Sunday, February 19, 2012

జలయజ్ఞం పూర్తయ్యేనా..


కరీంనగర్, ఫిబ్రవరి 17: ముక్కుతూ మూలుగుతూ నడుస్తున్న జలయజ్ఞం ప్రాజెక్టులకు ఈసారైనా పూర్తి స్థాయిలో నిధులు కేటాయించపోవడంతో కరీంనగర్ జిల్లాలో దీనికింద చేపట్టిన ప్రాజెక్టుల పరిస్థితి మరోసారి గందరగోళంలో పడినట్లు కనిపిస్తోంది. జిల్లాలో ఎల్లంపల్లి, మిడ్‌మానేరు, కాళేశ్వర-ముక్తీశ్వర మినీ ఎత్తిపోతల ప్రాజెక్టులను చేపట్టిన ప్రభుత్వం నిధుల కేటాయింపులో చేస్తున్న తాత్సారం వల్ల పనులు మందకొడిగా సాగుతున్నాయి. అంతేకాకుండా మిడ్ మానేరుకు సంబంధించి 70 కోట్ల మేర మట్టి పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్లు ఖర్చు పెరిగిందన్న సాకుతో అంచనాలు పెంచితేనే పనులు చేస్తామని మొండికేయడంతో ప్రభుత్వం టెండర్లను రద్దు చేసి తాజాగా మరోసారి టెండర్లు పిలిచింది. అటు ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సంబంధించి మట్టిగడ్డ నిర్మాణ పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రస్తుతం 80 శాతం పనులు పూర్తికాగా మరో 20 శాతం మేర మైనర్ పనులు పూర్తి కావాల్సి ఉంది. షటర్లను బిగించే దశలో దాని నిర్మాణ పనులను చేపట్టిన కంపెనీ చేతులెత్తేయడంతో ప్రాజెక్టు మట్టి పనులు నిర్వహిస్తున్న ‘ష్యూ’ కంపెనీకే పనులు అప్పగించారు. అయితే నిధులు విడుదల చేయకపోవడంతో కాంట్రాక్టర్ ఉద్ధేశపూర్వకంగానే పనులు జాప్యం చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ప్రస్తుత బడ్జెట్‌లో జలయజ్ఞం ప్రాజెక్టుల కోసం 15 వేల కోట్లు నీటిపారుదల శాఖకు కేటాయించారు. ఇందులో కరీంనగర్ జిల్లాకు సంబంధించి ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 360 కోట్లు, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు కోసం 1100 కోట్లు, శ్రీరాంసాగర్ వరద కాలువకు 330 కోట్ల చొప్పున కేటాయింపులు జరిపినట్లు తెలుస్తోంది. ఏ మేరకు కేటాయింపులు జరిపారన్న విషయం అసెంబ్లీలో జలయజ్ఞంపై చర్చ సందర్భంలోనే వెలుగు చూసే అవకాశముంది. రాష్ట్ర బడ్జెట్ తీరుతెన్నులను పరిశీలిస్తే మరోసారి సంక్షేమానికి రంగానికి మొండిచేయే చూపిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ అమలుకు సంబంధించి నిర్ధష్టమైన కార్యాచరణ రూపం ఇవ్వకుండా నిధులు దారి మళ్లించేందుకు ప్రయత్నిస్తోందన్న ఆరోపణల నేపథ్యంలో తాజా బడ్జెట్‌లో జరిపిన కేటాయింపులనైనా సక్రమంగా ఖర్చు చేస్తారా? లేదా? అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి శుక్రవారం శాసనసభలో ప్రవేశపెట్టిన లక్షా 45 వేల కోట్ల బడ్జెట్‌ను పరిశీలిస్తే ఇందులో వ్యవసాయం, కరువు, విద్య, వైద్యం వంటి కీలక రంగాలకు కంటితుడుపు కేటాయింపులు జరిపారన్న విషయం అర్థమవుతోంది. అంతేకాకుండా సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి కూడా కేటాయింపులు నామమాత్రంగానే జరిగాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం సాంఘీక సంక్షేమ శాఖకు 2677 కోట్లు కేటాయించగా, బిసి సంక్షేమానికి 2101 కోటి, మైనారిటీ సంక్షేమానికి 488 కోట్లు, వికలాంగుల సంక్షేమానికి 66 కోట్లు, గిరిజన మహిళా సంక్షేమ పథకాల కోసం 2285 కోట్ల చొప్పున కేటాయింపులు జరిపింది. అలాగే అటవీశాఖలో వివిధ అభివృద్ది కార్యక్రమాల అమలుకోసం 500 కోట్లు ఖర్చు చేసేందుకు కేటాయింపులు జరుపగా మత్స్యశాఖకు 234 కోట్లు, శుసంవర్థక శాఖకు 1106 కోట్లు కేటాయింపులు జరిపింది. రోడ్లు, భవనాలు, రవాణా శాఖలకు సుమారు ఐదు వేల కోట్లు కేటాయింపులు జరుపగా, విద్యార్థుల స్కలర్‌షిప్‌లు, ఫీజు రీయంబర్స్‌మెంటు కోసం 3820 కోట్లు, శాసనసభా నియోజకవర్గాల అభివృద్ధికోసం ఒక్కో నియోజకవర్గానికి కేటాయించింది. అలాగే ఇందిరా జలప్రభ పథకం కింద ఎస్సీ,ఎస్టీల భూముల్లో నీటి వసతి కల్పించేందుకు లక్ష బోర్లను తవ్వించాలని నిర్ణయించింది. యువజన, ఉపాధికల్పనకోసం రాజీవ్ యువశక్తి పథకానికి 150 కోట్లు కేటాయించింది. వ్యవసాయ శాఖకు సంబంధించి కరువు సహాయం క్రింద 3500 కోట్లు, వ్యవసాయ రంగానికి 3175 కోట్లు కేటాయింపులు జరిపింది. అలాగే పట్టణాభివృద్ధి కోసం 6,586 కోట్లు కేటాయించడం జరిగింది.
సంక్షేమ రంగానికి పెద్దపీట
*మంత్రి శ్రీ్ధఠ్ బాబు
ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి 2011-12 సంవత్సరానికి ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ చాలా బాగుందని పౌరసరఫరాలు, శాసన సభావ్యవహారాల శాఖ మంత్రి డి.శ్రీ్ధర్ బాబు అన్నారు. సంక్షేమ రంగానికి పెద్దపీట వేశారని శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బిసి, ఎస్సీ,ఎస్టీ, మైనారిటీ, మహిళా సంక్షేమానికి గత ఏడాది కంటే ఎక్కువమొత్తంలో నిధులు కేటాయించారని చెప్పారు. రాష్ట్ర చరిత్రలోనే ఇది అత్యుత్తమ సంక్షేమ బడ్జెట్ అని మంత్రి పేర్కొన్నారు. వెనుకబడిన తరగతుల సంక్షేమానికి గత సంవత్సరం కేటాయింపుల కంటే 43 శాతం, మహిళా సంక్షేమానికి 22 శాతం, వికలాంగుల సంక్షేమానికి 37 శాతం, మైనారిటీల సంక్షేమానికి 62 శాతం అధికంగా నిధులు కేటాయించారని అన్నారు. పౌరసరఫరాల శాఖకు గత ఏడాది రూ.2667 కోట్ల కేటాయించగా ఈ ఏడాది రూ.3175 కోట్లు కేటాయించారని చెప్పారు. సంక్షేమ రంగంతో పాటు వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రవాణా, రోడ్లు, భవనాలు, పట్టణాభివృద్ధి తదితర రంగాలకు ఎక్కువ మొత్తంలో నిధులు కేటాయించారని తెలిపారు. హైదరాబాద్-కరీంనగర్-రామగుండం రహదారి నాలుగు లైన్లు విస్తరణకు బడ్జెట్‌లో 1,358.19 కోట్లు కేటాయించారని తెలిపారు.
కొత్త సీసాలో పాత సారా
* ఎమ్మెల్యే సుద్దాల దేవయ్య
రాష్ట్ర ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో కొత్తదనం ఏమీ కనిపించడం లేదని, సం క్షేమ రంగానికి కేటాయించిన నిధులను ఇతర రంగాలకు కేటాయించారని చొప్పదండి ఎమ్మె ల్యే సుద్దాల దేవయ్య ఆరోపించారు. రాష్ట్ర బడ్జెట్‌పై ‘ఆంధ్రభూమి’తో ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నారు. బడ్జెట్ కేటాయింపులను చూస్తుంటే కొత్తసీసాలో పాత సారా అన్నట్లుగానే ఉందని, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ అమలుకు సంబంధించి నిర్ధిష్టమైన కార్యాచరణ రూపం ఇవ్వలేదని ఎత్తి చూపారు. ఈ సారి జరిపిన కేటాయింపులనైనా సక్రమంగా ఖర్చు చేయాలని సూచించారు. ప్రభుత్వం ప్రారంభించిన ఏ సంక్షేమ కార్యక్రమాన్నైనా మద్యలో వదిలేసి నిర్వీర్యం చేయడం సరైన పంథా కాదని, సమర్థవంతంగా దాన్ని అమలుచేసేందుకు ప్రయత్నించాలే తప్ప దాన్ని చెడగొట్టకూడదని అభిప్రాయపడ్డారు.
ఆర్థిక సంక్షోభాన్ని పెంచే బడ్జెట్ :
ఎకనామిక్స్ ఫోరం
రాష్ట్ర ప్రభుత్వం 1,45,854 కోట్లతో ప్రవేశపెట్టిన 2012-13 వార్షిక బడ్జెట్ సామాన్యునిపై ప న్నుల భారాన్ని పెంచి కొనుగోలు శక్తి, జీవన ప్రమాణాన్ని, తలసరి ఆదాయాన్ని తగ్గించి సామాజిక, ఆర్థిక సంక్షోభాలను పెంచేదిగా ఉందని జిల్లా ఎకనామిక్స్ ఫోరం అధ్యక్షులు నేదునూరి కనుకయ్య అన్నారు. శుక్రవారం స్థానిక ఎకనామిక్స్ ఫోరం కార్యాలయంలో ‘రాష్ట్ర బడ్జెట్ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం’ అనే అంశంపై జరిగిన సమావేశానికి అధ్యక్షత వహించి మాట్లాడుతూ బడ్జెట్‌లో అమ్మకపు పన్ను, ఎక్సైజ్ పన్ను, స్టాంపు డ్యూటి 25 శాతానికి పెంచటం వల్ల ప్రజలపై అదనపు పన్నుల భారం పడుతోందని, బడ్జెట్‌లో గ్రామీణ రుణభారం, రైతు ఆత్మహత్యలు, గిట్టుబాటు ధర, పంట విరామం, కరువు నివారణ, రైతాంగానికి ఉత్పాదకాల సరఫరాలో కొరత, మారుమూల మెట్ట ప్రాంతాల అభివృద్ధి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టికి దోహదపడే గ్రామ పారిశ్రామికీకరణ, గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాల కల్పన, సహజ వనరుల రక్షణ, చిన్ననీటి వనరుల పరిరక్షణ, గ్రామీణ వలసను అరికట్టే చర్యలు, వైద్య ఆరోగ్య సంరక్షణకు అరకొర కేటాయింపులు కేంద్ర నిధుల దుర్వినియోగం, మళ్లింపు అమలులో అవకతవకలను అరికట్టే చర్యలు బడ్జెట్‌లో ప్రస్తావించకపోవటం వల్ల సాంఘీక, ఆర్థిక, పంపిణీ న్యాయానికి తీవ్ర విఘాతం ఏర్పడుతుందని అన్నారు. జిల్లా ఎకనామిక్స్ ఫోరం కార్యదర్శి డాక్టర్ సిహెచ్.శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రకృతి సంరక్షణ, వరదల నివారణ, పర్యావరణ పరిరక్షణ, మురుగునీటి కాలువల నిర్వహణకు సంబంధించి ప్రస్తావన లేకపోవటం శోచనీయం. రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సంవత్సర ఆర్థిక, సాంఘీక, సామాజిక సమస్యల నుండి విముక్తి పొందటానికి, సమగ్రాభివృద్ధికి సరైన కేటాయింపులు, కార్యచరణ లోపించిందన్నారు. బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి కేవలం 3175 కోట్లు 2 శాతం నిధులు, విద్యుత్‌కు 5935 కోట్లు, ఉన్నత విద్యకు 1841 కోట్లు కేటాయించి సంక్షోభంలోగల వ్యవసాయ, విద్యుత్, విద్యారంగాలను విస్మరించటం వల్ల మానవ వనరుల అభివృద్ధికి విఘాతం కలుగుతుందని అన్నారు. ఈ సమావేశంలో డాక్టర్ దశరథం, కె.రాంచంద్రం, రవీందర్ రెడ్డి, శకుంతల, కల్పన తదితరులు పాల్గొన్నారు.

జలయజ్ఞం పూర్తయ్యేనా.. | Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi

జలయజ్ఞం పూర్తయ్యేనా.. Andhrabhoomi - Telugu News Paper Portal Daily Newspaper in Telegu Telugu News Headlines Andhra Bhoomi