Tuesday, February 28, 2012

చైనాకు పుంజుకుంటున్న గ్రానైట్ ఎగుమతులు

 

కరీంనగర్, ఫిబ్రవరి 23: కలర్ గ్రానైట్ పరిశ్రమకు ప్రసిద్ధిగాంచిన కరీంనగర్ జిల్లా నుండి చైనాకు తిరిగి ఎగుమతులు పుంజుకున్నాయి. జిల్లాలో 370కి పైగా ఉన్న గ్రానైట్ క్వారీల నుండి ప్రతి ఏటా దాదాపు రెండు లక్షల క్యూబిక్ మీటర్ల పైచిలుకు గ్రానైట్ బ్లాకులు చైనాకు ఎగుమతి అవుతున్నాయి. తద్వారా ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం సీనరేజీ రూపంలోమొత్తం 110 కోట్ల ఆదాయం సమకూరుతోంది. అయితే గతంలో ఉన్న సెల్ఫ్ రిమూవల్ విధానం కారణంగా గ్రానైట్ కంపెనీల యజమానులు ప్రభుత్వానికి తప్పుడు కొలతలతో విలువైన బ్లాకులను తరలించేవి. ఈ క్రమంలో మైనింగ్ అక్రమాలపై పెద్దఎత్తున విమర్శలు రావడంతో విజిలెన్స్ యంత్రాంగం స్టాక్‌యార్డులు, పోర్టులపై దాడులు జరిపింది. దాంతో గ్రానైట్ బ్లాకుల కొలతల్లో చోటుచేసుకున్న అవకతవకలు వెలుగుచూశాయి.
ప్రధానంగా చైనాకు ఎగుమతి చేసేందుకు కరీంనగర్ నుండి కాకినాడ పోర్టుకు తరలించిన బ్లాకులకు సంబంధించి కొలతల్లో భారీ వ్యత్యాసం కనుగొనడంతో ప్రభుత్వం ఎగుమతులకు బ్రేక్ వేసింది. ఫలితంగా నిన్న.. మొన్నటి వరకు కాకినాడ పోర్టు స్టాక్‌యార్డులో కరీంనగర్ గ్రానైట్ బ్లాకు నిల్వలు పెద్దఎత్తున పేరుకుపోయాయి. ఎగుమతులు స్తంభించిపోవడంతో గ్రానైట్ పరిశ్రమ సంక్షోభంలో పడింది. ఫలితంగా జిల్లా వ్యాప్తంగా సుమారు రెండు వందలకు పైగా క్వారీలు మూతపడే దశకు చేరుకున్నాయి. ఎగుమతులు పూర్దిగా నిలిచిపోవడంతో కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టిన వ్యాపారులు ఆర్థికంగా దివాళతీసే పరిస్థితికి చేరుకున్నారు. ఎట్టకేలకు ప్రభుత్వం పేనాల్టీలతో వదిలేయడంతో నిర్ణీత మొత్తాన్ని చెల్లించిన వ్యాపారులు తిరిగి తమ కార్యకలాపాలను ప్రారంభించారు. జిల్లాలో మొత్తం 370 కలర్ గ్రానైట్ క్వారీలుండగా ఇందులో 168 క్వారీలు నగర శివారులోని ఓడ్యారం ప్రాంతంలోనే ఉన్నాయి. జిల్లా మొత్తంలో లభించే విలువైన కలర్ గ్రానైట్‌లో దాదాపు 80 శాతం డిపాజిట్స్ ఇక్కడే ఉన్నట్లు మైనింగ్ నిపుణుల మాటల్ని బట్టి అర్థమవుతోంది. ఇక్కడ గ్రానైట్ రాళ్లను బ్లాకులుగా కత్తిరించి 1మీటర్ నుండి 10 క్యూబిక్ మీటర్ల పరిమాణంలో చైనాకు ఎగుమతి చేస్తున్నారు. చైనాలో గ్రానైట్ పాలిషింగ్ కుటీర పరిశ్రమగా ఉండటంతో చైనాకు అవసరమైన ముడి బ్లాకుల్లో 70 శాతం ఆంధ్రప్రదేశ్ నుండి ఎగుమతి అవుతోంది. ఇందులో కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఏటా మూడు వేల కోట్ల విలువైన 2లక్షల యాబై వేల క్యూబిక్ మీటర్ల గ్రానైట్ బ్లాకులు ఎగుమతి అవుతున్నాయి. ఇక్కడ లభిస్తున్న గ్రానైట్‌కు చైనాలో మార్కెట్ మంచి డిమాండ్ లభించడంతో జిల్లాకు చెందిన చాలా మంది వ్యాపారులు గ్రానైట్ వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ వరసలో కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌కు చెందిన శే్వత గ్రానైట్స్ ముందు వరసలో ఉంది.

No comments:

Post a Comment