Monday, March 5, 2012

ఇందిర జలప్రభలో అవినీతి!

  • సదానంద్ బి.
  • 05/03/2012
కరీంనగర్, మార్చి 4: సమగ్ర భూ అభివృద్ధి పథకం ఇందిర జలప్రభ కార్యక్రమం ద్వారా పాడుపడిన భూములను సాగులోకి తెచ్చేందుకు సంకల్పించిన బృహత్తర కార్యక్రమంలో అవినీతి ఊటలు కనిపిస్తున్నాయి. స్వాతంత్య్రం వచ్చిననాటి నుంచి ఇప్పటివరకు ట్యాంక్ మేనేజ్‌మెంటు పథకం కింద భూగర్భ జలాల పెంపుకోసం అనేక కార్యక్రమాలు చేపడుతూ వస్తుండగా అందుకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం జలప్రభ ద్వారా బోర్ల తవ్వకానికి అనుమతివ్వడం విమర్శలకు దారి తీస్తోంది. ప్రస్తుతం ట్యాంక్ మేనేజ్‌మెంటు పథకం కింద 12 వేల కోట్లతో చెరువుల మరమ్మతు, పూడికతీత పనులు జరుగుతున్నాయి. తద్వారా భూగర్భజలాలు పెంపొందించాలనేది లక్ష్యం. అయితే ప్రభుత్వ తాజా నిర్ణయం దాన్ని నీరుగార్చేదిగా తయారైంది. ఇదంతా ఒకెత్తయితే జలప్రభలో పది ఎకరాలను ఒక యూనిట్‌గా తీసుకొని సామూహిక సాగు పద్ధతి కింద బోర్లు తవ్వడం వల్ల రైతుల మధ్య నీటి నిర్వహణ, బోర్ల నిర్వహణపై తగాదాలు ఉత్పన్నమవుతున్నాయి. అంతేకాకుండా ఈ పథకం ప్రారంభమైన తరువాత బ్రోకర్లు, రాజకీయంగా ప్రాబల్యం ఉన్నవారికే యూనిట్లు కేటాయిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. భూగర్భ జలాల నీటి మట్టాన్ని కాపాడేందుకు వాల్టా చట్టాన్ని ప్రభుత్వమే తూట్లు పొడిచేలా వ్యవహరించడంపై భూగర్భ జలవనరుల శాఖ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే హార్డ్‌రాక్ ఫార్మేషన్ ప్రభావం అధికంగా ఉన్న తెలంగాణ జిల్లాల్లో పరిమితికి మించి బోర్లువేయడం వల్ల భూగర్భజలాలు దారుణంగా పడిపోయాయని చెబుతున్నారు. ఈ కారణంగానే భూగర్భ జలవనరుల శాఖ జలప్రభ పథకం ఆచరణ సాధ్యం కాదంటూ తేల్చి చెప్పింది.
ప్రస్తుతం ఈ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన బీడు భూములన్నీ కూడా కొండలు, గుట్టల ప్రాంతాల్లో ఉండడం, అక్కడ బోర్లు వేసినా ఫలితం ఉండదని, ప్రభుత్వానికి స్పష్టంగా తెలిసినప్పటికీ పథకాన్ని అమలు చేయడం వెనుక ఆంతర్యమేమిటన్నది ఎవరికీ అంతు చిక్కని ప్రశ్నగా మారింది. ఈ పథకాన్ని అమలు చేయలేమంటూ పంచాయతీరాజ్, భూగర్భ జలవనరుల శాఖ, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖలు చేతులెత్తేసినప్పటికీ డ్వామాలకు అప్పగించడం ఆశ్చర్యం కలిగిస్తోందని భూగర్భ జలవనరుల శాఖ అధికారులు ప్రస్తావిస్తుండడం ఈ సందర్భంగా గమనార్హం. ఇదిలా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా 23 జిల్లాల్లో నాబార్డు ద్వారా 900 కోట్లు, ఉపాధిహామీ పథకానికి సంబంధించిన 900 కోట్లు మొత్తం 1800 కోట్ల రూపాయల అంచనాతో లక్ష బోర్లు వేయాలని తలపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం సాధ్యాసాధ్యాలు బేరీజు వేసుకోకుండా కోట్లాది రూపాయలు దుబారా చేస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఉపాధిహామీ నిధులను కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా దారి మళ్లించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎస్సీ, ఎస్టీలకు చెందిన పది లక్షల ఎకరాలను సాగుయోగ్యంగా మలచాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇందుకు సంబంధించి పది ఎకరాలకు ఒక బోరు చొప్పున సామూహిక బావుల తవ్వకానికి శ్రీకారం చుట్టింది. అయితే నిర్దేశిత ఎస్సీ, ఎస్టీల భూముల్లో బోర్ల తవ్వకానికి సంబంధించి ఫీజబులిటీ పాయింట్లను గుర్తించేందుకు జియాలజిస్టుల అవసరముంటుంది. భూగర్భ జలవనరుల శాఖ తమ వద్ద సిబ్బంది లేరంటూ చేతులెత్తేయడంతో రాష్ట్ర నీటి నిర్వహణ సంస్థ కేంద్ర కార్యాలయం మొత్తం 65 మంది జియాలజిస్టులను నిర్ణీత కాలవ్యవధితో నియమించింది. వీరికి నెలకు 24 వేల రూపాయల వేతనం చెల్లించేందుకు నిర్ణయించింది. అలాగే మరో 35 మంది ప్రైవేటు జియాలిస్టులతో కమీషన్ పద్ధతిపై ఒప్పందం కుదుర్చుకోగా భూగర్భ జలవనరుల శాఖకు చెందిన 40 మందిని డిప్యూటేషన్‌పై నీటి నిర్వహణ సంస్థలకు అప్పగించారు. వీరంతా ఆయా జిల్లాల్లోని ఎస్సీ, ఎస్టీల భూముల్లో సర్వే నిర్వహించి జలవనరులు లభ్యమయ్యే అవకాశమున్న మూడు పాయింట్లను గుర్తిస్తారు.
వర్టికల్ ఎలక్ట్రికల్ సౌండింగ్ పద్ధతిలో బోర్ పాయింట్లను గుర్తించిన తరువాతే డ్రిల్లింగ్ చేయాల్సి ఉండగా, ఫిక్స్‌డ్ టైమ్ ఎంప్లాయిమెంటు పద్ధతిపై తీసుకున్న సిబ్బందితో కాకుండా ఆయా జిల్లాల్లోని ప్రైవేటు జియాలజిస్టులతో సర్వేలు జరిపించి డ్రిల్లింగ్‌లు నిర్వహిస్తుండడం వల్ల ఒక్కో బోర్ పాయింట్‌కు లక్షా 70 వేల రూపాయల వరకు ఖర్చు పెడుతోంది. అయితే అసలు కిటుకంతా ఇక్కడే ఉంది. ప్రైవేటు జియాలజిస్టులకు ఒక్కో పాయింట్‌కు వేయి రూపాయల చొప్పున ఫీజు చెల్లిస్తుండడంతో సదరు జియాలజిస్టులు రిగ్గు ఓనర్లతో కుమ్మక్కై ఒకటి కంటే ఎక్కువ డ్రిల్లింగ్‌లు జరిపేలా సహకరిస్తున్నట్లు తెలుస్తోంది. దాంతో ఒక్కో బ్లాక్‌పై రిగ్గు ఓనర్లు కనీసం రెండు లక్షల ఆదాయం సమకూరేలా సంబంధిత అధికారులతో లాలూచి పడుతున్నట్లు భోగట్టా. వాస్తవానికి బోరుపాయింట్ గుర్తించిన తరువాత డ్రిల్లింగ్ జరిపేటప్పుడు రిగ్గు యజమానులు ఎంతలోతు డ్రిల్లింగ్ చేస్తున్నారనే విషయాన్ని గుర్తించేందుకు సాంకేతికంగా అవగాహన కలిగిన సిబ్బంది అక్కడే ఉండాలి. కానీ ఆచరణలో అలాంటిదేమీ కనిపించడం లేదు. రిగ్గు యజమాని ఇచ్చిన కొలతలనే ప్రామాణికంగా చేసుకొని బిల్లులు చెల్లిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అదీ కాకుండా చాలా జిల్లాల్లో ఒకరిద్దరు రిగ్గు ఓనర్లతోనే ఎంఓయులు చేసుకొని పెద్దఎత్తున అవినీతికి పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఎఫ్‌టిహెచ్, రోటరీ పద్ధతుల్లో బోర్‌వెల్ డ్రిల్లింగ్ జరుపుతున్నారు. ఒక్కో జిల్లాలో సగటున 50వేల ఎకరాలను ఈ పథకం కింద సాగులోకి తెచ్చేందుకు నిర్ణయించగా కరీంనగర్ జిల్లాలో 31వేల ఎకరాలకు 48 వేల కోట్ల రూపాయలతో 175 బోర్లు, 47 ఓపెన్ వెల్స్, మూడు ఫిల్టర్ పాయింట్లను వేయాలని నిర్ణయించారు. కాగా ఇప్పటివరకు రాష్ట్రంలో మెదక్ జిల్లా బోర్ల తవ్వకంలో అగ్రస్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడ వంద బ్లాక్‌లకు కోటి 69 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. ఆ తరువాతి స్థానంలో కరీంనగర్‌లో 146 బ్లాక్‌లకు గాను 65 డ్రిల్లింగ్ పూర్తి చేశారు. అలాగే ఖమ్మం, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో కూడా పెద్దఎత్తున పురోగతిలో ఉన్నట్లు తెలుస్తోంది.

No comments:

Post a Comment