో ఈ వ్యవహారం గడచిన కొనే్నళ్లుగా గుట్టుగా సాగిపోతున్నప్పటికి ఇటీవలి కాలంలో మరీ అధికంగా చౌర్యం జరుగుతున్నట్లు గుర్తించారు. ప్రధానంగా రైళ్ల వ్యాగన్ల నుండే బొగ్గును తస్కరించడం ఎక్కువైపోయినట్లు గుర్తించారు. అదిలాబాద్ జిల్లా బెల్లంపల్లికి చెందిన ఓ వ్యాపారి సగటున రోజుకు 2 లక్షల నుండి 3 లక్షల రూపాయల వరకు బొగ్గు చౌర్యం కోసం కూలీలకు పెట్టుబడి పెడుతున్నట్లు తెలుస్తోంది. సుమారు రెండు వందల మంది కూలీలకు రోజుకు 200ల నుంచి 250 రూపాయల వేతనం చెల్లించి ఎన్‌టిపిసికి బొగ్గు రవాణా చేస్తున్న రైళ్ల వ్యాగన్ల నుండి 3 కిలోమీటర్ల పొడవునా బొగ్గును డంపింగ్ చేయిస్తున్నట్లు చెబుతున్నారు. రామగుండం థర్మల్ స్టేషన్‌కు విద్యుత్ ఉత్పాదన కోసం ప్రతిరోజు సుమారు రెండు రేకులు అంటే 40 వేల టన్నుల బొగ్గు అవసరమవుతుంది. దానికి అవసరమైన బొగ్గు నిల్వలు రామగుండం పరిధిలోని ఒపెన్‌కాస్ట్-1, 2, 3ల ద్వారా సరఫరా చేస్తున్నారు. రోజుకు మూడు రైళ్లద్వారా ఎన్‌టిపిసికి ఈ పరిమాణాన్ని రవాణా చేస్తున్నారు. అయితే అక్రమ బొగ్గు వ్యాపారంలో అరితేరిన బెల్లంపల్లికి చెందిన వ్యాపారి కూలీలను నియోగించి ఎల్కలపల్లి గేట్, లక్ష్మిపూర్, సెంటినరీ కాలనీ తదితర ప్రాంతాల్లో రైల్వే వ్యాగన్ల నుండి కిందపడేసి సంచుల్లో నింపి చెట్లపొదల్లో దాచిపెట్టి రాత్రి కాగానే ఆయా బ్యాగుల్లో ఉన్న బొగ్గు నిల్వలను లారీల్లోకి మార్చి రాష్ట్ర రాజదాని పరిసరాల్లో ఉన్న వివిధ రకాల పరిశ్రమలు, ఫెర్రోఅల్లాయిస్ ఫ్యాక్టరీలకు విక్రయిస్తున్నారు. అంతేకాకుండా కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లోని ఇటుక బట్టీ వ్యాపారులకు టన్నుకు 15 వందల రూపాయలు మొదలుకుని 1650 వరకు విక్రయిన్నట్లు తెలుస్తోంది. తన అక్రమ తతంగానికి అడ్డు తగలకుండా ఉండేందుకు సదరు వ్యాపారి స్థానిక ప్రజాప్రతినిధులు, పోలీసులకు ప్రతి నెలా నజరానగా భారీ మొత్తంలో సొమ్ములు ముట్టజెబుతున్నట్లు చెబుతున్నారు. అంతే కాదు కంచే చేను మేసిందన్నట్లుగా సాక్షాత్తు సింగరేణి అదికారులకు కూడా ఈ పాపంలో వాటాలున్నట్లు అరోపణలున్నాయి. అలాగే సింగరేణి ఆస్తుల రక్షణ కోసం ఏర్పాటు చేసిన సెక్యూరిటీ సిబ్బందికి కూడా భాగస్వామ్యం ఉన్నట్లు తెలుస్తోంది. ఒసిపి-2 డంప్ యార్డు నుండే బొగ్గు చౌర్యం అధికంగా జరుగుతున్నట్లు సమాచారం. ఈ విషయం తెలిసినా సంబందిత పోలీస్ అధికారులు గాని, సింగరేణి యాజమాన్యం కాని పట్టించుకున్న పాపాన పోలేదు. పైపెచ్చు బొగ్గు అక్రమ డంపింగ్‌కు పాల్పడే ముఠాలు ముందుగానే సంబందిత పోలీసులు, సిబ్బందికి సమాచారం అందిస్తారని, తద్వారా దొంగతనం జరుగుతున్నప్పుడు సిబ్బంది ఆ ప్రాంతాల వైపు కనె్నత్తికూడా చూడరని స్థానికులు చెబుతుండటం ఈ సందర్బంగా ఎంతైనా గమనించదగ్గ విషయమే. ఎన్‌టిపిసికి బొగ్గు సరఫరా చేసే రైల్వే వ్యాగన్లలో ముందుగానే పథకం ప్రకారం ఎక్కే కూలీలు ఎల్కలపల్లి అండర్ బ్రిడ్జ్, లక్ష్మీపూర్ ప్రాంతాల్లో లారీలను సిద్ధంగా ఉంచి నేరుగా వ్యాగన్ల నుంచి లారీల్లోకి డంప్ చేస్తున్నట్లు సమాచారం. ఇలా సగటున రోజుకు కనీసం రెండు, మూడు లారీలైనా చౌర్యం జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో బొగ్గు చౌర్యం కొత్త కాకపోయినా జార్ఖండ్ తరహాలో మాఫియా ముఠా సంస్కృతి పెరుగుతుండటమే అందోళన కలిగించే విషయం. జార్ఖండ్‌లోని బొగ్గు గనులు రాజకీయ నేతల కనుసన్నల్లోనే పనిచేస్తాయి. అక్కడ వాస్తవిక బొగ్గు ఉత్పత్తిలో దాదాపు 35 శాతం బొగ్గు మాఫియా తస్కరించి సొమ్ముచేసుకుంటోంది. అక్కడి గనులన్నీ కూడా మారుమూల అటవీ ప్రాంతాల్లో ఉండటం, నక్సల్ సమస్య అధికంగా ఉండటం వంటి అంశాల నేపథ్యంలో క్క్రడి ప్రభుత్వం బొగ్గు మాఫియా ముఠాలపై చర్యలు తీసుకోలేకపోతోంది. దాంతో గత దశాబ్ద కాలంగా చిన్నచిన్న దొంగతనాలతో కార్యకలాపాలు నెరిపిన ముఠాలు ఆయుదాలు సంపాదించి సమాంతర వ్యవస్థనే నడుపుతున్నాయి. తాజాగా రామగుండం ప్రాంతంలోనూ ముఠా సంస్కృతి పాదుకుంటున్నట్లు ఇటీవలి సంఘటనలు స్పష్టం చేస్తున్నాయి. ఇకపోతే బొగ్గును రేల్ వ్యాగన్ల నుండి క్రిందపడేసే క్రమంలో కూలీలు ప్రమాదవశాత్తు రైలు క్రిందపడి మరణిస్తున్న సంఘటనలు ఇటీవల కాలంలో తరుచుగా సంభవిస్తున్నాయి. గతంలో విద్యుత్ గాతానికి గురై అవయువాలు కోల్పోయి జీవశ్చావాలుగా బ్రతుకులీడుస్తున్న కూలీలు రామగుండం ప్రాంతంలో చాలా మంది కనిపిస్తారు.
పెరుగుతున్న తుపాకీ సంస్కృతి
ఉపాధి లేక ఖాళీగా ఉండే నిరుద్యోగులను ట్రాప్‌లో పడేస్తున్న కోల్ మాఫియా లీడర్లు యువకుల చేతికి అక్రమ ఆయుధాలను ఇచ్చి అసాంఘీక కార్యక్రమాలకు పాల్పడుతుండడం గోదావరిఖని ప్రాంతంలో సర్వసాధారణమైపోయింది. ఇన్‌ఫార్మర్ల పేరుతో సదరు యువకులకు పోలీస్ శాఖ అండదండలు కూడా పుష్కలంగా లభిస్తుండడంతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల ఈ వసూళ్ల వ్యవహారంలోనే ఐడి పార్టీ కానిస్టేబుల్ రమేష్ హత్య జరిగినట్లు ప్రచారం జరిగింది. హంతకుల వద్ద లభ్యమైన తుపాకి లైసెన్స్ జార్ఖండ్‌కు చెందిన ఓ బొగ్గు వ్యాపారి పేరుమీద ఉండడం సింగరేణిలోనూ మాఫియా సంస్కృతి వేళ్లూనుకుంటుందనడానికి తార్కాణంగా పేర్కొనవచ్చు. 

ఇందిర జలప్రభలో అవినీతి!

  • సదానంద్ బి.
  • 05/03/2012
కరీంనగర్, మార్చి 4: సమగ్ర భూ అభివృద్ధి పథకం ఇందిర జలప్రభ కార్యక్రమం ద్వారా పాడుపడిన భూములను సాగులోకి తెచ్చేందుకు సంకల్పించిన బృహత్తర కార్యక్రమంలో అవినీతి ఊటలు కనిపిస్తున్నాయి. స్వాతంత్య్రం వచ్చిననాటి నుంచి ఇప్పటివరకు ట్యాంక్ మేనేజ్‌మెంటు పథకం కింద భూగర్భ జలాల పెంపుకోసం అనేక కార్యక్రమాలు చేపడుతూ వస్తుండగా అందుకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం జలప్రభ ద్వారా బోర్ల తవ్వకానికి అనుమతివ్వడం విమర్శలకు దారి తీస్తోంది. ప్రస్తుతం ట్యాంక్ మేనేజ్‌మెంటు పథకం కింద 12 వేల కోట్లతో చెరువుల మరమ్మతు, పూడికతీత పనులు జరుగుతున్నాయి. తద్వారా భూగర్భజలాలు పెంపొందించాలనేది లక్ష్యం. అయితే ప్రభుత్వ తాజా నిర్ణయం దాన్ని నీరుగార్చేదిగా తయారైంది. ఇదంతా ఒకెత్తయితే జలప్రభలో పది ఎకరాలను ఒక యూనిట్‌గా తీసుకొని సామూహిక సాగు పద్ధతి కింద బోర్లు తవ్వడం వల్ల రైతుల మధ్య నీటి నిర్వహణ, బోర్ల నిర్వహణపై తగాదాలు ఉత్పన్నమవుతున్నాయి. అంతేకాకుండా ఈ పథకం ప్రారంభమైన తరువాత బ్రోకర్లు, రాజకీయంగా ప్రాబల్యం ఉన్నవారికే యూనిట్లు కేటాయిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. భూగర్భ జలాల నీటి మట్టాన్ని కాపాడేందుకు వాల్టా చట్టాన్ని ప్రభుత్వమే తూట్లు పొడిచేలా వ్యవహరించడంపై భూగర్భ జలవనరుల శాఖ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే హార్డ్‌రాక్ ఫార్మేషన్ ప్రభావం అధికంగా ఉన్న తెలంగాణ జిల్లాల్లో పరిమితికి మించి బోర్లువేయడం వల్ల భూగర్భజలాలు దారుణంగా పడిపోయాయని చెబుతున్నారు. ఈ కారణంగానే భూగర్భ జలవనరుల శాఖ జలప్రభ పథకం ఆచరణ సాధ్యం కాదంటూ తేల్చి చెప్పింది.
ప్రస్తుతం ఈ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన బీడు భూములన్నీ కూడా కొండలు, గుట్టల ప్రాంతాల్లో ఉండడం, అక్కడ బోర్లు వేసినా ఫలితం ఉండదని, ప్రభుత్వానికి స్పష్టంగా తెలిసినప్పటికీ పథకాన్ని అమలు చేయడం వెనుక ఆంతర్యమేమిటన్నది ఎవరికీ అంతు చిక్కని ప్రశ్నగా మారింది. ఈ పథకాన్ని అమలు చేయలేమంటూ పంచాయతీరాజ్, భూగర్భ జలవనరుల శాఖ, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖలు చేతులెత్తేసినప్పటికీ డ్వామాలకు అప్పగించడం ఆశ్చర్యం కలిగిస్తోందని భూగర్భ జలవనరుల శాఖ అధికారులు ప్రస్తావిస్తుండడం ఈ సందర్భంగా గమనార్హం. ఇదిలా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా 23 జిల్లాల్లో నాబార్డు ద్వారా 900 కోట్లు, ఉపాధిహామీ పథకానికి సంబంధించిన 900 కోట్లు మొత్తం 1800 కోట్ల రూపాయల అంచనాతో లక్ష బోర్లు వేయాలని తలపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం సాధ్యాసాధ్యాలు బేరీజు వేసుకోకుండా కోట్లాది రూపాయలు దుబారా చేస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఉపాధిహామీ నిధులను కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా దారి మళ్లించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎస్సీ, ఎస్టీలకు చెందిన పది లక్షల ఎకరాలను సాగుయోగ్యంగా మలచాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇందుకు సంబంధించి పది ఎకరాలకు ఒక బోరు చొప్పున సామూహిక బావుల తవ్వకానికి శ్రీకారం చుట్టింది. అయితే నిర్దేశిత ఎస్సీ, ఎస్టీల భూముల్లో బోర్ల తవ్వకానికి సంబంధించి ఫీజబులిటీ పాయింట్లను గుర్తించేందుకు జియాలజిస్టుల అవసరముంటుంది. భూగర్భ జలవనరుల శాఖ తమ వద్ద సిబ్బంది లేరంటూ చేతులెత్తేయడంతో రాష్ట్ర నీటి నిర్వహణ సంస్థ కేంద్ర కార్యాలయం మొత్తం 65 మంది జియాలజిస్టులను నిర్ణీత కాలవ్యవధితో నియమించింది. వీరికి నెలకు 24 వేల రూపాయల వేతనం చెల్లించేందుకు నిర్ణయించింది. అలాగే మరో 35 మంది ప్రైవేటు జియాలిస్టులతో కమీషన్ పద్ధతిపై ఒప్పందం కుదుర్చుకోగా భూగర్భ జలవనరుల శాఖకు చెందిన 40 మందిని డిప్యూటేషన్‌పై నీటి నిర్వహణ సంస్థలకు అప్పగించారు. వీరంతా ఆయా జిల్లాల్లోని ఎస్సీ, ఎస్టీల భూముల్లో సర్వే నిర్వహించి జలవనరులు లభ్యమయ్యే అవకాశమున్న మూడు పాయింట్లను గుర్తిస్తారు.
వర్టికల్ ఎలక్ట్రికల్ సౌండింగ్ పద్ధతిలో బోర్ పాయింట్లను గుర్తించిన తరువాతే డ్రిల్లింగ్ చేయాల్సి ఉండగా, ఫిక్స్‌డ్ టైమ్ ఎంప్లాయిమెంటు పద్ధతిపై తీసుకున్న సిబ్బందితో కాకుండా ఆయా జిల్లాల్లోని ప్రైవేటు జియాలజిస్టులతో సర్వేలు జరిపించి డ్రిల్లింగ్‌లు నిర్వహిస్తుండడం వల్ల ఒక్కో బోర్ పాయింట్‌కు లక్షా 70 వేల రూపాయల వరకు ఖర్చు పెడుతోంది. అయితే అసలు కిటుకంతా ఇక్కడే ఉంది. ప్రైవేటు జియాలజిస్టులకు ఒక్కో పాయింట్‌కు వేయి రూపాయల చొప్పున ఫీజు చెల్లిస్తుండడంతో సదరు జియాలజిస్టులు రిగ్గు ఓనర్లతో కుమ్మక్కై ఒకటి కంటే ఎక్కువ డ్రిల్లింగ్‌లు జరిపేలా సహకరిస్తున్నట్లు తెలుస్తోంది. దాంతో ఒక్కో బ్లాక్‌పై రిగ్గు ఓనర్లు కనీసం రెండు లక్షల ఆదాయం సమకూరేలా సంబంధిత అధికారులతో లాలూచి పడుతున్నట్లు భోగట్టా. వాస్తవానికి బోరుపాయింట్ గుర్తించిన తరువాత డ్రిల్లింగ్ జరిపేటప్పుడు రిగ్గు యజమానులు ఎంతలోతు డ్రిల్లింగ్ చేస్తున్నారనే విషయాన్ని గుర్తించేందుకు సాంకేతికంగా అవగాహన కలిగిన సిబ్బంది అక్కడే ఉండాలి. కానీ ఆచరణలో అలాంటిదేమీ కనిపించడం లేదు. రిగ్గు యజమాని ఇచ్చిన కొలతలనే ప్రామాణికంగా చేసుకొని బిల్లులు చెల్లిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అదీ కాకుండా చాలా జిల్లాల్లో ఒకరిద్దరు రిగ్గు ఓనర్లతోనే ఎంఓయులు చేసుకొని పెద్దఎత్తున అవినీతికి పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఎఫ్‌టిహెచ్, రోటరీ పద్ధతుల్లో బోర్‌వెల్ డ్రిల్లింగ్ జరుపుతున్నారు. ఒక్కో జిల్లాలో సగటున 50వేల ఎకరాలను ఈ పథకం కింద సాగులోకి తెచ్చేందుకు నిర్ణయించగా కరీంనగర్ జిల్లాలో 31వేల ఎకరాలకు 48 వేల కోట్ల రూపాయలతో 175 బోర్లు, 47 ఓపెన్ వెల్స్, మూడు ఫిల్టర్ పాయింట్లను వేయాలని నిర్ణయించారు. కాగా ఇప్పటివరకు రాష్ట్రంలో మెదక్ జిల్లా బోర్ల తవ్వకంలో అగ్రస్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడ వంద బ్లాక్‌లకు కోటి 69 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. ఆ తరువాతి స్థానంలో కరీంనగర్‌లో 146 బ్లాక్‌లకు గాను 65 డ్రిల్లింగ్ పూర్తి చేశారు. అలాగే ఖమ్మం, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో కూడా పెద్దఎత్తున పురోగతిలో ఉన్నట్లు తెలుస్తోంది.

Tuesday, February 28, 2012

చైనాకు పుంజుకుంటున్న గ్రానైట్ ఎగుమతులు

 

కరీంనగర్, ఫిబ్రవరి 23: కలర్ గ్రానైట్ పరిశ్రమకు ప్రసిద్ధిగాంచిన కరీంనగర్ జిల్లా నుండి చైనాకు తిరిగి ఎగుమతులు పుంజుకున్నాయి. జిల్లాలో 370కి పైగా ఉన్న గ్రానైట్ క్వారీల నుండి ప్రతి ఏటా దాదాపు రెండు లక్షల క్యూబిక్ మీటర్ల పైచిలుకు గ్రానైట్ బ్లాకులు చైనాకు ఎగుమతి అవుతున్నాయి. తద్వారా ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం సీనరేజీ రూపంలోమొత్తం 110 కోట్ల ఆదాయం సమకూరుతోంది. అయితే గతంలో ఉన్న సెల్ఫ్ రిమూవల్ విధానం కారణంగా గ్రానైట్ కంపెనీల యజమానులు ప్రభుత్వానికి తప్పుడు కొలతలతో విలువైన బ్లాకులను తరలించేవి. ఈ క్రమంలో మైనింగ్ అక్రమాలపై పెద్దఎత్తున విమర్శలు రావడంతో విజిలెన్స్ యంత్రాంగం స్టాక్‌యార్డులు, పోర్టులపై దాడులు జరిపింది. దాంతో గ్రానైట్ బ్లాకుల కొలతల్లో చోటుచేసుకున్న అవకతవకలు వెలుగుచూశాయి.
ప్రధానంగా చైనాకు ఎగుమతి చేసేందుకు కరీంనగర్ నుండి కాకినాడ పోర్టుకు తరలించిన బ్లాకులకు సంబంధించి కొలతల్లో భారీ వ్యత్యాసం కనుగొనడంతో ప్రభుత్వం ఎగుమతులకు బ్రేక్ వేసింది. ఫలితంగా నిన్న.. మొన్నటి వరకు కాకినాడ పోర్టు స్టాక్‌యార్డులో కరీంనగర్ గ్రానైట్ బ్లాకు నిల్వలు పెద్దఎత్తున పేరుకుపోయాయి. ఎగుమతులు స్తంభించిపోవడంతో గ్రానైట్ పరిశ్రమ సంక్షోభంలో పడింది. ఫలితంగా జిల్లా వ్యాప్తంగా సుమారు రెండు వందలకు పైగా క్వారీలు మూతపడే దశకు చేరుకున్నాయి. ఎగుమతులు పూర్దిగా నిలిచిపోవడంతో కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టిన వ్యాపారులు ఆర్థికంగా దివాళతీసే పరిస్థితికి చేరుకున్నారు. ఎట్టకేలకు ప్రభుత్వం పేనాల్టీలతో వదిలేయడంతో నిర్ణీత మొత్తాన్ని చెల్లించిన వ్యాపారులు తిరిగి తమ కార్యకలాపాలను ప్రారంభించారు. జిల్లాలో మొత్తం 370 కలర్ గ్రానైట్ క్వారీలుండగా ఇందులో 168 క్వారీలు నగర శివారులోని ఓడ్యారం ప్రాంతంలోనే ఉన్నాయి. జిల్లా మొత్తంలో లభించే విలువైన కలర్ గ్రానైట్‌లో దాదాపు 80 శాతం డిపాజిట్స్ ఇక్కడే ఉన్నట్లు మైనింగ్ నిపుణుల మాటల్ని బట్టి అర్థమవుతోంది. ఇక్కడ గ్రానైట్ రాళ్లను బ్లాకులుగా కత్తిరించి 1మీటర్ నుండి 10 క్యూబిక్ మీటర్ల పరిమాణంలో చైనాకు ఎగుమతి చేస్తున్నారు. చైనాలో గ్రానైట్ పాలిషింగ్ కుటీర పరిశ్రమగా ఉండటంతో చైనాకు అవసరమైన ముడి బ్లాకుల్లో 70 శాతం ఆంధ్రప్రదేశ్ నుండి ఎగుమతి అవుతోంది. ఇందులో కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఏటా మూడు వేల కోట్ల విలువైన 2లక్షల యాబై వేల క్యూబిక్ మీటర్ల గ్రానైట్ బ్లాకులు ఎగుమతి అవుతున్నాయి. ఇక్కడ లభిస్తున్న గ్రానైట్‌కు చైనాలో మార్కెట్ మంచి డిమాండ్ లభించడంతో జిల్లాకు చెందిన చాలా మంది వ్యాపారులు గ్రానైట్ వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ వరసలో కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌కు చెందిన శే్వత గ్రానైట్స్ ముందు వరసలో ఉంది.

*గర్భసంచి తీసేయ్ డబ్బు సంచి నింపెయ్* డబ్బుల కోసం హిస్ట్రెక్టమీ

24/02/2012

కరీంనగర్, ఫిబ్రవరి 23: తెలంగాణ జిల్లాల్లోని మహిళలకు హిస్ట్రెక్టమీ ఫోబియా పట్టి పీడిస్తోంది. మరీ ముఖ్యంగా కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ వలసలు అధికంగా ఉన్న జిల్లాల్లో దీని తీవ్రత మరీ అధికంగా కనిపిస్తోంది. ధనార్జనే పరామవదిగా పనిచేస్తున్న కొన్ని ప్రైవేట్ నర్సింగ్‌హోంలు నిరక్ష్యరాస్యులైన గ్రామీణ మహిళలను లక్ష్యంగా చేసుకొని గర్బసంచి తొలగింపు (హిస్ట్రెక్టమి) అపరేషన్లకు పాల్పడుతున్నాయి. దాంతో సహజంగానే గర్భ సంచికి ఏర్పడే ప్రతీ సమస్య క్యాన్సర్‌కే దారి తీయవచ్చన్న అపోహలు మహిళల్లో పాతుకుపోవడంతో నర్సింగ్ హోంలు దీన్ని అవకాశంగా తీసుకొని గ్రామీణ ప్రాంతాల్లో వైద్యులుగా చెలామణి అవుతున్న ఆర్‌ఎంపి, పిఎంపిలను ఏజెంట్లుగా నియమించుకొని మహిళలను వెతికి మరీ ఆపరేషన్లు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలోనూ హిస్ట్రెక్టమీ ఆపరేషన్లు జరిగినప్పటికీ 2006లో ఈ సర్జరీలను ఆరోగ్యశ్రీలో చేర్చిన తరువాత మాత్రమే సర్జరీల సంఖ్య అధికమైనట్లు ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ గుర్తించింది. ఆరోగ్య శ్రీ ప్రారంభించిన తరువాత వరంగల్ నగరానికి చెందిన ఓ నర్సింగ్ హోం 18 నెలల కాలంలో ఏకంగా వేయికి పైగా హిస్ట్రెక్టమీ సర్జరీలు చేసి కోటి 80 లక్షల రూపాయలు క్లైమ్ చేయడం హిస్ట్రెక్టమీ ఆపరేషన్ల తీరుకు తార్కాణంగా చెప్పవచ్చు. దాంతో పెద్దఎత్తున ఆరోపణలు రావటం,ప్రభుత్వం విచారణ జరిపి సంబంధిత ఆసుపత్రిపై చర్యలు తీసుకొంది. ఆ తరువాత ఆరోగ్య శ్రీ పరిధిలో ఈ తరహా సర్జరీలు చేయడానికి మహిళలకు కనీసం 35 సంవత్సరాల వయోపరిమితి నిర్ణయించారు. అలా చేసినా కూడా అదుపులోకి రాకపోవడంతో ఏకంగా రాష్ట్ర వ్యాప్తంగా 15 జిల్లాల్లో హిస్ట్రెక్టమీ ఆపరేషన్లను ఆరోగ్య శ్రీ పరిధి నుంచి తొలగించారు. ప్రస్తుతం ఉన్న ఎనిమిది జిల్లాల్లోనూ కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, మెదక్ జిల్లాల్లో సర్జరీలు జరుగుతున్నప్పటికీ వయో పరిమితిని 40 ఏళ్లకు పెంచారు. అంతేకాకుండా ఆరు నెలల పాటు వైద్యం చేయించుకోవాల్సి ఉంటుంది. అప్పటికీ తగ్గకపోతేనే సర్జరీకి అనుమతిస్తారు. కరీంనగర్ జిల్లాకు సంబంధించి 2008 నుంచి ఇప్పటివరకు 11 వేల మందికి హిస్ట్రెక్టమీ ఆపరేషన్లు జరిగినట్లు ఆరోగ్య శ్రీ కో-ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్న డాక్టర్ అనంతరెడ్డి ‘ఆంధ్రభూమి’కి చెప్పారు. మరీ ముఖ్యంగా జగిత్యాల, సిరిసిల్ల వంటి ప్రాంతాల్లోనే ఈ తరహా సర్జరీలు అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రైవేటు నర్సింగ్ హోములు గతంలో హిస్ట్రెక్టమీ సర్జరీలకు ఐదు వేల నుంచి ఎనిమిది వేల రూపాయల చార్జి వసూలు చేయగా, ఆరోగ్యశ్రీలో చేర్చిన తరువాత 35 వేల నుంచి 40 వేల వరకు క్లైమ్ చేస్తున్నట్లు గుర్తించారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వం క్లైమ్‌లకు బ్రేక్ వేయడంతో ప్రైవేటు నర్సింగ్ హోముల్లో ఎనిమిది వేల నుంచి 12 వేల మధ్య చార్జీలతో సర్జరీలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో మొత్తం 1500 లకు పైగా నర్సింగ్ హోంలలో ఈ తరహా సర్జరీలు జరుగుతున్నట్లు చెబుతున్నారు. వాస్తవానికి 40 సంవత్సరాల పైబడిన మహిళలకు సర్జరీ చేస్తే ఎలాంటి సమస్యలు లేవు. కానీ 20 ఏళ్లు పైబడిన యువతులు కూడా ఈ ఆపరేషన్లు చేయించుకోవడం వల్ల ఆరోగ్యంపై ఇతర దుష్పరిణామాలు చోటు చేసుకుంటున్నట్లు చెబుతున్నారు.
అవగాహన కల్పిస్తాం: డింహెచ్‌ఓ
కరీంనగర్ జిల్లాలో హిస్ట్రెక్టమీ ఆపరేషన్లపై అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని, డిఎంహెచ్‌ఓ నాగేశ్వర్ చెప్పారు. ఇప్పటికే గ్రామాల్లో ఉండే ఎఎన్‌ఎంలు, హెల్త్ అసిస్టెంట్ల ద్వారా అవగాహన కల్పిస్తున్నామన్నారు. గర్భసంచి తొలగింపు వల్ల ఉత్పన్నమయ్యే దుష్ప్రరిణామాలు సర్వేకల్ ఇన్‌ఫెక్షన్, ఫ్రీక్వెన్ డెలీవరీలపై అవగాహన కల్పిస్తామన్నారు. అలాగే మహిళలను తప్పుదోవ పట్టిస్తున్న ఆర్‌ఎంపి, పిఎంపిలపై త్వరలోనే చట్టపరమైన చర్యలు చేపట్టబోతున్నట్లు ఆయన వెల్లడించారు.
================================
నయం చేయవచ్చు!
కరీంనగర్: గర్భసంచికి ఏర్పడే ప్రతీ ఫైబ్రాయిడ్ గడ్డ కేన్సర్ కాదని, ప్రాథమిక దశలో గుర్తించి చికిత్స చేస్తే వందకు వంద శాతం సమర్థవంతంగా నయం చేయవచ్చునని కరీంనగర్ జిల్లాలో ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ జి.శ్రీలత వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మహిళలకు అపరిశుభ్ర పరిస్థితులు, రుతు సంబంధమైన సమస్యలు, బహుళ సంబంధాల వంటి అంశాల కారణంగా ఏర్పడే ఆరోగ్య సమస్యలను కేన్సరేనన్న అపోహలతో బలవంతంగా సర్జరీ చేయించుకుంటున్నారని, దానివల్ల దీర్ఘకాలంలో అనేక శారీరక సమస్యలు ఉత్పన్నమై ప్రాణాంతకంగా పరిణమించవచ్చునని హెచ్చరించారు. సాధారణంగా ఫైబ్రాయిడ్ గడ్డల్లో మాత్రమే హెవీ బ్లీడింగ్ జరుగుతుందని, దానికి మంచి వైద్యం అందుబాటులో ఉందన్నారు. 50 ఏళ్లు పైబడిన మహిళలకు గర్భ సంచి తొలగించడం వల్ల ఎలాంటి నష్టం లేదని చెప్పారు. సాధారణంగా గర్భసంచి సంబంధిత సమస్యలు చిన్న వయస్సులో సంతానం కలుగడం, సంతానానికి సంతానానికి మధ్య కాలవ్యవధి తక్కువగా ఉండటం వంటి కారణాలవల్లే ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయని చెప్పారు.

Sunday, February 19, 2012

జలయజ్ఞం పూర్తయ్యేనా..


కరీంనగర్, ఫిబ్రవరి 17: ముక్కుతూ మూలుగుతూ నడుస్తున్న జలయజ్ఞం ప్రాజెక్టులకు ఈసారైనా పూర్తి స్థాయిలో నిధులు కేటాయించపోవడంతో కరీంనగర్ జిల్లాలో దీనికింద చేపట్టిన ప్రాజెక్టుల పరిస్థితి మరోసారి గందరగోళంలో పడినట్లు కనిపిస్తోంది. జిల్లాలో ఎల్లంపల్లి, మిడ్‌మానేరు, కాళేశ్వర-ముక్తీశ్వర మినీ ఎత్తిపోతల ప్రాజెక్టులను చేపట్టిన ప్రభుత్వం నిధుల కేటాయింపులో చేస్తున్న తాత్సారం వల్ల పనులు మందకొడిగా సాగుతున్నాయి. అంతేకాకుండా మిడ్ మానేరుకు సంబంధించి 70 కోట్ల మేర మట్టి పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్లు ఖర్చు పెరిగిందన్న సాకుతో అంచనాలు పెంచితేనే పనులు చేస్తామని మొండికేయడంతో ప్రభుత్వం టెండర్లను రద్దు చేసి తాజాగా మరోసారి టెండర్లు పిలిచింది. అటు ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సంబంధించి మట్టిగడ్డ నిర్మాణ పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రస్తుతం 80 శాతం పనులు పూర్తికాగా మరో 20 శాతం మేర మైనర్ పనులు పూర్తి కావాల్సి ఉంది. షటర్లను బిగించే దశలో దాని నిర్మాణ పనులను చేపట్టిన కంపెనీ చేతులెత్తేయడంతో ప్రాజెక్టు మట్టి పనులు నిర్వహిస్తున్న ‘ష్యూ’ కంపెనీకే పనులు అప్పగించారు. అయితే నిధులు విడుదల చేయకపోవడంతో కాంట్రాక్టర్ ఉద్ధేశపూర్వకంగానే పనులు జాప్యం చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ప్రస్తుత బడ్జెట్‌లో జలయజ్ఞం ప్రాజెక్టుల కోసం 15 వేల కోట్లు నీటిపారుదల శాఖకు కేటాయించారు. ఇందులో కరీంనగర్ జిల్లాకు సంబంధించి ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 360 కోట్లు, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు కోసం 1100 కోట్లు, శ్రీరాంసాగర్ వరద కాలువకు 330 కోట్ల చొప్పున కేటాయింపులు జరిపినట్లు తెలుస్తోంది. ఏ మేరకు కేటాయింపులు జరిపారన్న విషయం అసెంబ్లీలో జలయజ్ఞంపై చర్చ సందర్భంలోనే వెలుగు చూసే అవకాశముంది. రాష్ట్ర బడ్జెట్ తీరుతెన్నులను పరిశీలిస్తే మరోసారి సంక్షేమానికి రంగానికి మొండిచేయే చూపిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ అమలుకు సంబంధించి నిర్ధష్టమైన కార్యాచరణ రూపం ఇవ్వకుండా నిధులు దారి మళ్లించేందుకు ప్రయత్నిస్తోందన్న ఆరోపణల నేపథ్యంలో తాజా బడ్జెట్‌లో జరిపిన కేటాయింపులనైనా సక్రమంగా ఖర్చు చేస్తారా? లేదా? అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి శుక్రవారం శాసనసభలో ప్రవేశపెట్టిన లక్షా 45 వేల కోట్ల బడ్జెట్‌ను పరిశీలిస్తే ఇందులో వ్యవసాయం, కరువు, విద్య, వైద్యం వంటి కీలక రంగాలకు కంటితుడుపు కేటాయింపులు జరిపారన్న విషయం అర్థమవుతోంది. అంతేకాకుండా సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి కూడా కేటాయింపులు నామమాత్రంగానే జరిగాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం సాంఘీక సంక్షేమ శాఖకు 2677 కోట్లు కేటాయించగా, బిసి సంక్షేమానికి 2101 కోటి, మైనారిటీ సంక్షేమానికి 488 కోట్లు, వికలాంగుల సంక్షేమానికి 66 కోట్లు, గిరిజన మహిళా సంక్షేమ పథకాల కోసం 2285 కోట్ల చొప్పున కేటాయింపులు జరిపింది. అలాగే అటవీశాఖలో వివిధ అభివృద్ది కార్యక్రమాల అమలుకోసం 500 కోట్లు ఖర్చు చేసేందుకు కేటాయింపులు జరుపగా మత్స్యశాఖకు 234 కోట్లు, శుసంవర్థక శాఖకు 1106 కోట్లు కేటాయింపులు జరిపింది. రోడ్లు, భవనాలు, రవాణా శాఖలకు సుమారు ఐదు వేల కోట్లు కేటాయింపులు జరుపగా, విద్యార్థుల స్కలర్‌షిప్‌లు, ఫీజు రీయంబర్స్‌మెంటు కోసం 3820 కోట్లు, శాసనసభా నియోజకవర్గాల అభివృద్ధికోసం ఒక్కో నియోజకవర్గానికి కేటాయించింది. అలాగే ఇందిరా జలప్రభ పథకం కింద ఎస్సీ,ఎస్టీల భూముల్లో నీటి వసతి కల్పించేందుకు లక్ష బోర్లను తవ్వించాలని నిర్ణయించింది. యువజన, ఉపాధికల్పనకోసం రాజీవ్ యువశక్తి పథకానికి 150 కోట్లు కేటాయించింది. వ్యవసాయ శాఖకు సంబంధించి కరువు సహాయం క్రింద 3500 కోట్లు, వ్యవసాయ రంగానికి 3175 కోట్లు కేటాయింపులు జరిపింది. అలాగే పట్టణాభివృద్ధి కోసం 6,586 కోట్లు కేటాయించడం జరిగింది.
సంక్షేమ రంగానికి పెద్దపీట
*మంత్రి శ్రీ్ధఠ్ బాబు
ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి 2011-12 సంవత్సరానికి ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ చాలా బాగుందని పౌరసరఫరాలు, శాసన సభావ్యవహారాల శాఖ మంత్రి డి.శ్రీ్ధర్ బాబు అన్నారు. సంక్షేమ రంగానికి పెద్దపీట వేశారని శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బిసి, ఎస్సీ,ఎస్టీ, మైనారిటీ, మహిళా సంక్షేమానికి గత ఏడాది కంటే ఎక్కువమొత్తంలో నిధులు కేటాయించారని చెప్పారు. రాష్ట్ర చరిత్రలోనే ఇది అత్యుత్తమ సంక్షేమ బడ్జెట్ అని మంత్రి పేర్కొన్నారు. వెనుకబడిన తరగతుల సంక్షేమానికి గత సంవత్సరం కేటాయింపుల కంటే 43 శాతం, మహిళా సంక్షేమానికి 22 శాతం, వికలాంగుల సంక్షేమానికి 37 శాతం, మైనారిటీల సంక్షేమానికి 62 శాతం అధికంగా నిధులు కేటాయించారని అన్నారు. పౌరసరఫరాల శాఖకు గత ఏడాది రూ.2667 కోట్ల కేటాయించగా ఈ ఏడాది రూ.3175 కోట్లు కేటాయించారని చెప్పారు. సంక్షేమ రంగంతో పాటు వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రవాణా, రోడ్లు, భవనాలు, పట్టణాభివృద్ధి తదితర రంగాలకు ఎక్కువ మొత్తంలో నిధులు కేటాయించారని తెలిపారు. హైదరాబాద్-కరీంనగర్-రామగుండం రహదారి నాలుగు లైన్లు విస్తరణకు బడ్జెట్‌లో 1,358.19 కోట్లు కేటాయించారని తెలిపారు.
కొత్త సీసాలో పాత సారా
* ఎమ్మెల్యే సుద్దాల దేవయ్య
రాష్ట్ర ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో కొత్తదనం ఏమీ కనిపించడం లేదని, సం క్షేమ రంగానికి కేటాయించిన నిధులను ఇతర రంగాలకు కేటాయించారని చొప్పదండి ఎమ్మె ల్యే సుద్దాల దేవయ్య ఆరోపించారు. రాష్ట్ర బడ్జెట్‌పై ‘ఆంధ్రభూమి’తో ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నారు. బడ్జెట్ కేటాయింపులను చూస్తుంటే కొత్తసీసాలో పాత సారా అన్నట్లుగానే ఉందని, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ అమలుకు సంబంధించి నిర్ధిష్టమైన కార్యాచరణ రూపం ఇవ్వలేదని ఎత్తి చూపారు. ఈ సారి జరిపిన కేటాయింపులనైనా సక్రమంగా ఖర్చు చేయాలని సూచించారు. ప్రభుత్వం ప్రారంభించిన ఏ సంక్షేమ కార్యక్రమాన్నైనా మద్యలో వదిలేసి నిర్వీర్యం చేయడం సరైన పంథా కాదని, సమర్థవంతంగా దాన్ని అమలుచేసేందుకు ప్రయత్నించాలే తప్ప దాన్ని చెడగొట్టకూడదని అభిప్రాయపడ్డారు.
ఆర్థిక సంక్షోభాన్ని పెంచే బడ్జెట్ :
ఎకనామిక్స్ ఫోరం
రాష్ట్ర ప్రభుత్వం 1,45,854 కోట్లతో ప్రవేశపెట్టిన 2012-13 వార్షిక బడ్జెట్ సామాన్యునిపై ప న్నుల భారాన్ని పెంచి కొనుగోలు శక్తి, జీవన ప్రమాణాన్ని, తలసరి ఆదాయాన్ని తగ్గించి సామాజిక, ఆర్థిక సంక్షోభాలను పెంచేదిగా ఉందని జిల్లా ఎకనామిక్స్ ఫోరం అధ్యక్షులు నేదునూరి కనుకయ్య అన్నారు. శుక్రవారం స్థానిక ఎకనామిక్స్ ఫోరం కార్యాలయంలో ‘రాష్ట్ర బడ్జెట్ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం’ అనే అంశంపై జరిగిన సమావేశానికి అధ్యక్షత వహించి మాట్లాడుతూ బడ్జెట్‌లో అమ్మకపు పన్ను, ఎక్సైజ్ పన్ను, స్టాంపు డ్యూటి 25 శాతానికి పెంచటం వల్ల ప్రజలపై అదనపు పన్నుల భారం పడుతోందని, బడ్జెట్‌లో గ్రామీణ రుణభారం, రైతు ఆత్మహత్యలు, గిట్టుబాటు ధర, పంట విరామం, కరువు నివారణ, రైతాంగానికి ఉత్పాదకాల సరఫరాలో కొరత, మారుమూల మెట్ట ప్రాంతాల అభివృద్ధి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టికి దోహదపడే గ్రామ పారిశ్రామికీకరణ, గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాల కల్పన, సహజ వనరుల రక్షణ, చిన్ననీటి వనరుల పరిరక్షణ, గ్రామీణ వలసను అరికట్టే చర్యలు, వైద్య ఆరోగ్య సంరక్షణకు అరకొర కేటాయింపులు కేంద్ర నిధుల దుర్వినియోగం, మళ్లింపు అమలులో అవకతవకలను అరికట్టే చర్యలు బడ్జెట్‌లో ప్రస్తావించకపోవటం వల్ల సాంఘీక, ఆర్థిక, పంపిణీ న్యాయానికి తీవ్ర విఘాతం ఏర్పడుతుందని అన్నారు. జిల్లా ఎకనామిక్స్ ఫోరం కార్యదర్శి డాక్టర్ సిహెచ్.శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రకృతి సంరక్షణ, వరదల నివారణ, పర్యావరణ పరిరక్షణ, మురుగునీటి కాలువల నిర్వహణకు సంబంధించి ప్రస్తావన లేకపోవటం శోచనీయం. రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సంవత్సర ఆర్థిక, సాంఘీక, సామాజిక సమస్యల నుండి విముక్తి పొందటానికి, సమగ్రాభివృద్ధికి సరైన కేటాయింపులు, కార్యచరణ లోపించిందన్నారు. బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి కేవలం 3175 కోట్లు 2 శాతం నిధులు, విద్యుత్‌కు 5935 కోట్లు, ఉన్నత విద్యకు 1841 కోట్లు కేటాయించి సంక్షోభంలోగల వ్యవసాయ, విద్యుత్, విద్యారంగాలను విస్మరించటం వల్ల మానవ వనరుల అభివృద్ధికి విఘాతం కలుగుతుందని అన్నారు. ఈ సమావేశంలో డాక్టర్ దశరథం, కె.రాంచంద్రం, రవీందర్ రెడ్డి, శకుంతల, కల్పన తదితరులు పాల్గొన్నారు.

జలయజ్ఞం పూర్తయ్యేనా.. | Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi

జలయజ్ఞం పూర్తయ్యేనా.. Andhrabhoomi - Telugu News Paper Portal Daily Newspaper in Telegu Telugu News Headlines Andhra Bhoomi