Saturday, January 9, 2016

కీలెరిగి వాత.. అదే మోడి మంత్ర..


కీలెరిగి వాత...
అదే మోడి మంత్ర...

By Sadanand Bembre

ఒకరి అవసరాలను మన దేశప్రయోజనాలకు అనుకూలంగా మలచుకోవడమే అసలు సిసలు దౌత్యనీతి. ఈ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ గతంలో ఏ ప్రధానికి సాధ్యం కాని అసాధ్యాలను నరేంద్ర మోడి సుసాధ్యం చేసి చూపుతున్నారు. దశాబ్దాల పాటు భ్రష్టు పట్టి పోయిన విదేశీ సంబందాలను తనదైన పంథాలో గాడిలో పెడుతూ అగ్రరాజ్యాలను అశ్చర్యానికి గురి చేస్తున్నారు.

మోడీ వ్యవహర శైలి స్వదేశంలో ప్రధాన ప్రతిపక్షాలను, స్వపక్షంలో ఉన్న విపక్షాన్ని మెప్పించలేకపోయినా.. వ్యూహాత్మక అంశాలపై భారత్ దౌత్య నీతి పదును తేలిందనే సంకేతాలను ప్రపంచ దేశాలకు పంపడంలో  ఆయన ఇప్పటికే ఘన విజయం సాధించాడు. ఈ నేపథ్యంలోనే నిన్న మొన్నటి వరకు భారత్ ను చిన్న చూపు చూసిన దేశాలన్నీ కూడా ఇండియాతో సంబంధాలను సరిచేసుకోక తప్పని అనివార్య స్థితిని సృష్టించడమే మోడి సాధించిన మొదటి దౌత్య విజయమని చెప్పవచ్చు.

వెనకటి వెన్నెముక లేని ప్రభుత్వాల నిర్వాకం ఫలితంగా భారత వ్యూహాత్మక రక్షణ విధానం కూడా దారుణంగా దెబ్బతింది. ఈ కారణంగానే శ్రీలంక, నేపాల్, మాల్దీవులు వంటి దేశాలు కూడా చైనాకు దగ్గరయ్యే పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. ఈ కారణంగానే మోడీ వ్యూహాత్మకంగా ప్రదాని ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భారత ఉపఖండంలోని దేశాల అధినేతలను అహ్వానించినప్పుడే ఆయన ఏ ఉద్దేశ్యంతో ఉన్నారో ప్రపంచ దేశాలకు అర్థమయ్యింది. ఈ క్రమంలోనే నిన్నటి దాక పట్టించుకోనట్లు నటించిన దేశాలు అన్ని తమ వైఖరులను విడనాడే పరిస్థితులు సృష్టించారు.

మోడిని ప్రసన్నం చేసుకోవడం ఇప్పుడు పాశ్చాత్య దేశాలకు అవసరం గనుక పొగుడుతున్నారు. ఇదే నరేంద్ర మోడి గుజరాత్ ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు అమెరికా సహా పాశ్చాత్య దేశాలు అన్ని కూడ బలుక్కున్నట్లు మత తత్వ వాదిగా ముద్ర వేసి తమ దేశాలకు రాకుండా నిషేధం విదించడం అప్పుడే ఎలా మర్చిపోగలం? హఠాత్తుగా వారు తమ వ్యూహం మార్చుకోవడానికి వారి స్వార్థ ప్రయోజనాలు కాపాడుకోవడానికే కాని మోడిపై అభిమానంతో ఎంత మాత్రం కాదు. చైనాను కట్టడి చేయడం కోసం అమెరికా, ఐరోపా పెద్దన్న రష్యా ప్రాబల్యాన్ని తగ్గించడం కోసం యూరోపియన్ యూనియన్ దేశాలకు భారత్ లాంటి పెద్ద రాజ్యంతో చెలిమి అవసరం.
అదీ కాకుండా ప్రపంచం మొత్తంలో అతిపెద్ద మార్కెట్ కలిగిన.. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం కూడా భారత్ మాత్రమే. డొమెస్టిక్ క్రైసిస్ తో కూనారిల్లిపోయిన అమెరికన్ అర్థిక వ్యవస్థకు అర్థికంగా దన్నును ఇవ్వగలిగిన శక్తి సామర్థ్యాలు మార్కెట్ అవసరాల పరంగా భారత్ మాత్రమే దానికి కనిపిస్తున్న ఏకైక ఆశాకిరణం. ప్రపంచంలో రెండవ అతిపెద్ద అర్థిక వ్యవస్థ కలిగిన చైనా కూడా మార్కెటింగ్ పరంగా భారత్ కంటే పెద్దదే అయినా అది దిగుమతి చేసుకునే పరిస్థితులు అసలే లేవు. అంతేకాకుండా చౌక వస్తువులు ఉత్పత్తి చేసి ప్రపంచం మొత్తం మీద అతిపెద్ద ఎగుమతి దారుగా ఆవిర్భవించింది. అలాగే ప్రపంచం మొత్తం మీద అత్యధిక డాలర్ల విదేశీ ద్రవ్య నిల్వలు కలిగి ఉండటం.. సోషలిస్టు దేశం కావడం వంటి అంశాలు అమెరికన్ పాలకులకు కలవరపెడుతున్న కారణంగా బౌగోళికంగా చైనాకు పొరుగునే ఉన్న భారత్ కు కూడా దానితో సత్సంబంధాలు సరిగ్గా లేకపోవడం వంటి కారణాల వల్ల అమెరికా వ్యూహాత్మక విధానాలలో భాగంగానే ఇండియాతో చెలిమికి అరాటపడుతోంది.

అదీ కాకుండా సోవియట్ పతనం తర్వాత కుప్పకూలిపోయిన అవశేష రష్యా వ్లాదిమిర్ పుతిన్ నేతృత్వంలో పూర్వ వైభవం సంతరించుకునే దిశగా ప్రస్థానిస్తుండటం కూడా అమెరికన్ పాలకులకు కంటగింపు కలిగించే విషయం.  దురాక్రమణ నెపంతో రష్యాపై అంక్షలు విదించి అర్థికంగా చక్రబంధంలో ఇరికించడం ద్వారా తన చెప్పు చేతల్లో ఉంచుకునేందుకు వ్యూహం రచించింది. ఈ క్రమంలో రష్యా ఉత్పత్తి చేస్తున్న చమురును కొనుగోలు చేయకుండా అడ్డుకుంటోంది.

అయితే అమెరికాతో కంటే రష్యాతోనే భారత్ బలమైన సంబంధం కలిగి ఉన్నందున దాన్నుండి దూరం చేసేందుకు వ్యూహాత్మకంగా భారత్ కు తాను అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు నటిస్తోందంతే.

ఏవరీ మరాఠా (ఆరె) క్షత్రీయ..!?


ఆరె మరాఠా సామాజిక వర్గం- చారిత్రక నేపథ్యం..


By Sadanand Bembre

మహోజ్వల భారత చరిత్రలో మరాఠాల చరిత్ర ఎంతో ప్రాశస్త్యం మరియు విశిష్టమైనది. జన్మతః రాజపుత్ర ( బ్రహ్మణ), ధర్మతః క్షత్రీయ, వృత్తి రీత్యా వ్యవసాయ నిపుణులు.. ఈ లక్షణాలే  హైందవ సమాజంలో మరాఠాలను ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి.  అంతే కాదు మెజారిటీ ప్రజలై ఉండి కూడా తమకంటూ ఒక రాజ్యం లేక మొగలాయి చక్రవర్తుల పాలన కింద దిక్కూ.. మొక్కూ లేకుండా బ్రతుకులీడుస్తున్న హైందవ సమాజానికి ఒక ఉనికినిచ్చి మాకూ ఓ రాజ్యముందీ అని గర్వంగా చెప్పుకునేలా హిందూ సామ్రాజ్య స్థాపన ఒక్క మరాఠాల వల్ల మాత్రమే సాకారమైంది. అందుకే దేశవ్యాప్తంగా ఎక్కడైనా మరాఠాలను ప్రస్తావించే సందర్భాల్లో వీర్ మరాఠా అన్న విశేషణాన్ని జతచేసి సంభోదిస్తారు. 
ఇక మరాఠా అనగానే మనకు ఠక్కున గుర్తుకొచ్చేది చత్రపతి శివాజీ మహారాజ్ మాత్రమే. నిజమే కాని అంతకు ముందు కూడా మనకు ఘనమైన చారిత్రిక వారసత్వం ఉంది. ప్రపంచానికి చెరుకు పంటను పరిచయం చేసింది మరాఠాలే. అదేంటి ఓ వైపు క్షత్రీయులు అంటూనే మరోవైపు వ్యవసాయ నిపుణులు అంటున్నారేమిటన్న సందేహాలు కలగొచ్చు. మరాఠీ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు యుద్ధ సమయాల్లో సైనికులుగా.. యుద్ధ విరామ సమయాల్లో రైతులుగా వ్యవసాయం చేసుకునే తమ కుటుంభాలను పోషించుకునే వారు. (ఇప్పటికీ మరాఠా సామాజిక వర్గం అటు మహారాష్ట్ర, కర్ణాటక, ఇటు తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ లలో వ్యవసాయం చేసుకునే జీవనం సాగించడం గమనించాల్సిన విషయం.) శివాజీ మహారాజ్ మరాఠా సామ్రాజ్య స్థాపన యజ్ఞంలో భాగస్వామి కావడం ప్రతీ మరాఠా తన పవిత్రమైన కర్తవ్యంగా భావించారు కాబట్టే శివాజీ ఆనాడు విజయవంతంగా హైందవ సామ్రాజ్య స్థాపన చేయగలిగారు. 
అంతకు ముందు ఎంత మంది హిందూ రాజులు లేరు..వారికి సాధ్యం కాని హిందూ రాజ్య స్థాపన శివాజీ మాత్రమే ఏలా చేయగలిగారు? శివాజీ కంటే ముందు గొప్ప హిందూమత అభిమానం కలిగిన రాజపుత్ర వీరుడు రాణా ప్రతాప్ సింగ్ కు కూడా ఎందుకు సాధ్యం కాలేదు?. ఎందుకంటే వారెవరూ కూడా శివాజీ లాగ  తమ లక్ష్య సాధనలో ప్రజలను మమేకపర్చలేకపోయారు. ఆ పనిని శివాజీ చేయగలిగారు కాబట్టే ఆయన యుగ పురుషుడయ్యారు.. 

ఆరె/ మరాఠా/ ఆర్య క్షత్రీయ..

ఇంతకు మనం ఏవరం? ఆరె వాళ్లమా..!? మరాఠీలమా..!? లేక ఆర్యక్షత్రీయులమా..!? ఏది వాస్తవం..? అసలు ఆరె అంటే ఏమిటి? అది కులమా లేక జాతి పేరా? ఇలాంటి సందేహాలెన్నో మన మరాఠా సోదరులకున్నాయి. పోయిన తరానికి మనమెవరమో తెలుసు.. కాని ఎక్కడి నుండి వచ్చామో .. ఎందుకొచ్చామో తెలియనివారు చాలా మంది ఉన్నారు. వాస్తవానికి "ఆరె" అనేది ఒక కులం పేరు కాదు. " ఆరె" అంటే ఉర్ధూ భాషలో "వచ్చిన వారు" అని అర్థం.  అవిభాజ్య హైదరాబాద్ రాజ్యంలో ప్రస్తుతం మహారాష్ట్రలోని మరట్వాడ ప్రాంతంతో పాటు కర్ణాటక రాష్ట్రంలోని ఈశాన్య జిల్లాలైన బీదర్ , రాయచూర్ , బీజాపూర్, యాద్గీర్ వంటి ప్రాంతాలు అంతర్భాగంగా ఉండేవి. అప్పట్లో నిజాం తన పాలనా పరమైన అవసరాలకు మరాఠీ సామాజిక వర్గానికి చెందిన వారిని పాటిల్స్ గా, పట్వారీలుగా, వతన్ దారులుగా, పోలీస్ పాటిల్స్ గా నియమించుకునేవారు. ఇప్పటికీ మరాఠా వారిని "ఆరె పటేల్" అనే  సంభోధిస్తుండటాన్ని గమనించవచ్చు. కాబట్టి ఉద్యోగాల రీత్యా ఈ ప్రాంతానికి వలసలు విస్తృతంగా జరిగాయి. 
హైదరాబాదు రాష్ట్రంలో ఉర్ధూ అధికార భాషగా కొనసాగింది కాబట్టి.. అధికారిక వ్యవహారాల సందర్భంగా ఇతర ప్రాంతాలకు చెందిన వారు కూడా ఉన్నారు కాబట్టి మరాఠీ అధికారులను గుర్తించడం కోసం ఆరె పటేల్ అని సంభోదించేవారు. అలా ఆరె అనే పదం స్థిరపడి మరాఠా కు పర్యాయ పదంగా పరిణామం చెందింది. అదే సమయంలో ఆంధ్ర ప్రాంతంలో మాత్రం మొదటి నుండి వారిని మరాఠీలుగానే వ్యవహరిస్తున్నారు..వారి ఉనికికి గుర్తింపు కూడా మరాఠాలు గానే కొనసాగింది.
 ఎటొచ్చి తెలంగాణా ప్రాంతంలో మాత్రమే గందరగోళం. కర్ణుడి చావుకు నూటొక్క కారణాలన్న ట్లు..  ఇక్కడ ఆరె, ఆరోళ్లు, ఆరె వాండ్లు, ఆరె పటేండ్లు, ఆర్య క్షత్రీయ, ఆరె మరాఠా అనే పేర్లతో పిలవడం ఒక కారణమైతే.. ఆ విద్య.. ఐక్యత కొరవడటం ఈ ప్రాంతంలో ప్రజల పాలిట శాపంగా పరిణమించింది. 
అంతేకాకుండా గ్రామీణ ప్రాంతంలో మన ప్రజలను వ్యవహారికంగా ఆరె పటేల్ అని సంభోధించటం వల్ల 1990 వ దశకంలో ఈ వర్గం సామాజిక నిర్మాణం పై సరైన అవగాహన లేని ఓ తహసిల్దార్ అప్పట్లో తప్పుడు నివేదిక ఇవ్వడం వల్ల ప్రస్తుత దయనీయ పరిస్థితికి కారణం.



ఆర్య క్షత్రీయ

ఆర్య+క్షత్రియ= ఆర్య క్షత్రియ

సంస్కృతంలో ఆర్య అంటే గొప్ప అని అర్థం. ఆర్య క్షత్రియ అంటే గొప్ప క్షత్రీయుడు అని అర్థం. 

మరాఠా అంటే ఏమిటి..?

అసలు మరాఠా అంటే అర్థం ఏమిటి? ఇది చాలామంది మదిని తొలుస్తున్న ప్రశ్న. వాస్తవానికి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 99% మంది ప్రజలకు దీని అర్థం తెలియదు. 
మర్+హఠ= మరాఠా
అంటే మరణాన్ని జయించినవాడు/ అధిగమించినవాడు/ మరణానికి ఎదురునిలిచి పోరాడే వాడు... వీరుడు అని అర్థం.