Monday, August 8, 2011

సందర్భం


- కె. శ్రీనివాస్

ఇక సామాన్యుడేమంటున్నాడు? ఆత్మత్యాగాలు ఆత్మహత్యలు వద్దు. పారిన రక్తం చాలు. ఆత్మహింసా వద్దు పరహింసా ప్రగల్భాలూ వద్దు. అసలు ఆ మాటలే వద్దు. ఐక్యంగా ఉండండి, ఉద్యమాన్ని నిలబెట్టండి, వాస్తవికతను బట్టి వ్యూహాలను రచించండి. విజయం ఎప్పుడు లభిస్తుందో, అసలు లభిస్తుందో లేదో మీ మనసుకు ముందే తెలిస్తే దాన్ని ప్రజలకు చెప్పండి. 2014 నిజమయితే, అదే చెప్పండి. అప్పటిదాకా సహనం ఇచ్చే కార్యక్రమం ఇవ్వండి. ఒకరినొకరు ఎగదోసుకునే క్రీడకు స్వస్తి చెప్పండి. మరింతమంది మిత్రులను కూడగట్టుకోండి. ఉద్యమాన్నీ రాజకీయాన్ని రెండుపట్టాల మీద కుదురుగా నడపండి. మభ్యపెట్టకండి.

రాష్ట్రంలో నెలకొని ఉన్న అనిశ్చితి తొలగాలని కోరుకునేవారికి చిదంబరం లోక్‌సభ ప్రకటనలో ఏదన్నా ఒక సానుకూల అంశం కనిపించి ఉంటే, అది ఒకే ఒక్కటి. ఏకాభిప్రాయ సాధనకు 'రెండువారాలు పట్టవచ్చు, రెండునెలలు పట్టవచ్చు' అన్న తరువాత రెండేళ్లయినా పట్టవచ్చు అంటాడేమో అని భయపడ్డవారికి 'మూడు నెలలు పట్టవచ్చు' అని చిదంబరం అనడం ఎంతో కొంత ఊరటే కదా? ఆయన మటుకు ఆయన గరిష్ఠంగా మూడునెలల వ్యవధి కోరుతున్నారు.

ఆ వ్యవధి సమస్య పూర్తి పరిష్కారానికి అనుకుంటే పొరపాటే. కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న సంప్రదింపుల ప్రక్రియ ఒక కొలిక్కి రావడానికి అంత సమయం అవసరం పడవచ్చని ఆయన అంచనా. ఆ తరువాత, రాష్ట్ర విభజన బంతిని రాష్ట్రంలోకే విసిరిన చిదంబర విన్యాసాన్ని దృష్టిలో పెట్టుకుంటే, తక్కిన పార్టీలలో అటువంటి ప్రక్రియ ఎప్పుడు మొదలయ్యేను, ఎప్పటికి పూర్తయ్యేను? కాంగ్రెస్ ముందుగా చెబితేనే తాము చెబుతామని భీష్మించుకున్న తెలుగుదేశం పార్టీ అటువంటి సహకారం అందిస్తుందా? ముందు చెప్పినవాళ్లకు ఒక ప్రాంతంలో మేలు, మరో ప్రాంతంలో కీడు జరిగే అవకాశం ఉన్నప్పుడు - అధికారపార్టీని సంకటంలో పడేసే పరిస్థితిని ప్రతిపక్షం ఉపయోగించుకోకుండా ఉంటుందా? ఏతావాతా తేలేదేమంటే, సమస్య సశేషం. కనుచూపుమేరలో పరిష్కారం లేదు.

అందుకేనేమో శనివారం నాడు కెసిఆర్, 2014 గురించి మాట్లాడారు. రెండేళ్లే కదా, ఎక్కడికి పోతారు, అప్పుడు చూపిద్దాం తడాఖా - అన్నారాయన. ఎన్నికల రంగం ఆయనకు అనువైన క్షేత్రం. అందులో ఆయనకు స్థానబలం ఎక్కువ. వీధిపోరాటాలూ మిలియన్‌మార్చ్‌లూ - వీటిమీద ఆయనకు గురి తక్కువ. చొక్కాలు చింపుకుంటేనే ఉద్యమమా - అని పార్టీ పెట్టిన తొలిరోజుల్లోనే ప్రశ్నించిన కెసిఆర్‌ను, తెలంగాణ ఉద్యమం చాలా దూరం తీసుకువచ్చింది. ఆయన నాయకహోదాకు భంగం కలిగించకుండానే, పగ్గాలు మాత్రం పూర్తిగా ఆయన చేతిలో లేకుండా చేసే పరిణామాలు పదేళ్లలో చాలానే జరిగాయి.

రాజకీయమైన లాబీయింగ్, ఎన్నికల పోరాటం- ఈ రెంటినే నమ్ముకోవడం కానీ, రాజకీయపార్టీలతో నిమిత్తం లేకుండా కేవలం ప్రజా ఉద్యమాల మీదనే ఆధారపడడం కానీ తెలంగాణ వంటి ఆకాంక్షల విషయంలో సరికాదని, రెంటినీ సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలనీ కూడా అవగాహన పెరిగింది. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర నిర్వహిస్తున్న రకరకాల జెఏసీలు - ఈ అవగాహననే సూచిస్తాయి. అయితే, ఇప్పటికీ, ప్రధాన స్రవంతి రాజకీయాలకూ, ప్రజా ఉద్యమాలకూ నడుమ అంతర్గత వైరుధ్యమూ ఘర్షణా తీవ్రంగానే కనిపిస్తున్నాయి.

సకలజనుల సమ్మె - ఒక సరికొత్త భావన. ప్రజా ఉద్యమాలు కొత్త పోరాట రూపాలను సృష్టించుకున్నట్టే, కొత్త పదాలను, పదబంధాలను కూడా సృష్టిస్తాయి. అటువంటి వాటిలో సకలజనుల సమ్మె కూడా ఒకటి. 'చలో సీఎం ఇల్లు ముట్టడి' అని ఎమ్మార్పీస్ మొదటిసారి పిలుపు ఇచ్చినప్పుడు కూడా ఆ పదబంధం ఇంతే కొత్తగా వినిపించింది. తెలంగాణ ఉద్యమాన్ని తీవ్రంగా వ్యతిరేకించేవారు కూడా ముచ్చటపడవలసిన పోరాట రూపం సకలజనుల సమ్మె. ఈ నెల రెండో పక్షం లో ప్రారంభమయ్యే ఈ సమ్మె తెలంగాణ ఉద్యమానికి మరింత తీవ్రతను, ప్రభుత్వంపై మరిం త ఒత్తిడిని కలిగించనున్నది. ఉద్యమంలో తమ భాగస్వామ్యం కోసం, ఉద్యమఫలితాలలో తమ వాటా కోసం పోటీపడుతున్న విభిన్న రాజకీయశక్తులు పరస్పరం విధించుకుంటున్న ఒత్తిడుల మధ్య ఈ సమ్మె జరుగనున్నది.

తెలంగాణకు చెందిన తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు రాజీనామాలు చేయడంతో మొదలైన రాజకీయ ఒత్తిడి, కాంగ్రెస్ రాజీనామాలతో పుంజుకున్నది. ఎంతో కష్టం మీద ప్రజాప్రతినిధులు రంగంలోకి దిగారని, వారు దారితప్పకుండా చూడడమే తమ పని అని తెలంగాణ ఉద్యమనాయకులు బహిరంగంగానే చెప్పారు. రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేలు, ఎంపీలకు మద్దతుగా కావచ్చు, వారు జారిపోకుండా దిగ్బంధనం చేయడానికి కావచ్చు, విస్త­ృతమైన ఉద్యమకార్యాచరణను వివిధ వేదికలు ప్రకటించాయి. అందులో భాగంగానే సకలజనుల సమ్మె ప్రతిపాదన ముందుకు వచ్చింది.

రాజకీయపార్టీలకూ ప్రజా ఉద్యమాలకూ ఉండవలసిన సంబంధం రీత్యా ఈ వ్యూహం ప్రశంసనీయమే. పైకి వినిపిస్తున్న ప్రకటనలను పరిగణనలోకి తీసుకుంటే, రాజకీయశక్తుల మధ్య పరస్పరమైన ఒత్తిడి ఇంకా పనిచేస్తూనే ఉన్నది. కానీ, మారిన పరిస్థితులలో, రాజకీయవాదుల కట్టుబాటు సందేహాస్పదం అయిన నేపథ్యంలో సమ్మె ప్రాసంగికత ఎంత, ఫలితం ఎంత అన్నది చర్చనీయాంశాలుగా మారాయి. శాసనసభ్యుల రాజీనామాలను స్పీకర్ తిరస్కరించారు. మళ్లీ రాజీనామాలు చేయాలన్న డిమాండ్ కానీ, చేసే యోచనగానీ బలంగా కనిపించడం లేదు.

గతంలో మొదట రాజీనామా చేసి కాంగ్రెస్‌వారిని అనివార్యస్థితికి నెట్టినట్టు, తెలుగుదేశం శాసనసభ్యులు ఈ సారి కూడా చేస్తారా? చేయగలరా? సోనియా అనారోగ్యం వార్తలు వచ్చిన తరువాత కూడా కాంగ్రెస్ తెలంగాణ ఎంపీలు లోక్‌సభకు వెళ్లకుండా పట్టుదల చూపిస్తున్నారు కానీ, భావోద్వేగాలతో చేసినవన్న కారణం చెప్పి వారి రాజీనామాలను లోక్‌సభ స్పీకర్ నిరాకరిస్తే అప్పటి పరిస్థితి ఏమిటి? మళ్లీ రాజీనామాలు చేస్తారా? సోనియా అస్వస్థులై ఉన్నప్పుడు పార్టీని, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టకూడదని భావిస్తారా? అప్పుడు సమ్మెకు, ఉధృత ఉద్యమానికి దిగిన ఉద్యోగులు, విద్యార్థుల పరిస్థితి ఏమిటి? రాజీనామాల నడుమ, రాష్ట్రంలో మళ్లీ మొదలయిన ఆత్మహత్యల నడుమ కూడా చిదంబరం ద్వారా నిమ్మకు నీరెత్తినట్టు మాట్లాడించిన కేంద్రం వైఖరిని గమనించిన తరువాత, సమ్మెను అణచివేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సకల సన్నాహాలను చూస్తున్న తరువాత- సకలజనుల సమ్మె సమయమూ సందర్భమూ ఉచితమైనదే అవుతుందా? నిజంగానే నిజంగానే అది అంతిమ ఫలితం ఇస్తుందా? నిజానికి రాజీనామాల వంటివి ఒక పరాకాష్ట దశలో చేపట్టవలసిన బ్రహ్మాస్త్రాలు.

తెలంగాణ ఉద్యమం తీరుతెన్నులేమిటో కానీ, బ్రహ్మాస్త్రాల దాకా వెళ్లి, తిరిగి వంటావార్పులకు దిగవలసివచ్చిన సందర్భాలు అనేకం. ప్రజల్లో ఆకాంక్ష , సహనం బలంగా ఉండడం వల్ల ఎన్నిసార్లైనా మళ్లీ మొదటికి రావడానికి సంకోచించడంలేదు. సకలజనుల సమ్మె వంటి అత్యున్నత ఉద్యమరూపం పూర్తిగా విజయవంతం కాకున్నా, విఫలం అయినా, ఫలితాలను సాధించలేకపోయినా- ప్రజల్లో కలిగే నిస్ప­ృహ అధికంగా ఉంటుంది. సహాయనిరాకరణ సందర్భంగా, ఒంటరిగా ఉద్యమం బరువును మోయవలసివచ్చిన గుణపాఠం ఉద్యోగవర్గాలకు ఉన్నది.

తెలంగాణ కోసమే పుట్టిన రాజకీయపార్టీ, పదేళ్లు గడచినా, క్షేత్రస్థాయిలో కార్యకర్తలను నిర్మించుకోవడానికి, పార్టీకి వివిధ అంచెల యంత్రాంగాన్ని ఏర్పరచుకోవడానికి విముఖంగా ఉన్న స్థితిలో తెలంగాణ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు మాత్రమే ఉద్యమానికి స్థిరమైన బలగంగా ఉంటూ వచ్చారు. ఫలితంగా వచ్చిన కష్టనష్టాలను భరిస్తూ వచ్చారు. ఇంకా ఆ పరిస్థితి కొనసాగవలసిందేనా- అన్న ప్రశ్నలు ఉద్యోగనేతల నుంచే వినిపిస్తున్నాయి.

వివిధ రాజకీయశక్తులు, అనేక జేఏసీలు, వాటి మధ్య సామాజికకోణం నుంచి, నాయకత్వ పోటీ నుంచి అనేక వైరుధ్యాలు. ఇవి కాక- ఉభయప్రాంతాల రాజకీయనేతల మధ్య వాగ్యుద్ధాలు, ఆత్మాహుతిదళాల, ఆత్మరక్షణదళాల ప్రకటనలు, తెలంగాణ రాకపోతే విషం పుచ్చుకుని చస్తానని బాధ్యతారహితంగా మాటతూలే ఉద్యమనేతలు, సమ్మెకు సహకరించకపోతే భౌతికదాడులు చేయాలనే పిలుపులు, ప్రతిదాడులు చేస్తామనే స్పందనలు- ఇవన్నీ తెలంగాణ సమస్యను మరింత సంక్లిష్టమూ ప్రమాదభ రితమూ చేస్తున్నాయి. ఎట్లాగైనా హింస జరిగేట్టు చూసి అణచివేయాలని ప్రభుత్వం చూస్తున్నది- అని కలవర పడుతున్న తెలంగాణవాదులూ ఉన్నారు.

ఎంతకాలమిట్లా, ఏదైనా గట్టిగా చేయాలని అసహనంతో ఉన్న ఉద్యమకారులూ ఉన్నారు. మీడియాలో వచ్చే ప్రకటనలు చూసే గుండెలు పగులుతున్న యువకులూ ఉన్నారు. అయ్యా, హింసకు మాటల్లోనూ చేతల్లోనూ ఆస్కారం ఇవ్వకండి, ఒక చిన్న సంఘటన జరిగిందా, ఉద్యమం మళ్లీ నలభయ్యేళ్ల వెనక్కి వెడుతుంది- అని హితవు చెప్పే పరప్రాంతీయులూ ఉన్నారు. ఎంతకాలమిట్లా, ఎమ్మెల్యే అయినప్పటి నుంచి అధికారం అనుభవించిందీ లేదు, నాలుగు డబ్బులు చూసిందీ లేదు- అని చిరాకుపడుతున్న స్వప్రాంతీయనేతలూ ఉన్నారు. వీటన్నిటి మధ్య తెలంగాణ నివురుగప్పిన నిప్పులాగా ఉన్నది.

ఇక సామాన్యుడేమంటున్నాడు? ఆత్మత్యాగాలు ఆత్మహత్యలు వద్దు. పారిన రక్తం చాలు. ఆత్మహింసా వద్దు పరహింసా ప్రగల్భాలూ వద్దు. అసలు ఆ మాటలే వద్దు. ఐక్యంగా ఉండండి, ఉద్యమాన్ని నిలబెట్టండి, వాస్తవికతను బట్టి వ్యూహాలను రచించండి. విజయం ఎప్పుడు లభిస్తుందో, అసలు లభిస్తుందో లేదో మీ మనసుకు ముందే తెలిస్తే దాన్ని ప్రజలకు చెప్పండి. 2014 నిజమయితే, అదే చెప్పండి. అప్పటిదాకా సహనం ఇచ్చే కార్యక్రమం ఇవ్వండి. ఒకరినొకరు ఎగదోసుకునే క్రీడకు స్వస్తి చెప్పండి. మరింతమంది మిత్రులను కూడగట్టుకోండి. ఉద్యమాన్నీ రాజకీయాన్ని రెండుపట్టాల మీద కుదురుగా నడపండి. మభ్యపెట్టకండి.

No comments:

Post a Comment