Monday, March 5, 2012

కోల్ బెల్ట్ లో జార్ఖండ్ తరహా బొగ్గు మాఫియా

బొగ్గు మాఫియా..!

  • 05/03/2012
కరీంనగర్, మార్చి 4: రామగుండం పారిశ్రామిక ప్రాంతం క్రమంగా కోల్ మాఫియాకు అడ్డాగా మారుతోంది. బహిరంగ మార్కెట్‌లో టన్నుల బొగ్గుకు 1500 రూపాయల పై చిలుకు ధర పలుకుతుండటం బొగ్గు దొంగల పంట పండిస్తోంది. దాంతో రామగుండం, సెంటినరి కాలనీ, ఎన్‌టిపిసి ప్రాంతాల్లో బొగ్గు చౌర్యం ఒక వృత్తిగా మారింది. ఇదంతా ఒకెత్తయితే ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లికి చెందిన ఓ వ్యాపారి ఏకంగా కూలీలను పెట్టి మరీ బొగ్గు చౌర్యం చేయిస్తూ తాను రెండు చేతులా ఆర్జించటమే కాకుండా స్థానిక ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలు, పోలీసులకు ముడుపులు ముట్టజెపుతూ ధర్జాగా అక్రమ వ్యాపారం నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సింగరేణి, ఎన్‌టిపిసి సిబ్బంది కూడా శక్తి వంచన లేకుండా యధాశక్తి సహకరిస్తున్నారన్న విమర్శలున్నాయి. ఫలితంగా సింగరేణి విస్తరించి ఉన్న నాలుగు జిల్లాల్లో ఏటా బొక్కసానికి దాదాపు 12 కోట్ల రూపాయల పైచిలుకు చిల్లు పడుతున్నట్లు అంచనా. బెల్లంపల్లి, మందమర్రి, భూపాలపల్లి, కొత్తగూడెం, ఇల్లందు ప్రాంతాల్లోనూ దాదాపు ఇదే తరహాలో బొగ్గు తస్కరించబడుతున్నట్లు తెలుస్తోంది.
నల్ల బంగారంగా పిలువబడుతున్న బొగ్గు అక్రమార్కులకు కాసుల పంట పండిస్తోంది. సింగరేణి గనులు విస్తరించి ఉన్న రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కొంతమంది బడా రాజకీయ నాయకులు, పోలీస్ అధికారుల దన్నుతో జార్ఖండ్ కోల్ మాఫియాను తలదనే్న రీతిలో ఏటా సుమారు 12 కోట్ల రూపాయల విలువైన బొగ్గు లూటీ యదేశ్చగా సాగిపోతోంది. ఈ తతంగంలో రాజకీయ నేతలతో పాటు సింగరేణి, నేషనల్ థర్మల్ పవర్ స్టేషన్ సిబ్బంది, సింగరేణి సెక్యూరిటీఫోర్స్, సిఐఎస్‌ఎఫ్ సిబ్బంది పాత్ర కూడా ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల మాటలను బట్టి అర్థమవుతోంది. కరీంనగర్ జిల్లాలో ఈ వ్యవహారం గడచిన కొనే్నళ్లుగా గుట్టుగా సాగిపోతున్నప్పటికి ఇటీవలి కాలంలో మరీ అధికంగా చౌర్యం జరుగుతున్నట్లు గుర్తించారు. ప్రధానంగా రైళ్ల వ్యాగన్ల నుండే బొగ్గును తస్కరించడం ఎక్కువైపోయినట్లు గుర్తించారు. అదిలాబాద్ జిల్లా బెల్లంపల్లికి చెందిన ఓ వ్యాపారి సగటున రోజుకు 2 లక్షల నుండి 3 లక్షల రూపాయల వరకు బొగ్గు చౌర్యం కోసం కూలీలకు పెట్టుబడి పెడుతున్నట్లు తెలుస్తోంది. సుమారు రెండు వందల మంది కూలీలకు రోజుకు 200ల నుంచి 250 రూపాయల వేతనం చెల్లించి ఎన్‌టిపిసికి బొగ్గు రవాణా చేస్తున్న రైళ్ల వ్యాగన్ల నుండి 3 కిలోమీటర్ల పొడవునా బొగ్గును డంపింగ్ చేయిస్తున్నట్లు చెబుతున్నారు. రామగుండం థర్మల్ స్టేషన్‌కు విద్యుత్ ఉత్పాదన కోసం ప్రతిరోజు సుమారు రెండు రేకులు అంటే 40 వేల టన్నుల బొగ్గు అవసరమవుతుంది. దానికి అవసరమైన బొగ్గు నిల్వలు రామగుండం పరిధిలోని ఒపెన్‌కాస్ట్-1, 2, 3ల ద్వారా సరఫరా చేస్తున్నారు. రోజుకు మూడు రైళ్లద్వారా ఎన్‌టిపిసికి ఈ పరిమాణాన్ని రవాణా చేస్తున్నారు. అయితే అక్రమ బొగ్గు వ్యాపారంలో అరితేరిన బెల్లంపల్లికి చెందిన వ్యాపారి కూలీలను నియోగించి ఎల్కలపల్లి గేట్, లక్ష్మిపూర్, సెంటినరీ కాలనీ తదితర ప్రాంతాల్లో రైల్వే వ్యాగన్ల నుండి కిందపడేసి సంచుల్లో నింపి చెట్లపొదల్లో దాచిపెట్టి రాత్రి కాగానే ఆయా బ్యాగుల్లో ఉన్న బొగ్గు నిల్వలను లారీల్లోకి మార్చి రాష్ట్ర రాజదాని పరిసరాల్లో ఉన్న వివిధ రకాల పరిశ్రమలు, ఫెర్రోఅల్లాయిస్ ఫ్యాక్టరీలకు విక్రయిస్తున్నారు. అంతేకాకుండా కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లోని ఇటుక బట్టీ వ్యాపారులకు టన్నుకు 15 వందల రూపాయలు మొదలుకుని 1650 వరకు విక్రయిన్నట్లు తెలుస్తోంది. తన అక్రమ తతంగానికి అడ్డు తగలకుండా ఉండేందుకు సదరు వ్యాపారి స్థానిక ప్రజాప్రతినిధులు, పోలీసులకు ప్రతి నెలా నజరానగా భారీ మొత్తంలో సొమ్ములు ముట్టజెబుతున్నట్లు చెబుతున్నారు. అంతే కాదు కంచే చేను మేసిందన్నట్లుగా సాక్షాత్తు సింగరేణి అదికారులకు కూడా ఈ పాపంలో వాటాలున్నట్లు అరోపణలున్నాయి. అలాగే సింగరేణి ఆస్తుల రక్షణ కోసం ఏర్పాటు చేసిన సెక్యూరిటీ సిబ్బందికి కూడా భాగస్వామ్యం ఉన్నట్లు తెలుస్తోంది. ఒసిపి-2 డంప్ యార్డు నుండే బొగ్గు చౌర్యం అధికంగా జరుగుతున్నట్లు సమాచారం. ఈ విషయం తెలిసినా సంబందిత పోలీస్ అధికారులు గాని, సింగరేణి యాజమాన్యం కాని పట్టించుకున్న పాపాన పోలేదు. పైపెచ్చు బొగ్గు అక్రమ డంపింగ్‌కు పాల్పడే ముఠాలు ముందుగానే సంబందిత పోలీసులు, సిబ్బందికి సమాచారం అందిస్తారని, తద్వారా దొంగతనం జరుగుతున్నప్పుడు సిబ్బంది ఆ ప్రాంతాల వైపు కనె్నత్తికూడా చూడరని స్థానికులు చెబుతుండటం ఈ సందర్బంగా ఎంతైనా గమనించదగ్గ విషయమే. ఎన్‌టిపిసికి బొగ్గు సరఫరా చేసే రైల్వే వ్యాగన్లలో ముందుగానే పథకం ప్రకారం ఎక్కే కూలీలు ఎల్కలపల్లి అండర్ బ్రిడ్జ్, లక్ష్మీపూర్ ప్రాంతాల్లో లారీలను సిద్ధంగా ఉంచి నేరుగా వ్యాగన్ల నుంచి లారీల్లోకి డంప్ చేస్తున్నట్లు సమాచారం. ఇలా సగటున రోజుకు కనీసం రెండు, మూడు లారీలైనా చౌర్యం జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో బొగ్గు చౌర్యం కొత్త కాకపోయినా జార్ఖండ్ తరహాలో మాఫియా ముఠా సంస్కృతి పెరుగుతుండటమే అందోళన కలిగించే విషయం. జార్ఖండ్‌లోని బొగ్గు గనులు రాజకీయ నేతల కనుసన్నల్లోనే పనిచేస్తాయి. అక్కడ వాస్తవిక బొగ్గు ఉత్పత్తిలో దాదాపు 35 శాతం బొగ్గు మాఫియా తస్కరించి సొమ్ముచేసుకుంటోంది. అక్కడి గనులన్నీ కూడా మారుమూల అటవీ ప్రాంతాల్లో ఉండటం, నక్సల్ సమస్య అధికంగా ఉండటం వంటి అంశాల నేపథ్యంలో క్క్రడి ప్రభుత్వం బొగ్గు మాఫియా ముఠాలపై చర్యలు తీసుకోలేకపోతోంది. దాంతో గత దశాబ్ద కాలంగా చిన్నచిన్న దొంగతనాలతో కార్యకలాపాలు నెరిపిన ముఠాలు ఆయుదాలు సంపాదించి సమాంతర వ్యవస్థనే నడుపుతున్నాయి. తాజాగా రామగుండం ప్రాంతంలోనూ ముఠా సంస్కృతి పాదుకుంటున్నట్లు ఇటీవలి సంఘటనలు స్పష్టం చేస్తున్నాయి. ఇకపోతే బొగ్గును రేల్ వ్యాగన్ల నుండి క్రిందపడేసే క్రమంలో కూలీలు ప్రమాదవశాత్తు రైలు క్రిందపడి మరణిస్తున్న సంఘటనలు ఇటీవల కాలంలో తరుచుగా సంభవిస్తున్నాయి. గతంలో విద్యుత్ గాతానికి గురై అవయువాలు కోల్పోయి జీవశ్చావాలుగా బ్రతుకులీడుస్తున్న కూలీలు రామగుండం ప్రాంతంలో చాలా మంది కనిపిస్తారు.
పెరుగుతున్న తుపాకీ సంస్కృతి
ఉపాధి లేక ఖాళీగా ఉండే నిరుద్యోగులను ట్రాప్‌లో పడేస్తున్న కోల్ మాఫియా లీడర్లు యువకుల చేతికి అక్రమ ఆయుధాలను ఇచ్చి అసాంఘీక కార్యక్రమాలకు పాల్పడుతుండడం గోదావరిఖని ప్రాంతంలో సర్వసాధారణమైపోయింది. ఇన్‌ఫార్మర్ల పేరుతో సదరు యువకులకు పోలీస్ శాఖ అండదండలు కూడా పుష్కలంగా లభిస్తుండడంతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల ఈ వసూళ్ల వ్యవహారంలోనే ఐడి పార్టీ కానిస్టేబుల్ రమేష్ హత్య జరిగినట్లు ప్రచారం జరిగింది. హంతకుల వద్ద లభ్యమైన తుపాకి లైసెన్స్ జార్ఖండ్‌కు చెందిన ఓ బొగ్గు వ్యాపారి పేరుమీద ఉండడం సింగరేణిలోనూ మాఫియా సంస్కృతి వేళ్లూనుకుంటుందనడానికి తార్కాణంగా పేర్కొనవచ్చు. 

No comments:

Post a Comment